breaking news
companys
-
ఏఐ జోష్ ఎలా బాస్!
కాలంతోపాటు ఉద్యోగుల పనితీరూ మారుతుంటుంది. ఆ పనితీరు ఎలా ఉండబోతుందనేదే అసలు సిసలు ప్రశ్న! ఇంతకీ 2026లో ఎలా ఉండబోతోంది? ‘ కంపెనీ అంటే ఏ.ఐ. మాత్రమే... ఉద్యోగులు నామమాత్రమే!’ అన్నట్లుగా ఉండబోతుందా? ‘ఏ.ఐ. తాతలు దిగివచ్చినా ఉద్యోగి ఉద్యోగే’ అన్నట్లుగా ఉండబోతుందా? ‘ఎట్ లీస్ట్ 70 అవర్స్ ఏ వీక్’ అంటున్నారు నారాయణమూర్తి.‘ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు... వారానికి ఆరురోజులు మాత్రమే’ అంటున్నారు ఆలీబాబా ఫౌండర్ జాక్ మా. ఈ పెద్దల ప్రతిపాదనలు ఉద్యోగులకు నచ్చాయా? పనితీరును, ఉత్పాదకతను మెరుగుపరుచుకోవడం నుంచి ఉద్యోగానికి ఆవలి ప్రపంచాన్ని ఆస్వాదించడం వరకు కొత్త సంవత్సరంలో వచ్చే మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం...భవిష్యత్లో ఉద్యోగుల పనితీరు ఎలా ఉండబోతుంది? కంపెనీలకు మాత్రమే మేలు చేసేలా ఉంటుందా? ఉద్యోగులకు మాత్రమే మేలు చేసేలా ఉంటుందా? సాంకేతికతే సర్వస్వం అన్నట్లుగా ఉంటుందా? నైతిక విలువలకు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు చోటు ఉంటుందా? నిపుణులు చెప్పే సమాధానం మాత్రం ఇది.... ‘ఎంతమాత్రం ఏకపక్షం కాబోదు. కంపెనీకి, ఉద్యోగులకు పరస్పర ప్రయోజనకరంగానే ఉంటుంది’⇒ జీవనోత్సాహ ఉద్యోగంగతంతోపోలిస్తే... ‘ఏదో ఒక ఉద్యోగం లే’ అని సరిపెట్టుకోవడం లేదు యువత. ‘ఈ ఉద్యోగం నా కెరీర్కు ఏ మేరకు ఉపయోగపడుతుంది?’ అనే కోణంలో విశ్లేషించుకుంటున్నారు. ‘ఉద్యోగం అనేది జీవితాన్ని నిర్వీర్యం చేసేది కాదు, జీవనోత్సాహాన్ని ఇచ్చేది’ అనే ఎరుకతో జాగ్రత్తగా ఉద్యోగాలు ఎంచుకుంటున్నారు. ‘చాలామంది ఉద్యోగులు తమ కెరీర్లో ఉన్నతిని కోరుకుంటున్నప్పటికీ, ఉద్యోగ జీవితానికి ఆవలి ప్రపంచాన్ని కూడా ఆస్వాదించాలనుకుంటున్నారు’ అంటున్నారు ముంబైకి చెందిన వర్క్–లైఫ్ బ్యాలెన్స్ కోచ్ భక్తి తలాటీ. వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోతే...భారీ జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలి, వ్యక్తిగత స్చేచ్ఛకు అవకాశం ఇచ్చే చిన్న ఉద్యోగాల్లో సైతం చేరేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే పనిగంటలకు సంబంధించి నారాయణమూర్తి, జాక్ మా ప్రతిపాదనలతో ఏకీభవించే వారితోపాటు తీవ్రంగా విభేదించే వారు కూడా యువతరంలో ఉన్నారు.⇒ ఇప్పుడు కావాలి... ఆరోగ్యకరమైన పనితీరు‘ఆరోగ్యకరమైన పనితీరు’కుప్రాధాన్యత పెరుగుతోంది. ఆరోగ్యకరమైన పనితీరుకు సంబంధించి తమ సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి మిలీనియల్స్ ఆసక్తి చూపుతున్నారు. 2026లో... కంపెనీలలో భారీ జీతానికి ప్రతిభ, శ్రమ మాత్రమే తప్పనిసరి కొలమానం కాబోతోంది. ప్రతిభ కనబరిచే ఉద్యోగులను త్వరగా పై స్థాయికి తీసుకువెళ్లడం, ఉద్యోగులకు అనుకూలమైన లీవ్ పాలసీలు, అనుకూలమైన పనిగంటలు...మొదలైనవి కంపెనీల ప్రాధాన్యత జాబితాలో చేరనున్నాయి.⇒ అది ట్రెండ్ మాత్రమే కాదు...‘ఫ్లెక్సిబుల్ వర్క్ మోడల్... మైక్రోషిఫ్టింగ్ అనేది కేవలం ఫ్లెక్సిబిలిటీ ట్రెండ్ మాత్రమే కాదు. పనితీరును సరిగా అర్థం చేసుకొని, మెరుగైన పనితీరును కనబరచడం’ అంటున్నారు జెన్ జడ్ ప్లాట్ఫామ్ ‘అన్స్టాప్’ ఫౌండర్, సీఈఓ అంకిత్ అగర్వాల్. మరి ఏ.ఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మాటేమిటి? చాలామంది అనుకున్నట్లు ఉద్యోగాలుపోతాయా? ఎటు చూసినా ‘ఏ.ఐ. మాత్రమే’ అన్నట్లుగా ఉండబోతోందా అంటే– కాదనే అంటున్నారు అగర్వాల్.‘ఏ.ఐ. అనేది ఉద్యోగులు తమను తాము మెరుగుపరుచుకునేలా చేస్తుంది. మరిన్ని పనులు చేసేలా చేస్తుంది. షెడ్యూలింగ్, డాక్యుమెంటేషన్, రిసెర్చ్... మొదలైనవాటికి సంబంధించి మరింత లోతుగా ఆలోచించే అవకాశం ఉద్యోగులకు దొరుకుతుంది. క్రియేటివిటీ థింకింగ్కు సంబంధించి మనిషిని యంత్రం అనుకరించలేదు’ అంటున్నారు అగర్వాల్.⇒ సిద్ధం కావాల్సిందే!సరికొత్త సాంకేతికత సరికొత్త పనితీరుకు కారణం అవుతుంది. ‘ఇంటెలిజెంట్ సిస్టమ్స్తో కలిసి పనిచేయడానికి ప్రతి ఉద్యోగి సిద్ధం కావాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఏ.ఐ. అంటే బెదిరిపోవడం కాదు, ఏ.ఐ.తో కలిసి ఆలోచించేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి’ అంటున్నారు సాప్ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సింధు గంగాధరన్.ఏడీపీ... ఇలా చెబుతోంది...2026లో పని ప్రదేశాలు ఎలా ఉండబోతున్నాయి? ఉద్యోగులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎంత? ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు... మొదలైన విషయాలపై లీడింగ్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ‘ఏడీపీ’ ఒక నివేదిక రూపొందించింది. ‘కొత్త సంవత్సరంలో ఉద్యోగుల ముందు అవకాశాలతోపాటు సవాళ్లు కూడా ఉంటాయి. స్కిల్ అనేది సరికొత్త కరెన్సీగా మారనుంది. యాంత్రీకరణ అనేది ఉద్యోగుల పనితీరును మార్చబోతుంది.ప్రోడక్టివిటీకి ఉపయోగపడే, వ్యక్తిగత జీవితానికి భారం కాని పనితీరుకు ఉద్యోగులుప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటున్నారు ఏడీపీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్. ‘ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, ఫైనాన్షియల్ప్లానింగ్, కేర్గీవింగ్ రిసోర్సెస్, స్ట్రెస్మేనేజ్మెంట్లాంటి వాటిపై నిర్మాణాత్మక కార్యక్రమాలు మరింతగా విస్తరించనున్నాయి. చాలా కంపెనీలు, చిన్న పట్టణాలలో నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎంచుకోవడానికి హబ్–అండ్–స్పోక్ అ్రపోచ్ను అనుసరిస్తున్నాయి’ అని ఏడీపీ సర్వే రిపోర్ట్ చెబుతుంది.హైబ్రీడ్ క్రీప్–2026‘గతంతోపోల్చితే ఇంటినుంచి పనిచేసే వారి కంటే ఆఫీస్కు వచ్చి పనిచేసే ఉద్యోగుల సంఖ్య కొత్త సంవత్సరంలో పెరగనుంది. హైబ్రీడ్ క్రీప్ (క్రమంగా పెరుగుతున్న ఇన్–ఆఫీస్ రోజుల సంఖ్య) తీవ్రతరం అవుతుంది’ అంటున్నారు వోల్ ల్యాబ్స్ సీఈఓప్రాంక్ విషాఫ్ట్. ‘ఇంటి నుంచి పని చేసినా ఫరవాలేదు. ఆఫీస్ నుంచి పనిచేసినా ఫరవాలేదు’ అనే వెసులుబాటు ఉద్యోగులకు ఉండేది. ఇప్పుడు మాత్రం ‘ఆఫీసు నుంచి పనిచేయక తప్పదు’ అనే ధోరణి పెరిగింది.నైపుణ్యమే అసలు సిసలు డిగ్రీ‘ఉద్యోగానికి కాలేజీ డిగ్రీ మాత్రమే ప్రధానం’ అనే నిబంధన రాబోయే రోజుల్లో మరింతగా సడలిపోనుంది. ‘స్కిల్–ఫస్ట్ రెవల్యూషన్’లో డిగ్రీల కంటే నైపుణ్యానికేప్రాధాన్యత పెరగనుంది. కంపెనీలకు సంబంధించి ఆన్–ది–జాబ్ బూట్క్యాంప్స్ స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానున్నాయి. ‘డిగ్రీ ఆధారిత ఉద్యోగ నియామకాల కంటే, నైపుణ్యాల ఆధారిత ఉద్యోగ నియామకాల ధోరణి 2026 ఊపందుకుంటుంది.అలా అని డిగ్రీ ఉన్న వాళ్లప్రాధాన్యత ఏమీ తగ్గదు’ అంటున్నారు అమెరికాలోని నేషనల్ యూనివర్శిటీలో వర్క్ఫోర్స్ అండ్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ గ్రాహం. -
డిస్కౌంట్ల షికారు!
వానాకాలం వచ్చేసింది. దీనికి తోడు కార్ల కంపెనీల ఆఫర్ల వర్షం కూడా మొదలైపోయింది. అయితే, ఈ ఏడాది డిస్కౌంట్ల మోత మరింతగా మోగుతోంది. సార్వత్రిక ఎన్నికలు, మండుటెండల దెబ్బకు వేసవి సీజన్లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. షోరూమ్లకు కస్టమర్ల రాక కూడా భారీగా తగ్గిపోయింది. మరోపక్క, వర్షాకాలంలో విక్రయాల తగ్గుదల కూడా పరిపాటే. ఈ పరిస్థితిని మార్చేందుకు, ఏదో రకంగా విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీలు పలురకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. భారీ డిస్కౌంట్ ధరలతో ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రారంభ స్థాయి మోడళ్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పాత కార్ల ఎక్సే్ఛంజ్పై మంచి ధర, అదనపు బోనస్, బహుమతులను కూడా అందిస్తున్నాయి.బలహీన సీజన్... పండుగలు పెద్దగా లేకపోవడంతో పాటు, వర్షాలు ఎప్పుడు పడతాయో ఊహించని పరిస్థితులు ఉంటాయి. దీంతో కస్టమర్లు ఈ సీజన్లో కొనుగోళ్ల ప్రణాళికలను వాయిదా వేసుకుని.. దసరా, దీపావళి సమయాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తుంటారు. అందుకే ఏటా వర్షాకాలంలో అమ్మకాలు పెంచుకునేందుకు దేశవ్యాప్తంగా డీలర్లు డిస్కౌంట్లు, ఇతరత్రా స్కీమ్లను అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు మోడల్ కార్లపై రూ.20 వేల నుంచి రూ.4 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది వర్షాకాలం కంటే ఈ ఏడాది డిస్కౌంట్లు కూడా పెరిగాయి. వేసవిలో విక్రయాలు తగ్గడంతో డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోయాయి. వీటిని తగ్గించుకోవాలంటే డీలర్లు విక్రయాలు పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. డబుల్ బెనిఫిట్... డిమాండ్ పెంచేందుకు కార్ల కంపెనీలు.. స్టాక్ను తగ్గించుకునేందుకు డీలర్ల స్థాయిలోనూ డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. ‘గతేడాది ఇదే సీజన్లో కొన్ని కార్ల మోడళ్లకు కొరత నెలకొంది. వెయిటింగ్ వ్యవధి కూడా పెరిగింది. కానీ, ఈ ఏడాది చాలా మోడళ్లు డీలర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇదే కస్టమర్లకు ఆఫర్లు పెంచేందుకు కారణం’ అని ఫాడా ప్రెసిడెంట్ మనీ‹Ùరాజ్ సింఘానియా తెలిపారు. మారుతీ ఆల్టో కే10పై రూ.40 వేలు, ఎస్–ప్రెస్సో, వ్యాగన్ఆర్పై రూ.25,000–30,000, స్విఫ్ట్ మోడళ్లపై రూ.15,000–20,000 వరకు తగ్గింపు ఆఫర్లు నడుస్తున్నాయి. బాలెనో పెట్రోల్ ఎంటీ వెర్షన్పై రూ.35 వేలు, పెట్రోల్ ఏజీఎస్ వెర్షన్పై రూ.40 వేల వరకు, ఎక్స్ఎల్6 పెట్రోల్ వేరియంట్పై 20 వేలు, సీఎన్జీ వేరియంట్పై రూ.15 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.ఉచిత విదేశీ ట్రిప్..! ‘హోండా మ్యాజికల్ మాన్సూన్’ పేరుతో హోండా కార్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని కార్లపై బహుమతులు, ఇతర ప్రయోజనాలను ఇందులో భాగంగా అందిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో కొనుగోలుదారుల నుంచి విజేతలను ఎంపిక చేసి, వారికి స్విట్జర్లాండ్ ఉచిత పర్యటన, రూ.75,000 వరకు నగదు బహుమతులను ఆఫర్ చేస్తోంది. హోండా కారు కొనుగోలుపై ఈ పరిమిత కాల ఆఫర్ తమ డీలర్లందరి వద్దా అందుబాటులో ఉన్నట్టు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు.ఆఫర్ సూపర్... → ఎంఅండ్ఎం ఎక్స్యూవీ400 (ఈవీ) – రూ. 4 లక్షలు → మారుతి జిమ్నీ ఆల్ఫా వేరియంట్ – రూ. 2 లక్షలు → హోండా అమేజ్, సిటీ, ఎలివేట్, సిటీ ఈ–హెచ్ఈవీ – రూ. 75,000 వరకు → టాటా టియాగో, ఆ్రల్టోజ్, నెక్సాన్, పంచ్, హ్యారియర్, సఫారీ – రూ. 50,000 వరకు → అధిక డిమాండ్ ఉండే ఎస్యూవీలపై తగ్గింపు కొంతే → ఆరంభ మోడళ్లు, హ్యాచ్బ్యాక్లపై కళ్లు చెదిరే ఆఫర్లు → ఎక్స్చేంజ్పైనా అదనపు బోనస్ → సాధారణ రోజుల్లో ఎస్యూవీలకు 60 రోజుల వెయిటింగ్ → ఈ సీజన్లో 30 రోజుల్లోనే డెలివరీ → పండుగల ముందు వరకు ఇదే ధోరణి -
వేగంగా బల్క్ డ్రగ్ పార్క్ పనులు
సాక్షి, అమరావతి: కాకినాడ సమీపంలోని తొండంగి మండలం కేపీ పురం–కోదండ గ్రామాల మధ్య బల్క్ డ్రగ్ పార్క్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ దక్కించుకున్న ఈ పార్క్ను 2,000.23 ఎకరాల్లో నెలకొల్పేందుకు ఏపీఐఐసీ ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా కార్పొరేషన్ పేరుతో అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచింది. ఆసక్తి గల సంస్థలు జూన్ 8లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ముడిసరుకు దిగుమతుల్ని తగ్గించుకునే లక్ష్యంతో చైనా నుంచి ఫార్మా ముడి పదార్థాల దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మూడు బల్క్ డ్రగ్ పార్క్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. అందులో ఒకటి మన రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధికి రూ.1,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తుండగా.. మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ.1,000 కోట్ల వరకు ఇవ్వనుంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా కాకినాడ ఫార్మా హబ్గా తయారు కావడమే కాకుండా సుమారు రూ.14,340 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. అలాగే ఈ పార్క్ద్వారా 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలోని 200కుపైగా ఫార్మా యూనిట్లు ఉంటే ఇప్పుడు ఈ ఒక్క పార్క్ ద్వారానే 100కు పైగా యూనిట్లు అదనంగా రావచ్చని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. -
రూ. 30 వేల కోట్లు కడతాం
న్యూఢిల్లీ: రుణ బాకీలను సెటిల్ చేసుకునేందుకు, 13 గ్రూప్ కంపెనీలపై దివాలా చర్యలను ఆపివేయించుకునేందుకు వీడియోకాన్ గ్రూప్ మాజీ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్ కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రుణదాతలకు రూ. 30,000 కోట్లు కడతామంటూ ఆఫర్ చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రుణదాతల కమిటీ (సీవోసీ) ముందు ఉంచినట్లు ధూత్ వెల్లడించారు. రుణదాతలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దీనికి అంగీకరించిన పక్షంలో ఈ ఏడాది ఆఖరు నాటికి సెటిల్మెంట్పై తుది నిర్ణయం రావచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న 15 గ్రూప్ కంపెనీలకు గాను 13 సంస్థలకు సంబంధించి ఈ ఆఫర్ను ప్రతిపాదించినట్లు ధూత్ చెప్పారు. కేఏఐఎల్, ట్రెండ్ అనే రెండు సంస్థలను ఇందులో చేర్చలేదని వివరించారు. ‘వచ్చే 30 నుంచి 60 రోజుల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నాను‘ అని ధూత్ పేర్కొన్నారు. దివాలా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు, మరింత మెరుగైన విలువను రాబట్టేందుకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ మొత్తం 15 గ్రూప్ కంపెనీల కేసులను కలిపి విచారణ జరుపుతోంది. -
షాపింగ్ మాలే ఆఫీసు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాల్స్, స్టార్ హోటల్స్.. ఇపుడివి తినడానికో లేదా షాపింగ్ చేయడానికో మాత్రమే కాదు!! ఆఫీసులుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్ స్పేస్ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు... ఇప్పుడు షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్ వసతులూ ఉండటాన్ని కంపెనీలు సైతం స్వాగతిస్తుండటంతో కో–వర్కింగ్ సంస్థలు మాల్స్, హోటళ్ల వైపు దృష్టిసారించాయి. దశాబ్ద కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో విపరీతమైన మార్పులొచ్చాయి. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతిపై ప్రభావం చూపిస్తున్నాయనేది ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా అభిప్రాయం. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడి తగ్గుతుందని, దీంతో మరింత క్రియేటివిటీ బయటికొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది. ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్ స్పేస్ భర్తీ చేస్తుండటంతో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులకు డిమాండ్ పెరిగింది. దీంతో మధ్య తరహా, చిన్న, స్టార్టప్స్ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలు కూడా కో–వర్కింగ్ స్పేస్లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. మెట్రో మాల్స్లో కో–వర్కింగ్.. త్వరలోనే హైటెక్ సిటీ, పంజగుట్ట, మలక్పేట్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న హైదరాబాద్ మెట్రో మాల్స్లో కో–వర్కింగ్ స్పేస్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ కో–వర్కింగ్ కంపెనీ సంబంధిత సంస్థతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఢిల్లీకి చెందిన ‘ఆఫిస్’ సంస్థకు హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో 167 సీట్లు, కోల్కతాకు చెందిన అపీజే గ్రూప్కు పార్క్ హోటల్లో 475 సీట్ల కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. ఆఫిస్కు గుర్గావ్లోని ఆంబియెన్స్ మాల్లో 592 సీట్లు, హీరా పన్నా మాల్లో 241 సీట్లు, పుణెలోని క్యూక్లియస్ మాల్లో 400 సీట్లు, రఘులీలా మాల్లో 1,000 సీట్లు కో–వర్కింగ్ స్పేస్ రూపంలో ఉన్నాయి. ముంబైకి చెందిన రీగస్కు ఢిల్లీలోని వసంత్ స్క్వేర్ మాల్, బెంగళూరులోని లగ్జరీ యూబీ సిటీ, చెన్నైలోని సిటీ సెంటర్లో కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. 20 లక్షల చ.అ.కు కో–వర్కింగ్ స్పేస్.. 2010లో ప్రపంచవ్యాప్తంగా 600 సెంటర్లలో 21 వేల కో–వర్కింగ్ సీట్లుండగా.. ఇప్పుడవి 18,900 సెంటర్లలో 17 లక్షల సీట్లకు పెరిగాయి. మన దేశంలో ఏటా 4.1 కోట్ల చ.అ. కార్యాలయాల స్థల లావాదేవీలు జరుగుతుండగా.. ఇందులో 20 లక్షల చ.అ. స్థలం కో–వర్కింగ్ స్పేస్ ఉంటుందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలియజేసింది. 43 శాతం లావాదేవీలతో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా... తర్వాత ఎన్సీఆర్లో 16 శాతం, హైదరాబాద్ 15 శాతం, పుణె 12 శాతం, ముంబై 10 శాతం, అహ్మదాబాద్ 3 శాతం, చెన్నై 2 శాతం ఆక్రమించినట్లు సంస్థ తెలిపింది. ఏటా 30–40 శాతం వృద్ధి నమోదవుతోంది. ప్రస్తుతం దేశంలో రీగస్, వీవర్క్, కోవర్క్స్, ఐకివా, వర్క్ ఏ ఫీలా, టేబుల్ స్పేస్, ఆఫిస్, అపీజే, స్మార్ట్వర్క్స్ వంటి సుమారు 200 కో–వర్కింగ్ కంపెనీలు 400 సెంటర్లలో సేవలందిస్తున్నాయి. మౌలిక వసతుల వ్యయం తగ్గుతుంది.. ఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్ స్పేస్ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతోంది. ఇదే కో–వర్కింగ్ డిమాండ్కు ప్రధాన కారణమని ఆఫీస్ ఫౌండర్ అండ్ సీఈఓ అమిత్ రమణి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్లో అద్దెలు 25% వరకు తక్కువ. అంతేకాకుండా సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్లో ఒక్కో సీటుకు 5–15% స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్ వంటి ఏర్పాట్లుంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది. అయితే ఒకే చోట పలు కంపెనీల పనిచేస్తుండటంతో కంపెనీల డేటా భధ్రత ప్రధాన సమస్యని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. గంట, రోజు, నెల వారీగా చార్జీలు.. ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులుండటాన్ని కో–వర్కింగ్ స్పేస్గా పిలుస్తారు. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్ ఆఫీసు, ఫిక్స్డ్ డెస్క్లు, సమావేశ గది, క్యాబిన్ల వంటి సౌకర్యాలుంటాయి. కొరియర్, ఫుడ్, లాంజ్, ఎల్సీడీ, పార్కింగ్, ప్రింటర్, వైఫై, ప్రొజెక్టర్ వంటి ఆధునిక వసతులూ ఉంటాయి. కో–వర్కింగ్ ఆఫీసుల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి. హైదరాబాద్లో నెలకు ఒక సీటుకు రూ.5–10 వేలు, పుణెలో రూ.4–10 వేలు, గుర్గావ్లో రూ.7–17 వేలు, ముంబైలో రూ.9–30 వేలు, బెంగళూరులో రూ.4–15 వేలు, చెన్నైలో రూ.7–15 వేలుగా ఉన్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ, రాయదుర్గం, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లిహిల్స్లో కో–వర్కింగ్ ఆఫీసులున్నాయి. -
గ్రామీణ ఉపాధికి పరిశ్రమల స్థాపన
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ పటేల్ కడియం : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఏవీ పటేల్ చెప్పారు. ఆయన సారథ్యంలోని పలువురు అధికారుల బృందం మండలంలోని జేగురుపాడు పంచాయతీ పరిధిలోని పాములమెట్ట కాలనీ వద్ద గల స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున ది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం జేగురుపాడు పంచాయతీ పరిధిలోని, మండపేట మండలం వేములపల్లిలోని, రాజానగరం మండలం కొండ గుంటూరుల్లోని స్థలాలను పరిశీలించినట్టు వివరించారు. పాములమెట్ట వద్ద గన్న 38.67 ఎకరాల స్థలంఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఈ నెల 15న పార్కు నిర్మాణ చర్యలు ప్రారంభమవుతాయన్నారు. ఈ బృందంలో పటేల్తోపాటు ఏపీఐఐసీ జీఎం పి. నాగేశ్వరరావు, మేనేజర్ జ్యోత్సS్న, డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ సుందర్కుమార్, రిటైర్డ్ ఏడీ ఆఫ్ సర్వేస్ వి. సోమరాజు తదితరులు ఉన్నారు. కాగా వైస్ ఎంపీపీ వెలుగుబంటి రఘురామ్ ఈ బృందాన్ని కలిసి భూములను గురించి వివరించారు. స్థానిక నాయకులు కూడా ఉన్నారు. -
సోలార్ పార్క్ ఆదిలాబాద్కు?
పాలమూరులో భూసేకరణకు అవాంతరాలే కారణం ఆదిలాబాద్లో టీఎస్ఐఐసీస్థలాల అన్వేషణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏర్పాటు చేయనున్న భారీ సోలార్ పార్కుకు ప్రత్యామ్నాయ స్థలాల అన్వేషణ మొదలైంది. మహబూబ్నగర్ జిల్లాలోని గట్టు మండలంలో తలపెట్టిన ఈ పార్కుకు భూసేకరణ అవరోధంగా మారడమే ఇందుకు కారణం. పార్కు నిర్మాణానికి కావాల్సిన భూములను తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) సేకరించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ)కు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ దీనిపై టీఎస్ఐఐసీ ఇప్పటికీ దృష్టి సారించలేదు. పార్కు నిర్మాణానికి గట్టు మండలంలో సేకరించ తలపెట్టిన 5702 ఎకరాలు ఆలూరు, రాయిపల్లి, బుచ్చినెర్ల, కేటీ దొడ్డి గ్రామాల పరిధిలో ఉన్నా యి. వాటిలో 391 ఎకరాల అసైన్డ్, 415 ఎకరాల పట్టా భూములు కూడా ఉన్నాయి. టీఎస్ఐఐసీ మాత్రం ఈ విషయాన్ని కనీసం రాష్ట్ర ఇంధన శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లలేదు. కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి, ప్లాంటు నిర్మాణానికి ముందుకొచ్చిన ఎన్టీపీసీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇటీవల అధికారులతో భేటీ అయినప్పుడు ఈ విషయం బయటపడింది. పార్కుకు కావాల్సిన భూముల బదిలీ ఇంకా జరగలేదని తెలిసి ఇంధన శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఆ నాలుగు గ్రామాల పరిధిలోని అసైన్డ్, పట్టా భూముల సేకరణ జాప్యమయ్యేలా ఉండటంతో పార్కు నిర్మాణానికి మరోచోట స్థలాలను గుర్తించాలని టీఎస్ఐఐసీని ఆదేశించారు. దాంతో ఆదిలాబాద్ స్థలాల వేటలో పడ్డ టీఎస్ఐఐసీ, ఒకేచోట 5000 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యమయ్యే పరిస్థితి జిల్లాలో ఎక్కడా లేదని గుర్తించింది. దాంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా సోలార్ పార్క్ను ఏర్పాటు చేసి, పలు ప్రాంతాల్లో ప్లాంట్లు నెలకొల్పేందుకు కంపెనీలను ఆహ్వానించాలని భావిస్తోంది. ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, కాగజ్నగర్ మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాలు ఒకేచోట ఉన్న ప్రాంతాలను ఇందుకు ఎంచుకుంది. ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్కు ఐదెకరాలు అవసరం. ఈ లెక్కన ఇంద్రవెల్లి మండలంలోని వెయ్యెకరాల్లో మొదటగా ఎన్టీపీసీ సారథ్యంలో 200 మెగావాట్ల సోలార్ ప్లాం ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సింగరేణి ప్లాంట్కు నేడు సీఎం సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సందర్శించేం దుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక్కడి జైపూర్ సమీపంలో 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రాన్ని సింగరేణి నిర్మిస్తోంది. వచ్చే ఏడాది నుంచి విద్యుదుత్పత్తి మొదలవుతుం ది. దీని సామర్థ్యాన్ని 1,800 మెగావాట్లకు పెంచాలని ఇటీవలి బోర్డు సమావేశంలో సింగరేణి సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సోలార్ పార్కుకు అనువైన స్థలాలను కూడా పర్యటన సందర్భంగా సీఎం పరిశీలించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.


