breaking news
citys
-
ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలు విలీనం.. రష్యా కీలక ప్రకటన
కీవ్: ఇటీవల రెఫరెండం చేపట్టిన ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను తాము కలిపేసుకుంటామని రష్యా గురువారం ప్రకటించింది. ఈ రెఫరెండంలో దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలైన జపొరిఝియాలో 93%, ఖేర్సన్లో 87%, లుహాన్స్క్లో 98%, డొనెట్స్క్లో 99% మంది రష్యాకు అనుకూలంగా ఓటేశారని క్రెమ్లిన్ అనుకూల పరిపాలనాధికారులు మంగళవారం ప్రకటించారు. శుక్రవారం క్రెమ్లిన్ కోటలోని సెయింట్ జార్జి హాల్లో జరిగే కార్యక్రమంలో విలీనం విషయాన్ని అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటిస్తారని అధికార ప్రతినిధి పెష్కోవ్ చెప్పారు. విలీనానికి సంబంధించిన పత్రంపై ఈ నాలుగు ప్రాంతాల అధికారులు సంతకాలు చేస్తారన్నారు. రష్యా చర్యను ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ ఇతర పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా చేపట్టిన రెఫరెండంను, విలీనం చేసుకోవడాన్ని గుర్తించబోమన్నాయి. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రతిజ్ఞ చేసింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్లో ద్నీప్రో ప్రాంతంపై రష్యా జరిపిన రాకెట్ దాడిలో చిన్నారి సహా 8 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈశాన్య ప్రాంత లెమాన్ నగరంపై పట్టు కోసం ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరు సాగుతోందని బ్రిటిష్ నిఘా వర్గాలు వెల్లడించాయి. -
చదువురాకున్నా ‘పాఠం’ నేర్పుతున్నారు!
నిరక్షరాస్యులు, వృద్ధులు.. ఈ దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ తప్పకుండా ఓటేసే ఉత్తమపౌరులు. ప్రస్తుతం లాక్డౌన్ అమలవుతున్న వేళ కూడా వీరు స్ఫూర్తిని చాటుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ అమలుకు వీరే పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది. లాక్డౌన్ నిబంధనలను చదువురానివారు, వృద్ధులు నూటికి నూరుశాతం పాటిస్తూ ఇంటికే పరిమితమవుతున్నారు. లాక్డౌన్ ఉల్లంఘనుల్లో అధికశాతం చదువుకున్న యువతే ఉన్నారు. ముఖ్యంగా 18 – 25 ఏళ్లలోపు వయస్కులే ఎక్కువగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. పనీపాటాలేకుండా రోడ్లపై తిరుగుతూ పోలీసులకు, సమాజానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. గ్రామస్తులే నయం..! లాక్డౌన్ కచ్చితంగా పాటిస్తున్నవారిలో గ్రామస్తులే నయమని పోలీసుశాఖ వెల్లడించింది. చిన్న పట్టణాలు, టౌన్లలో దాదాపు 50 శాతం ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నారు. గ్రామాలలో అత్యధికంగా 80 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. అందులోనూ ఇంటికొక్కరు చొప్పున, ముఖానికి మాస్కులతో భౌతికదూరం పాటిస్తూ బయటికొస్తున్నారు. గ్రామాల్లోని చదువుకోనివారు, వృద్ధులు, వ్యవసాయదారులు, రైతులు మాత్రం నూటికి నూరుశాతం లాక్డౌన్ నిబంధనలను పాటిస్తున్నారు. లాక్డౌన్కు ఓకే.. ప్రజారోగ్య పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు దాదాపు అన్ని వర్గాల ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. మెజారిటీ శాతం ప్రజలు లాక్డౌన్ను మరింత కఠినంగా, ఇంకా ఎక్కువ రోజులు అమలు చేయాలని కోరుకుంటున్నారు. వీరంతా ఇంటికి ఒకరిని మాత్రమే, అదీ నిత్యావసరాల కొనుగోళ్లకు లేదా అత్యవసర పనులుంటేనే బయటకు పంపుతున్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలను 80 శాతం యథాతథంగా పాటిస్తూ లాక్డౌన్కు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక లాక్డౌన్ అంటే ఐడియా లేదని చెప్పిన కొందరి తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్డౌన్ ఎన్నిరోజులుండాలి? 15 రోజులు చాలు: 62% 3 నెలలకు పొడిగించాలి: 27% 6 నెలలు అమలుచేయాలి: 5% ఐడియా లేదని చెప్పినవారు: 6% లాక్డౌన్ పాటిస్తున్న ప్రాంతాల శాతం చిన్నపట్టణాలు: 50% గ్రామాలు: 80% -
ఈ నగరాలకు కునుకు కరువు
స్కూల్ఎడిషన్: రోజంతా పనిచేయటం..పొద్దుపోకముందే ఇంటికి చేరుకోవటం..ఓ ముద్ద తినటం..త్వరత్వరగా నిద్రకు ఉపక్రమించటం..కోడి కొక్కరొక్కో అనకముందే లేవడం..! ఇదీ ఒకప్పటి భారతీయుల జీవనశైలి. బ్రిటిష్ వారు అడుగుపెట్టి వెళ్లిపోయాక సీన్ మారిపోయింది. పల్లెటూర్లను పక్కన బెడితే, ఇప్పటి భారతీయుడి దినచర్య పూర్తిగా మారిపోయింది. ఆలస్యంగా అల్పాహారం... నాలుగు దాటిన తర్వాత భోజనం.. ఇక అర్ధరాత్రికి కాస్త ముందు రాత్రి భోజనం. దీంతో నగరవాసి జీవనశైలికి అనుగుణంగా వివిధ ప్రాంతాలు కూడా తమ రూపురేఖల్ని మార్చుకుంటున్నాయి. దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ తమ తలుపులను తెల్లవారేదాకా బార్లా తెరిచిపెట్టి వెల్కమ్ చెబుతున్నాయి. డ్యాన్స్ బార్లు, పబ్ల సంస్కృతి వచ్చాక నైట్కల్చర్ మరింత పెరిగింది. దీంతో నగరాలకు నిద్రే కరువైంది. ప్రపంచంలో ఇలా అసలు కునుకు తీయని నగరాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంస్కృతి భారతదేశానికి కూడా వ్యాపించడంతో ఇక్కడా ఈ నగరాల జాబితా పెరుగుతోంది. లండన్, న్యూయార్క్, పారిస్ వంటి నగరాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కునుకు కరువైన నగరాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి గురించి ఈ రోజు తెలుసుకుందాం! ముంబై ఒకప్పుడు బొంబాయి అని పిలిచే ఈ నగరాన్ని ఇప్పుడు ముంబై అంటున్నారు. భారతదేశ వాణిజ్య రాజధాని. అరేబియా సముద్రంలోని పశ్చిమ తీరప్రాంతమైన సాష్టీ ద్వీపంలో వెలసింది. మరాఠాల ఆరాధ్యదైవమైన ముంబ్రాదేవి పేరును ఈ నగరానికి పెట్టారు. ప్రచురణ సంస్థలకు, దూరదర్శన్, రేడియో కేంద్రాలకు ముంబై పుట్టినిల్లు. అంతేకాక భారతదేశంలోని మొత్తం పారిశ్రామిక ఉద్యోగుల్లో పదిశాతం ముంబైలోనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడడంతో అన్నిరకాల సంస్కృతులు, సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. అన్ని మతాలకు చెందిన పండుగలు, ఉత్సవాలు, వేడుకలతో ఈ నగరం ఎప్పుడూ సందడిగా కనిపిస్తుంది. దీంతో ఈ నగరానికి కూడా కునుకు కరువైంది. భారత్లోని గోవా, ఢిల్లీ, బెంగళూరు, పుణే, హైదరాబాద్, కోల్కతా, చెన్నై, చండీగఢ్, జైపూర్ నగరాలు కూడా క్రమక్రమంగా నిద్రకు దూరమవుతున్నాయి. బార్సిలోనా మలాగా, జారాగొజా, మాడ్రిడ్ వంటి నగరాలున్న స్పెయిన్లో బార్సిలోనా కూడా ప్రముఖమైందే. స్పెయిన్లో రెండో అతిపెద్ద నగరం. ఐక్కరాజ్య సమితి గుర్తించిన ఎన్నో ప్రపంచ చారిత్రక కట్టడాలకు ఈ నగరం చిరునామా. పర్యాటక, వాణిజ్య, వర్తక, సాంస్కృతిక క్రీడారంగాల్లో బార్సిలోనాకు ప్రముఖమైన స్థానమే ఉంది. మధ్యదరా సముద్ర తీరంలో ఉన్న ఈ నగరంలో నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్ క్యాటలోనియా, రోమన్స్క్యూ ఆర్ట్, ఒరెనెటా క్యాస్టల్ పార్క్, మార్బెల్లా, నోవా బార్బెల్లావంటి బీచ్లు చూడదగిన ప్రదేశాలు. ఫ్యాషన్ రంగానికి పెట్టింది పేరైనా ఈ నగరంలో ఎక్కువశాతం ప్రదర్శనలు రాత్రిపూట మాత్రమే జరుగుతాయి. మాంటివిడియో ఉరుగ్వే దేశ రాజధాని మాత్రమే కాదు.. దేశంలోనే అతిపెద్ద నగరం. స్పానిష్ సైనికులు 1724లో దీనిని నిర్మించారు. మొట్టమొదటి ఫిఫా ప్రపంచ కప్కు ఆతిథ్యమిచ్చిన నగరమిదే. అట్లాంటిక్ తీరంలో, శాంటా లూసియా నది తీర ప్రాంతంలో వెలసింది. మిగతా రోజుల్లో చల్లగా ఉన్నా వేసవిలో అసౌకర్యంగా ఉంటుంది. ఏడాదంతా తరచూ వర్షం పడుంది. బ్యాంకింగ్.. ఈ దేశంలో బాగా అభివృద్ధి చెందిన రంగం. సముద్ర తీరప్రాంతం కావడంతో పర్యాటకరంగానికి పెద్దపీట వేసిన ఈ నగరంలో అనేక నైట్ క్లబ్బులు, సరాండీ స్ట్రీట్ వంటి ప్రాంతాలు, ప్లాజా ఇండిపెండెన్సికా వంటి వ్యాపారసముదాయాలతో మాంటివిడియో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. బీరుట్ లెబనాన్ రాజధాని ఇది. దేశంలోకెళ్ల అతిపెద్ద నగరం కూడా. దాదాపు 5000 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. బీరుట్ నది కారణంగా ఆ పేరు వచ్చింది. సేవారంగానికి ప్రాధాన్యతనిచ్చే బీరుట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కూడా దూసుకుపోతోంది. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బీరుట్, జోసెఫ్, నోటర్డామ్ యూనివర్సిటీలు ప్రముఖమైనవి. గ్రీకులు, రోమన్లు, అరబ్బులు, తురుష్కుల సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. కార్నిక్ బీరుట్, సెయింట్ జార్జ్ బే, హర్మా స్ట్రీట్ వంటి పర్యాటకప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. షాపింగ్, స్టోర్స్, బొటిక్స్, రెస్టారెంట్లు, బ్యాంకులు, హాకర్లు, ఫుట్పాత్లపై వెలసిన కేఫ్లతో అలరారుతోంది. కైరో అరబ్బు దేశాల్లోనే కైరో అతిపెద్ద నగరం. ఈజిప్టు రాజధాని కూడా. నైలు నది తీరంలోని ఈ నగర వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దుమ్ము, ధూళితో కూడిన గాలులు ఈ నగరాన్ని తరచూ అతలాకుతలం చేస్తుంటాయి. విద్య, వైద్యానిది ఇక్కడ ఫస్ట్ ప్లేస్. పేరెన్నికగల ఆస్పత్రుల్లో ప్రముఖమైనవి కైరో నగరంలోనే ఉన్నాయి. అల్ జహర్, కైరో, అమెరికన్, హెల్వాన్ విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రచురణాసంస్థలకు, ఫిల్మ్ స్టూడియోలకు కైరో పెట్టింది పేరు. గ్రీకులు, బాబీలోనియన్లు, రోమన్లు, ముస్లింలకు సంబంధించిన నాగరికత ఇక్కడ కనిపిస్తుంది. దీంతో ఎప్పుడు చూసినా ఈ నగరం సర్వసంస్కృతుల సమ్మేళనంతో సందడిగా కనిపిస్తుంది.