breaking news
compitative exams
-
పరీక్షలతో ఒత్తిడిగా ఫీలవుతున్నారా? అయితే ఇలా చేయండి..!
"పదో తరగతి, ఇంటర్ పరీక్షలతోపాటు పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నోటిఫికేషన్లు వచ్చాయి. టెన్త్ పరీక్షలకు దాదాపు నెల రోజుల సమయం ఉండగా, ఇంటర్మీడియెట్ పరీక్షలకు రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో పిల్లలు చాలా కష్టపడి చదువుతుంటారు. ఉత్తమ మార్కులు సాధించాలన్న ఒత్తిడి వారిలో అధికంగా ఉంటుంది. అత్యుత్తమ మార్కులు సాధించాలన్న లక్ష్యంతో సమయాన్ని వృథా చేయకుండా చదువుతుంటారు. సరిగా నిద్ర పోరు. ఆహారం కూడా సరిగా తీసుకోరు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపరు. ప్రణాళిక లేమి స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఫలితంగా తీవ్రమైన ఆందోళన, మానసిక సమస్యలకు గురవుతారు. పైగా మార్కుల గురించి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల భారీ అంచనాలు కూడా వీరిని కుంగుబాటుకు గురిచేసే ప్రమాదముంది. పరీక్షల కోసం సిద్ధమయ్యేటపుడు లేదా జరుగుతున్నపుడు విద్యార్థులు, అభ్యర్థులు పలు విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించేందుకు, కుంగుబాటు నుంచి తప్పించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..!" ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి.. పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థులు సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. జంక్ ఫుడ్ తాత్కాలికంగా మంచి అనుభూతినిస్తుంది.. కానీ, ఇది జీవక్రియలను మందగింపజేసి అలసటకు, బద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి, సమతుల ఆహారం తీసుకోవడంపై దృష్టి సారించండి. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే పాలు, పెరుగుతో తయారు చేసిన పదార్థాలతోపాటు మాంసకృత్తులు కలిగివున్న కోడిగుడ్డును తినాలి. పండ్లలో అరటి, యాపిల్, బొప్పాయి, సపోటా పండ్లను తింటే మెదడు చురుకుగా పని చేస్తుంది. మంచి ఆహారం తీసుకోవడంతోపాటు శరీరంలో నీటిశాతం తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతి రోజు ఎనిమిది పెద్ద గ్లాసుల నీటిని తాగాలి. పుష్కలంగా నీరు తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్గా ఉండండి. మీ స్టడీ డెస్క్పై, మీతోపాటు వాటర్ బాటిల్ను పెట్టుకోండి. నీటితోపాటు పుదీనా ఆకులు, లేదా నిమ్మకాయలతో తయారు చేసిన రసాయనాలను తీసుకోండి. ఈ సీజన్లో మీ శరీరం డీహ్రెడేషన్కు గురవుతుంది. కాబట్టి నీటితోపాటు జ్యూస్లు తీసుకోవడం చాలా కీలకం. కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్ వంటి ఉత్ప్రేరక పదార్థాలు ఒత్తిడిని పెంచే అవకాశాలు అధికంగా ఉంటాయి. వీటికి దూరంగా ఉండాలి. సమయానికి తినాలి.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో టైం టు టైం భోజనం చేయాలి. పరీక్షలకు సన్నద్ధమయ్యేటపుడు, పరీక్షా సమయాల్లో భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్యం, చికాకు, తక్కువ శక్తికి దారితీయవచ్చు. పరీక్షల సమయంలో షెడ్యూల్ పెట్టుకోండి. దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తినేలా చూసుకోండి. జ్ఞాపకశక్తిని పెంచేలా.. జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అవసరం. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్నట్లు, అవిసె గింజలు (అల్సీ), గుమ్మడికాయ గింజలు, నువ్వుల గింజలు (టిల్), సోయాబీన్ నూనె, కనోలా నూనె వంటివి తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో కూడిన సప్లిమెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పరీక్షల సమయంలో వీటిని తీసుకోవాలి. ఫ్రీ రాడికల్స్తో పోరాడడం ద్వారా, విటమిన్లు A, C, E వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక ఒత్తిడి కారణంగా మెదడు కణాలకు హానిని తగ్గిస్తాయి. ఎక్కువగా మేలుకోకూడదు.. రాత్రి వేళల్లో ఎక్కువసేపు మేల్కొని చదవడం వల్ల శరీరంలో కూడా వివిధ రకాల ప్రభావాలు ఏర్పడతాయి. ప్రధానంగా ఒత్తిడిని మరింత పెంచడంతోపాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. అందువల్ల విద్యార్థులు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు విధిగా నిద్రపోవాలి. సంపూర్ణ విశ్రాంతి పొందిన తర్వాత పరీక్షల తయారీకి తిరిగి కొత్త ఉత్సాహం పుంజుకోవచ్చు. తద్వారా మీరు చదివినదంతా మెరుగ్గా గుర్తు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వ్యాయామం అవసరం! రోజూ కనీసం 15–20 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. తద్వారా శరీరం, మనసు కూడా పునరుత్తేజం పొందుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి దూరమై మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఫలితంగా మన శక్తిసామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. విరామం ముఖ్యం.. పరీక్షల సమయం ముంచుకొచ్చే కొద్ది అనేక మంది విద్యార్థులు క్షణం తీరిక లేకుండా చదువుతుంటారు. ఇలా చదవడం వల్ల మెదడుపై వత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా చదివిన విషయాలు గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల విద్యార్థులు విడతల వారీగా విరామం తీసుకోవడం చాలా అవసరం. తేలికపాటి ఆటలు, సామాజిక–ఆధ్యాత్మిక కార్యకలాపాలు, సంగీతం, డైరీ రాయడం, చిత్రలేఖనం తదితర అభిరుచులతో మనసు తేలికపరుచుకోవాలి. టైం టేబుల్ ప్రకారం.. పరీక్షలకు సమయం తక్కువ ఉన్నందున విద్యార్థులు ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి అనే విషయంపై ఓ ప్రణాళికను రూపొందించుకోవాలి. అందుకు అనుగుణంగా టైం టేబుల్ను కూడా తయారు చేసుకొని ఆ సమయం ప్రకారం చదవాలి. చాలా మంది విద్యార్థులు కష్టతరమైన సబ్జెక్టులను చివరగా చదవుదామన్న అభిప్రాయం ఉంటుంది. అయితే ఇది సరైన అభిప్రాయం కాదని విద్యావేత్తలు అంటున్నారు. ముందు కష్టతరమైన పాఠ్యాంశాలను చదవడం పూర్తి చేస్తే ఆ తరువాత సులభతరమైన పాఠ్యాంశాలను త్వరగా చదివి పూర్తి చేసుకోవచ్చు. ఒత్తిడిని సూచించే కొన్ని సంకేతాలు.. కడుపులో తిప్పుతున్న అనుభూతి వికారంగా అనిపించడం అరచేతుల్లో చెమటలు పట్టడం మైకం కమ్మినట్లు అనిపించడం గుండె వేగంగా కొట్టుకోవడం మెదడులో శూన్య భావన ఏకాగ్రత లోపం అయోమయం, భారంగా, నిస్పృహగా అనిపించడం కుదురుగా ఉండకపోవడం, రోదించడం, పళ్లు కొరకడం, వ్యాకులత, అటూ ఇటూ తిరగడం, గోళ్లు కొరకటం వంటివి ‘నేనిది చేయలేను’, ‘నేనిందుకు తగను’ వంటి ఆలోచనలు. మరిన్ని జాగ్రత్తలు! సబ్జెక్టుకు సంబంధించిన అవసరమైన వివిధ చర్చనీయాంశాలు, తేదీలు, వనరుల గురించి ముందుగానే సమాచారం సేకరించుకోవాలి. దీనివల్ల చివరి నిమిషపు హడావుడి తప్పుతుంది. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చదువుకు తగిన వాతావరణం సృష్టించుకోవడం కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఏ పనినైనా ఓ క్రమపద్ధతి ద్వారా చేయడం వల్ల సమయాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. పని పూర్తి చేయడానికి మీకెంత సమయం పడుతుందో వాస్తవ అంచనా వేసుకుని, దానికి కట్టుబడటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. పరీక్ష రోజున మీకు కావాల్సినవేమిటో నిర్ణయించుకుని ముందు రాత్రే సిద్ధంగా ఉంచుకోండి. అలాగే పరీక్షకు వెళ్లేముందు మీకు ఆందోళనగా అనిపిస్తే కాస్త నిదానించి, నిండైన శ్వాసతో ఏకాగ్రత సాధనకు ప్రయత్నించండి. నిండుగా ఊపిరి పీలుస్తూ 3 అంకెలు లెక్కించండి. ఆపైన ఊపిరి బిగబట్టి 3 అంకెలు, ఊపిరి విడుస్తూ 3 అంకెలు లెక్కించండి. ఇలా మీరు స్థిమితపడే దాకా శ్వాస మీదనే ధ్యాసను కొనసాగించండి. పరీక్ష వేళ ప్రశ్నపత్రంలో మీకు జవాబు తెలిసిన ప్రశ్నలకే ముందు సమాధానాలు రాయండి. ఇతరులు ఏం చేస్తున్నారో పట్టించుకోకండి. డాక్టర్ను సంప్రదించండి.. పరీక్షల సమయంలో మానసిక సమస్యలు, ఒత్తిడి, కుంగుబాటుకు గురైనపుడు అందుబాటులో ఉన్న సమాచారంతో స్వీయవైద్యానికి ప్రయత్నించకూడదు. పరిస్థితి తీవ్రతను బట్టి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అవసరమైనపుడు డాక్టర్ను తప్పకుండా సంప్రదించాలి. ఈ మధ్య నిర్మల(పేరు మార్చాం)కు నిద్రపట్టడం పెద్ద సమస్యగా మారింది. భోజనం కూడా సరిగా చేయాలనిపించడం లేదు. తరచూ తలనొప్పితో బాధపడుతోంది. చీటికీమాటికీ చిరాకు పడుతోంది. కుంగుబాటుకు లోనవుతోంది. రోజురోజుకూ మరింత ఆందోళనకు గురవుతోంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటోంది. దీంతో సరిగ్గా చదవలేకపోతోంది. దీనికంతటికీ కారణం త్వరలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండటం. ఆమె పరీక్షలకు సిద్ధమయ్యే ప్రయత్నం బాగా చేస్తున్నా అనవసర భయాందోళనలకు గురవుతోంది. ఇది ఒక్క నిర్మల సమస్యే కాదు.. టెన్త్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది విద్యార్థుల పరిస్థితి. మొబైల్ ఫోన్ను పక్కన పెట్టేయాలి.. ప్రతి విద్యార్థి పరీక్షల సమయంలో కచ్చితంగా మొబైల్ ఫోన్ను పక్కన పెట్టేయాలి. పూర్తిగా చదువు మీదనే శ్రద్ధ ఉంచాలి. మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తే చదువుకున్నప్పటికీ ఏకాగ్రత సన్నగిల్లుతుంది. దీంతోపాటు మంచి నిద్ర, ఆహారం తీసుకోవాలి. కొన్ని గంటల పాటు చదివిన తరువాత మొక్కలకు నీళ్లు పోయడం, పెయింటింగ్, ఇతర మంచి అలవాట్లతో రిలాక్స్ కావాలి. తరువాత మరలా చదువుపై దృష్టి సారించాలి. – పి.వి.సునీత, సైకాలజిస్ట్, వన్స్టాప్ సెంటర్ మార్కులు, గ్రేడ్లు ముఖ్యం కాదు.. పరీక్షల సమయంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రుల పాత్ర కూడా ఇందులో ఉంది. పిల్లలు తగినంత నిద్రపోయేలా చూడాలి. మంచి ఆహారం తినేలా చూడాలి. అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా వారిని ప్రోత్సహించాలి. మార్కులు, గ్రేడ్లు మాత్రమే జీవితం కాదని ధైర్యం చెప్పాలి. – డాక్టర్ వెంకటరాముడు, సూపరింటెండెంట్, మానసిక వైద్యశాల, రిమ్స్ -
టీఎస్పీఎస్సీ మీద మాకు నమ్మకం లేదు...ఆందోళనలో విద్యార్ధులు
-
ఇంతకూ ఏ పరీక్ష రాయాలి?
సాక్షి, గుంటూరు: ఒకే రోజున రెండు పోటీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో నిరుద్యోగులు సంకట స్థితిలో చిక్కుకున్నారు. ప్రస్తుతం గ్రూప్–2 అభ్యర్థులు ఇదే విషయంపై తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. 446 గ్రూప్–2 పోస్టులకు వచ్చే నెల 5న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనుంది. ఈ పోస్టులకు మొత్తం మూడు లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అదే రోజున ఎల్ఐసీ ఏఏఓ (గ్రాడ్యుయేట్ లెవల్) పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్ రాయబోతున్నవారిలో చాలామంది ఎల్ఐసీ ఏఏఓ పరీక్షకు కూడా దరఖాస్తు చేశారు. దీంతో రెండింటిలో ఏ పరీక్షకు హాజరుకావాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా వీఆర్ఏలు, వీవోఏలు, కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం గ్రూప్–2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెలవులు లభించక గ్రూప్–2 పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారు. దీంతో వాళ్లంతా పరీక్షలు వాయిదా వేయాలని లేకుంటే అవకాశం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని ఏపీపీఎస్సీ రెండు పరీక్షలను ఒకే రోజు నిర్వహిస్తుండటం వల్ల తాము నష్టపోతాం కాబట్టి గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు పలుమార్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్భాస్కర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా కూడా చేశారు. అయితే ప్రభుత్వం పట్టించుకోలేదు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నియామక పరీక్షలు ఉన్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ నియామక పరీక్షలను వాయిదా వేయడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఆనవాయితీని తుంగలో తొక్కి అన్యాయం చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో సైతం కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ నియామక పరీక్షలు నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఈస్టర్ పండుగ నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరినా ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. ఇదే తరహాలో గ్రూప్–2 పరీక్షను సైతం నిర్వహిస్తే గ్రూప్–2, ఎల్ఐసీలో ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సి ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష వాయిదా వేయాలి గ్రూప్–2, ఎల్ఐసీ ఏఏఓ పోస్టులకు దరఖాస్తు చేశా. ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటంతో ఏ పరీక్షకు హాజరవ్వాలో తెలియడం లేదు. రూ.లక్షలు ఖర్చుపెట్టి ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. ఈ తరుణంలో రెండు పరీక్షలను ఒకే రోజు నిర్వహించడం సమంజసం కాదు. ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసి మాకు న్యాయం చేయాలి. – వెంకట్, గ్రూప్–2, ఎల్ఐసీ ఏఏఓ అభ్యర్థి, గుంటూరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి.. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్టు పరీక్షలు నిర్వహిస్తూ లక్షలాదిమంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. మే 5న ఎల్ఐసీ, గ్రూప్–2 పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్–2ను వాయిదా వేయాలి. లేదంటే నిరుద్యోగులు ఉద్యోగావకాశాలను కోల్పోతారు. – సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
జనగామ అర్బన్ : పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, గ్రూపు–4 పోటీ పరీక్షల కోసం అర్హులైన వారికి 60 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీసీపీ మల్లారెడ్డి, డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ, పోలీస్శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘వారధి’ సంస్థ కరీంనగర్ సహకారంతో సుమారు 400 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను సదరు సంస్థ భరిస్తుందని తెలిపారు. శిక్షణార్థులకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ శిక్షణ సంస్థల ప్రతినిధులు తరగతులు బోధిస్తారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ఆయా మండలాల్లోని పోలీస్ స్టేషన్న్లలో ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు తీసుకుని తమ పేర్లను నమోదు చేసుకుని, వెంటనే అర్హత పరీక్షకు సంబంధించిన హాల్టికెట్ పొందవచ్చునని తెలిపారు. అదేవిధంగా వీఆర్వో, గ్రూపు–4 పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని చాకలి అయిలమ్మ జిల్లా సమాఖ్యలో ఈనెల 22 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి కోరారు. ఈనెల 24న యశ్వాంతాపూర్ గ్రామ శివారులోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం కానిస్టేబుల్స్ అభ్యర్థులకు, మధ్యాహ్నం వీఆర్వో, గ్రూపు–4 అభ్యర్థులకు అర్హత పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు కూడా ఉచిత శిక్షణ అని అనుకోవద్దని, ప్రమాణాలు పాటించి నిష్ణాతులైన వారిచే బోధించనున్న తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే పీహెచ్సీ (వికలాంగ) అభ్యర్థులకు వసతి కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో మాలతి, ఏసీపీ బాపురెడ్డి, డీఆర్డీఓ కార్యాలయ అధికారి రాజేంద్రప్రసాద్, ఈజీఎస్ ప్రతినిధులు, ఆయా మండలాల పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు శిక్షణ
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అ భ్యర్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత శిక్షణ ఇవ్వన్నుట్టు గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయవరపు శ్రీరామ్మూర్తి లె లిపారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని చెప్పారు. శిక్షణకు హాజర య్యే అభ్యర్థుల దరఖాస్తులు వంద దాటితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. ఇప్పటికే రూ.20 లక్షల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలు కొనుగోలు చేశామని, మరో రూ.60 లక్షల పుస్తకాలు త్వరలో కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేస్తామని, ఈ–లైబ్రరీలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. 14 గ్రంథాలయాలకు రూ. 171.25 లక్షలతో మరమ్మతులు , నూతన భవనాల నిర్మాణం చేపట్టేందుకు ఇంజినీరింగ్ శాఖకు సొ మ్ము చెల్లించామన్నారు. వేల్పూరు, నరసాపురంలో శాఖా గ్రంథాలయాల కోసం త్వరలో భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ఉప గ్రంథ పాలకులు డి.వెంకటరమణ, జిల్లా కేంద్ర గ్రంథాలయం అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఎల్.వెంకటేశ్వరరావు, సమన్వయ కర్త పి.గిరిబాబు పాల్గొన్నారు