breaking news
CM Edappadi Palaniswami
-
కూల్చేందుకు కుట్ర!
♦ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ బేరం ♦ టీటీవీ ఆరోపణ ♦ పార్టీ వర్గాలతో సమాలోచన ♦ ప్రచారం కోసమే ఈ ఆరోపణ : స్టాలిన్ సాక్షి, చెన్నై: సీఎం ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తీవ్ర కుట్ర చేస్తున్నారని అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలతో బేరాలు సాగిస్తున్నారని, కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా తన దృష్టికి వివరాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాయపేటలోని అన్నాడీఎంకే రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం సీఎం ఎడపాడి పళనిస్వామి, ప్రిసీడియం చైర్మన్ సెంగుట్టయన్, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ భేటీ అయ్యారు. గంట పాటు సాగిన ఈ భేటీలో కొంతమంది ఎమ్మెల్యేలను మాత్రమే పిలిపించి ఉండడం గమనించాల్సిన విషయం. ఈ భేటీ అనంతరం టీటీవీ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే, ఆ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పిలిపించారా అన్న ప్రశ్న బయలు దేరక మానదు. స్టాలిన్ తమ ఎమ్మెల్యేలతో బేరాలు సాగిస్తున్నారని టీటీవీ ఆరోపించడం గమనార్హం.ఎమ్మెల్యేలతో భేరం : ఈ సమావేశానంతరం మీడియాతో టీటీవీ మాట్లాడుతూ సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా స్టాలిన్ తీవ్ర కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ద్రోహి పన్నీరుసెల్వంకు మద్దతుగా ఆయన కుట్రలు సాగుతున్నాయని పేర్కొన్నారు. పన్నీరు శిబిరంలోకి చేరాలని తమ శిబిరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని , కొందరితో బేరాలు సైతం సాగిస్తున్నారని ఆరోపించారు. పన్నీరు శిబిరంలోకి వెళ్లేందుకు సిద్ధం అని ఒక్క మాట చెబితే చాలు అని, వారికి కావాల్సిన వన్నీ సమకూర్చేందుకు స్టాలిన్ సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం లక్ష్యంగా కుట్రలు సాగుతున్నాయని, వారి కుట్రల్ని భగ్నం చేసి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా తన దృష్టికి స్టాలిన్ సాగించిన బేరాల గురించి తెలియజేశారని వివరించారు. పదిహేను మంది ఎమ్మెల్యేలకు అనేక ఆశల్ని కూడా చూపించారని ఆరోపించారు. ఇక, రెండాకుల చిహ్నం దూరం కావడం వెనక బీజేపీ కుట్ర ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఉప ఎన్నికల్లో తాను గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగారు. ప్రచారం కోసం ఆరోపణ : టీటీవీ ఆరోపణలపై స్టాలిన్ను మీడియా ప్రశ్నించగా, ఇలాంటి వాటికి సమాధానాలు ఇచ్చి తన స్థాయిని దిగజార్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పబ్లిసిటీ(ప్రచారం) కోసం ఈ ఆరోపణలు టీటీవీ సందిస్తున్నారని ఎద్దేవా చేశారు. అర్హత లేని వాళ్లు చేసే వాఖ్యలను పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. -
సమరానికి సై
అసెంబ్లీ సమరానికి సర్వం సిద్ధమైంది. అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు ప్రధాన ప్రతి పక్షంతో పాటు కాంగ్రెస్ ఉరకలు వేస్తోంది. ఇక, ప్రప్రథమంగా సభలో బడ్జెట్ దాఖలుకు ఆర్థిక మంత్రి డి.జయకుమార్ సిద్ధమయ్యారు. అలాగే,ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం లక్ష్యంగా స్పీకర్పై అవిశ్వాసానికి డీఎంకే కసరత్తుల్లో పడింది. సాక్షి, చెన్నై: 2017–18 సంవత్సరానికిగాను బడ్జెట్ను దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులే చేసింది. ఈ బడ్జెట్ అటు సీఎం ఏడపాడి పళనిస్వామికి, ఆర్థిక మంత్రి జయకుమార్లకు కొత్తే. ఈ ఇద్దరు ఆ పదవులకు ప్రప్రథమంగా ఎంపికైన వారే. ఈ దృష్ట్యా, ప్రభుత్వం దాఖలు చేయనున్న బడ్జెట్పై సర్వత్రా ఎదురు చూపులు పెరిగా యి. అమ్మ జయలలిత మరణం తదుపరి దాఖ లు చేస్తున్న బడ్జెట్ పాలకులకు పెను సవాలే. ప్రజాకర్షణ లక్ష్యంగా ముందుకు సాగాలంటే, ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులు, ప్రత్యేక పథకాలు తప్పనిసరి. అయి తే, వీటి కి నిధుల కొరత తాండవం చేస్తుండడంతో తాజా బడ్జెట్ ఎలా ఉంటుందోనన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతోండడాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. అలాగే, తన పాలనా దక్షతను చాటుకునేందుకు ఈ బడ్జెట్ను పళనిస్వామి కీలకంగా భావించాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త భారాన్ని మోపుతారా, లేదా ప్రజల నెత్తిన భారం పడకుండా, కొత్త పథకాలతో ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగిస్తారా అన్నది ఈ బడ్జెట్లో తేలనుంది. గురువారం ఉదయం పదిన్నర గంటలకు సభ ప్రారంభం కాగానే, బడ్జెట్ను జయకుమార్ దాఖలు చేయనున్నారు. అవిశ్వాసానికి కసరత్తు: బడ్జెట్ దాఖలు అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం అవుతుంది. ఇందులో చర్చించాల్సిన అంశాలు, ముసాయిదాల గురించి, సభ ఎన్ని రోజులు సాగించాలన్న విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. ఇందులో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు తగ్గ కసరత్తుల్లో డీఎంకే ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో స్పీకర్ తీరుపై డీఎంకే తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సమావేశాల్లో ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇక, హైడ్రో కార్బన్ తవ్వకాలు, జాలర్లపై దాడులు, శాంతి భద్రతల విఘాతం, రేషన్ కొరత, వంటి అంశాలను అస్త్రంగా చేసుకుని పాలకులతో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే, కాంగ్రెస్లు ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఐదు రోజులకు పరిమితం: బడ్జెట్ సమావేశానికి ఐదు రోజులకు పరిమితం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. బడ్జెట్ దాఖలు, తదుపరి చర్చలకు ఐదు రోజులు అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 23వ తేదీ వరకు సభను పరిమితం చేసి, తదుపరి ఏప్రిల్ 18 తర్వాత శాఖల వారీగా నిధుల కేటాయింపులపై చర్చలు సాగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందుకు కారణం ఆర్కేనగర్ ఉప ఎ న్నికలే. డీఎంకే అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన పక్షంలో చర్చ, ఓటింగ్ వారం రోజుల తదుపరి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమరం వాడివేడిగా సాగే అవకాశాలు ఉండడంతో, సచివాలయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయంలోకి వాహనాల రాకపోకలకు కఠిన నిబంధనలు, ఆంక్షలు విధించారు. ప్రతిపక్షాన్ని ఢీకొట్టండి: బడ్జెట్ సమావేశాల్లో తమ మీద సమరం సాగించేందుకు, ప్రభుత్వా న్ని కూల్చడం లక్ష్యంగా అవిశ్వాస తీర్మానానికి డీఎంకే సిద్ధం అవుతున్న సంకేతాలతో అన్నాడీఎంకే మేల్కొంది. ఆగమేఘాలపై పార్టీ ఎమ్మెల్యేలను చెన్నైకు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పిలిపించారు. శాసన సభా పక్ష సభ్యులందరితో భేటీ అయ్యారు. ప్రతి పక్ష వ్యూహాలు, కుట్రల్ని భగ్నం చేసే విధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ఈ సమావేశానికి అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మీద గెలిచిన ఇతర పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అలాగే, అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు సమాచారం.