వెండితెరకు చిలుకూరు బాలాజీ చరిత్ర
‘‘ప్రతి ఊరిలో ఉండే దేవాలయంతో ప్రజలు అనుసంధానమై ఉంటారు. దేవుడు సర్వాంతర్యామి. ఆయనకు ప్రాంతాలు అంటూ ఏమీ ఉండవు. ఆలయ విధి, విధానాలను రెగ్యులరైజ్ చేసిన రామానుజాచార్యులు జీవితం నుంచి వెడలిన వెయ్యో సంవత్సరమిది. ఇటువంటి దివ్య ఏడాదిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పురాణంపై సినిమా తెరకెక్కించడం అభినందనీయం’’ అని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు.
సాయికుమార్, సుమన్, ఎస్పీ బాలసుబ్రమణ్యం ముఖ్య పాత్రల్లో అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చిలుకూరు బాలాజీ’. ఈ చిత్రం పాటల సీడీని చినజీయర్ స్వామి విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ- ‘‘చిలుకూరు బాలాజీపై తెరకెక్కించిన ఈ చిత్రం పాటలను శంషాబాద్ పవిత్ర స్థలమైన శ్రీరామనగర్లోని జీవా ప్రాంగణంలో విడుదల చేయడం అభినందనీయం’’ అన్నారు.
‘‘నేటి యువతలో భక్తిభావాలు మెండుగా ఉన్నాయి. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని అల్లాణి శ్రీధర్ పేర్కొన్నారు. దర్శకుడు సానా యాదిరెడ్డి, సంగీత దర్శకుడు అర్జున్, పాటల రచయిత కాపర్తి వీరేంద్ర, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సి.రంగరాజన్ పాల్గొన్నారు.