breaking news
Colonoscopy test
-
కొద్దిసేపు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారాలను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(57)కు శుక్రవారం కొద్దిసేపు బదిలీ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వడమే ఇందుకు కారణం. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్ రికార్డుకెక్కారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 79వ పడిలోకి ప్రవేశించారు. వాషింగ్టన్ శివారులోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో చేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు స్పృహలో లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. బైడెన్కు శుక్రవారం మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు. ఈ సమయంలో కమలా హ్యారిస్ వైట్హౌస్ వెస్ట్వింగ్లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. అణ్వాయుధాల నియంత్రిత వ్యవస్థలతో కూడిన బాక్సు కూడా ఆమె సొంతమైనట్లు తెలుస్తోంది. పరీక్షల అనంతరం బైడెన్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి. 2002, 2007లో అప్పటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఇలాగే కలనోస్కోపీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు సందర్భాల్లో తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షుడు డిక్ చెనీకి బదిలీ చేశారు. -
చిన్నసైజు రోబోతో కొలనోస్కోపీ పరీక్ష
వాషింగ్టన్: కొలనోస్కోపీ (పెద్దపేగు పరీక్ష)ని సౌకర్యవంతంగా చేసేందుకుగాను శాస్త్రవేత్తలు క్యాప్సూల్ సైజ్లో ఉండే రోబో పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ క్యాప్సూల్ రోబోను బయటి నుంచి రోబోటిక్ ఆర్మ్కు జతచేసిన అయస్కాంతం సహాయంతో పేగులోకి వెళ్లేలా చేస్తారు. ఇప్పటివరకు కొలనోస్కోపీ పరీక్షలో రోగులు ఎదుర్కొంటున్న తీవ్ర అసౌకర్యం తమ 18 మిల్లీ్లమీటర్ల సైజు క్యాప్సూల్ రోబోతో తొలగుతుందని వారు వెల్లడించారు. పెద్దపేగులో కేన్సర్ కారకాలు, కణితులు ఇతర వ్యాధుల తాలూకు లక్షణాలను గుర్తించేందుకు కొలనోస్కోపీ పరీక్ష చేస్తారు. అయితే ఈ పరీక్ష చేసే విధానం నొప్పితో కూడుకున్నది కావడంతో చాలామంది పరీక్ష చేయించుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తారని అమెరికాలోని వాండెర్బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకులు కీత్ అబ్స్టయిన్ తెలిపారు. ఈ క్యాప్సూల్ను ఉపయోగించి పందులపై చేసిన ప్రయోగంలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు ప్రకటించారు. దీంతో 2018 చివరి నాటికి మనుషులపై దీన్ని ప్రయోగిస్తామని వెల్లడించారు.