breaking news
Commissioner Shalini Mishra
-
జోన్లకు స్వస్తి
హెచ్ఎండీఏ సంచలనాత్మక నిర్ణయం జోనల్ ఆఫీసులు తార్నాకకు తరలింపు ఇక కేంద్ర కార్యాలయం నుంచే కార్యకలాపాలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కొత్త కమిషనర్ సిటీబ్యూరో: ప్రజలకు క్షేత్ర స్థాయిలో సేవలందించేందుకు 2009లో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ‘జోనల్ వ్యవస్థ’ను పూర్తిగా రద్దు చేస్తూ హెచ్ఎండీఏ కొత్త కమిషనర్ శాలిని మిశ్రా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చెల్ జోనల్ కార్యాలయాలను సత్వరం తార్నాకలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయానికి తరలించాలని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణకు దూరంగా ఉన్న జోనల్ కార్యాలయాల్లో మితిమీరిన అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించిన కమిషనర్ తొలుత వాటిని సంస్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడి అధికారులకు ఎలాంటి ప్రత్యేక అధికారాలూ లేనందున కేవలం దరఖాస్తులు స్వీకరించి... వాటిని కేంద్ర కార్యాలయంలోని యూనిట్-6కు పంపుతున్న విషయాన్ని కమిషనర్ గమనించారు. అనుమతులన్నీ తార్నాకలోనే ఇస్తున్నందున జోనల్ కార్యాలయాలు అవసరంలేదన్న అభిప్రాయానికి వచ్చారు. పైగా శంకర్పల్లి, శంషాబాద్ కార్యాలయాల్లో అక్రమాలు బయట పడకుండా గతంలో ఫైళ్లు తగులబెట్టిన ఉదంతాలను తెలుసుకున్న కమిషనర్ ఏకంగా జోనల్ వ్యవస్థకే స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సంస్థలో తిష్టవేసిన 77మంది డెప్యుటేషన్ అధికారులను మాతృసంస్థలకు తిప్పి పంపడంతో పాటు 200మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జోనల్ కార్యాలయాలను రద్దు చేయడం హెచ్ఎండీఏలో చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంస్థను ఒడ్డున పడేసేందుకు అనవసర ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నాలుగు జోనల్ కార్యాలయాలకు నెలకు సుమారు రూ.4 లక్షల చొప్పున ఏడాదికి దాదాపు రూ.50ల క్షల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. సంస్థ ఆర్థిక పరిస్థితి తల్లకిందులవ్వడంతో 2013 అక్టోబర్ నుంచి వీటికి అద్దె చెల్లించక పోవడంతో బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. ఆదాయం రాకపోగా... ఖర్చులు పెరుగుతుండటంతో జోనల్ వ్యవస్థకు పూర్తిగా చరమగీతం పాడుతూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జోనల్ కార్యాలయాలను యథాతథంగా తార్నాకలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో కొనసాగించేందుకు నిర్ణయించారు. ఈ నెల 4 నుంచే జోనల్ కార్యాలయాలు తార్నాకలో సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. లక్ష్యానికి తూట్లు హెచ్ఎండీఏలో అధికారులు మారిన ప్రతిసారీ వారికి నచ్చిన విధానాలను ప్రవేశపెడుతుండటంతో అసలు లక్ష్యం నీరుగారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ అనుమతుల కోసం సుదూరం నుంచి నగరానికి వస్తున్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2009లో అప్పటి అధికారులు జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 4 వేల చ.మీ. విస్తీర్ణంలో నిర్మించే భవనాల అనుమతుల కు శివారు ప్రజలు తార్నాక రాకుండా జోనల్ అధికారులే వాటిని పరిశీలించి అనుమతులిచ్చేలా అధికారాలిచ్చారు. సెల్లార్, స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్లు, లేదా 18 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు సంబంధించిన దరఖాస్తులు జోనల్ కార్యాలయంలోనే పరిష్కరించేవారు. 18 మీటర్లకు పైగా ఎత్తు ఉండే భవనాలకు, గ్రూపు హౌసింగ్ స్కీమ్లు, లేఅవుట్లు, గ్రీన్ ఛానల్స్కు సంబంధించి మెంబర్ ప్లానర్ స్థాయిలో తార్నాక కేంద్ర కార్యాలయంలో అనుమతి ఇస్తారు. ముఖ్యంగా నోఅబ్జక్షన్ సర్టిఫికెట్లు, సినిమా, కాంప్లెక్స్, పెట్రోల్ పంపులు, పెట్రోలియం ఉత్పత్తులు నిల్వ ఉంచే నిర్మాణాలు, ఇండస్ట్రియల్ సింగిల్ విండో క్లియరెన్స్ కోసం కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. వీటికి కమిషనర్ అప్రూవల్తోనే అనుమతి ఇస్తారు. జోనల్ కార్యాలయాలను తొలగింపుతో శివారు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఒక రోజు పనికి నాలు గు రోజులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వికేంద్రీకరణ తో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యానికి కొత్త కమిషనర్ తూట్లు పొడిచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎక్కడిదొంగలు అక్కడనే.. ష్... గప్ చుప్!
- గుట్టుగా సర్దుకుంటున్న అక్రమార్కులు - లొసుగులు బయటపడకుండా జాగ్రత్త - దాచిన ఫైళ్లు బీరువాల్లో ప్రత్యక్షం - ఆగమేఘాలపై పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ - ఒక్కరోజులోనే 30 ఫైళ్లకు గ్రీన్సిగ్నల్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ప్రస్తుత పరిస్థితి ‘ఎక్కడి దొంగలు అక్కడే... గప్ చుప్’ అన్నట్లుగా ఉంది. కొత్త కమిషనర్గా శాలినీ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరిస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తమ పరిధిలోని ఫైళ్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో.. ? లేదోనన్న విషయాన్ని మరోసారి పరిశీలించుకొని వాటిని ఓ క్రమపద్ధతిలో పెట్టుకొన్నారు. కొత్త కమిషనర్ చార్జి తీసుకున్న వెంటనే విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తే... ఎక్కడా లొసుగులు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఏదైనా ఫైల్పై కమిషనర్ ఆరా తీస్తే అందరూ ఒకే విధంగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేకించి ప్లానింగ్ విభాగంలో ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ఒకే మాట... ఒకే బాట.. అన్నట్లుగా వ్యవహరించేందుకు పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నట్లు వినికిడి. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఫైళ్లకు బుధవారం దుమ్ము దులిపారు. వీటిలో ఇప్పటికే హెచ్ఎండీఏకు డబ్బు చెల్లించి ఉన్న ఫైళ్లను ఆగమేఘాలపై విడుదల చేశారు. నిజానికి వీటికి సంబంధించి నిర్ణీత ఫీజు చెల్లింపులు జరిగినా ... మూమూళ్లు ముట్టలేదన్న కారణంతో వాటిని పక్కకు పెట్టారు. అయితే... వీటిపై ఫిర్యాదులు వస్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో వాటిని బుధవారం నాడే విడుదల చేశారు. కొన్ని ఫైళ్లకు సపోర్టు డాక్యుమెంట్లు లేవన్న సాకుగా చూపుతూ రిజెక్టు చేస్తూ మరికొన్నింటికి డీసీ లెటర్లు పంపడం గమనార్హం. ఇటీవల వరకు ఇన్స్పెక్షన్ల పేరుతో బయటకు వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకొంటున్న కొందరు అధికారులు బుధవారం సాయంత్రం వరకు కార్యాయలంలో కూర్చొని ఫైళ్లను పక్కాగా సర్దిపెట్టుకొన్నారు. ఇదే తరుణంలో కొన్ని అనుమతుల విషయంలో అక్రమాలు, అవకతవకలు బయటపడకుండా ఆయా ఫైళ్లను దాచేశారు. ఇదే క్రమంలో గతంలో తమ ఇళ్లలో దాచేసిన ఫైళ్లను గుట్టుగా బ్యాగుల్లో తెచ్చి బీరువాల్లో పెట్టేశారు. ఇన్వార్డ్... అవుట్ వార్డ్ రిజిస్టర్లను సైతం సరిదిద్ది జాగ్రత్త చేశారు. రూ.4-5 కోట్లు జుర్రేశారు.. కొత్త కమిషనర్ చార్జి తీసుకొంటే అక్రమాలకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు చ క్రం తిప్పారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ఫైళ్ల క్లియర్ చేసి సుమారు రూ.4-5కోట్లు దండుకొన్నట్లు హెచ్ఎండీఏలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అన్ని అనుమతులున్న ఫైళ్లకు అప్రూవల్ ఇస్తూ అందినకాడికి జుర్రుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేకించి ఘట్కేసర్, శంకర్పల్లి, శామీర్పేట, మేడ్చల్ జోనల్ కార్యాలయాల పరిధిలో అనాథరైజ్డ్ లేఅవుట్లు ఇటీవల నోటీసులు జారీ చేశారు. వీటిని అందుకొన్న రియల్టర్లు బుధవారం తార్నాకకు వచ్చి ఆ జాబితాలో తమ పేర్లు లేకుండా పెద్దసార్లను కలిసి భారీగా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. మేడ్చల్, సంగారెడ్డి, శామీర్పేట ప్రాంతాల్లోని పరిశ్రమలకు సంబంధించిన ఫైళ్లను బుధవారం నాడే క్లియర్ చేయడం గమనార్హం. అలాగే లేఅవుట్లు, గ్రూపు హౌసింగ్ కాలనీలకు కూడా పెద్దసంఖ్యలో అనుమతులు మంజూరు చేశారని సిబ్బందే చెప్తున్నారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పలువురు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని పూర్తిచేయడంతో బుధవారం హెచ్ఎండీఏలో అక్రమార్కుల కాసుల వర్షం కురిసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. వీరిని పట్టించుకొనే నాథుడే లేకపోవడంతో తార్నాకలో ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నది బహిరంగ రహస్యమే.