breaking news
cheemakurthy
-
దారుణం : అనుమానంతో భార్యకు గుండు కొట్టించి..
సాక్షి, చీమకుర్తి : భార్య.. రెండు అక్షరాల పదం.. భర్తతో మూడు ముళ్లు వేయించుకొని.. ఏడడుగులు నడిచి.. తల్లి దండ్రలను విడిచి, తాళి కట్టిన వాడితో కష్టసుఖాల్లో తోడుగా నిలిచేదే భార్య. అలాంటి ఆమెను సంతోషంగా చూసుకోవాల్సింది పోయి.. చిత్ర హింసలకు గురిచేశాడో భర్త. అనుమానం పెంచుకొని ఊరందరి ముందు భార్యను దారుణంగా అవమానించాడు. నాగరికత రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్నకాలంలో అనాగరిక చర్యకు పాల్పడ్డాడు ఓ భర్త. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అమానవీయ చర్య చోటుచేసుకంది. సమాజం సిగ్గుతో తలదించుకొనే రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం మంచికలపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మిలకు ఎనిమిదేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఎనిమిదేళ్ల అనంతరం భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస రావు భాగ్యలక్ష్మిని వేధించడం మొదలు పెట్టారు. మంచీ చెడు చెప్పాల్సిన శ్రీనివాస రావు తండ్రి, కొడుకును సమర్దిస్తూ వేధింపుల్లో వాట పంచుకున్నాడు. ప్రతి గుడికి తీసుకెళ్తూ.. మరోసారి ఆ పని చేయనంటూ ఆమె చేత చెప్పిస్తూ చెంపలేయించారు. ఇంత దారుణం జరుగుతున్న ఏ ఒక్కరు ఆమెకు మద్దతుగా రాలేదు. అనంతరం కాపురం చేయలేనంటూ పుట్టింటికి పంపించాడు. అయితే బంధువులు వత్తడి తీసుకురావడంతో భాగ్యలక్ష్మిని ఇంటికి తీసుకువచ్చాడు. కానీ వేరే గదిలో ఉండాలంటూ హెచ్చరించాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు గుండు కొట్టించి, ముఖానికి నలుపు రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. నాలుగు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి భాగ్యలక్ష్మిని విచారించగా.. ఫిర్యాదు ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. చివరకు కుటుంబ సభ్యుల మద్దతుతో మహిళ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బతుకు దెరువు కోసం వెళ్లి బలవన్మరణం
చీమకుర్తి రూరల్ : అనంతపురం జిల్లా తలుపుల మండలం సబ్బనగుంటపల్లికి చెందిన బూదలపల్లి ప్రభావతి(28) ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ జి.వి.చౌదరి తెలిపారు. ప్రభావతి కుటుంబం ఎనిమిదేళ్ల కిందట చీమకుర్తికి వలస వెళ్లారు. అక్కడి పవర్ ఆఫీస్ సమీపంలో నివాసముంటూ భర్త గ్రానైట్ క్వారీలో మెకానిక్ పని చేసేవాడు. వారికి ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. భర్త విధులకు వెళ్లగా తెల్లవారుజామున తాము నివాసముంటున్న రేకుల షెడ్డులోనే ఆమె చీరతో ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. అనారోగ్యంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్ఐ తెలిపారు.