మళ్లీ తెరపైకి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్
ప్రభుత్వం సానుకూలంగా ఉందని అధికారుల వెల్లడి
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో మూడో విడతగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అధికారులు అంటున్నారు. వారి నోట 800 మెగావాట్ల ప్లాంట్ ప్రస్తావన రావడంతో ఈ ప్రాంత వాసుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మూడేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హయాంలో 800 మెగావాట్ల ప్లాంట్ మంజూరు చేసి, రూ.నాలుగు వేల కోట్లు కేటాయించారు. అయితే తెలంగాణ ఏర్పాటుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్లాంట్ను రద్ధు చేసింది. నిధులు మంజూరై, స్థల సేకరణ చేసి, టెండర్లు పిలిచి ప్లాంట్ నిర్మించే సమయంలో రద్దు చేసి, మరో చోటుకు తరలించింది. అయితే గండ్రవెంకటరమణారెడ్డి పలుసార్లు టీజెన్కో సీఎండీ ప్రభాకర్రావుతో పాటు డైరెక్టర్లను కలిసి 800 మెగావాట్ల ప్లాంట్ను కేటీపీపీలో నిర్మించాలని వినతిపత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. దీంతో ఈ ప్లాంట్ మరోసారి తెరపైకి వచ్చింది. కేటీపీపీ సీఈ శివకుమార్ ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ 800 మెగావాట్ల ప్లాంట్పై యాజమాన్యం సానుకూలంగా ఉందని ప్రకటించిన విషయం విదితమే.