breaking news
the Central University
-
'రోహిత్ మృతికి కారకులను శిక్షించాలి'
- లేదంటే దేశవ్యాప్త ఉద్యమం తప్పదు - బ్యాక్ వర్డ్ అండ్ మైనార్టీ కమ్యూనిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హైదరాబాద్ రోహిత్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని బ్యాక్వర్డ్ అండ్ మైనార్టీ కమ్యునిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (బామ్సెఫ్) జాతీయ అధ్యక్షులు వామన్ మిశ్రమ్ హెచ్చరించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ... రోహిత్ ఆత్మహత్య అనంతరం తాను జనవరి 21న ఢిల్లీ నుండి యూనివర్సిటీకి వచ్చి సందర్శించి 24వ తేదీన జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపుఇచ్చినట్లు తెలిపారు. తాను ఇచ్చిన పిలుపుమేర బామ్సెఫ్, అనుబంధ సంస్థలు దేశవ్యాపితంగా 350 జిల్లాల్లో నిరసన ర్యాలీలు, దిష్టిబొమ్మ ధగ్ధం కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. తాము చేపట్టిన నిరసన కార్యక్రమాలతో రోహిత్తో పాటు సస్పెండ్కు గురైన మరో నలుగురు విద్యార్ధులపై సస్పెండ్ను వెనక్కితీసుకున్నారన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ కూడా కేవలం రోహిత్ ఆత్మహత్యకు గల పరిస్థితులను కనుక్కొమ్మని వేసిందే తప్ప ఆత్మహత్య చేసుకోవడానికి వెనక ఉన్న వ్యక్తులను గుర్తించాలని ఎక్కడా చెప్పలేదన్నారు. యూనివర్సిటీ వీసీని దీర్ఘకాలిక సెలవులపై ఉద్దేశపూర్వకంగా పంపారని, ఇన్చార్జ్ విసీ నియామకం కూడా విద్యార్ధులకు ఇష్టలేకుండా నియమించారని, అంతే కాకుండా రోహిత్ తండ్రితో కూడా సమావేశం ఏర్పాటు చేయించారని అన్నారు. దీని వెనక ఎవరో ఉండి ఇవన్ని చేయిస్తున్నారని ఆరోపించారు. వెంటనే రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఫిబ్రవరి మొదటివారంలో దేశవ్యాపితంగా ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తామని, అప్పటికీ స్పందించకపోతే దేశంలోని అన్ని జాతీయ రహదారులను దిగ్భంధం చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే అన్ని సంట్రల్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనార్టీలపై జరిగే దాడులు, అవమానాలపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. -
ఐటీ హబ్గా హిందూపురం- ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ
పీఏబీఆర్ నీటి సరఫరాకు ప్రత్యేక విద్యుత్ లైన్ కోసం రూ.4 కోట్లు విడుదల ‘పురం’లో ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు : ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ హిందూపురం మునిసిపాలిటీ : తగిన ప్రణాళిక రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హిందూపురం ప్రాంతంలో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన నియోజకవర్గంలోని పార్టీ ఎమ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, పట్టణంలోని కౌన్సిలర్లు, తదితరులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హిందూపురం ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండటం, ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నందున, బెంగళూరు నుంచి అనంతపురం వరకు ఐటీ కారిడార్ ఏర్పాటు కోసం ప్రాథమిక నివేదికను తయారు చేస్తున్నామని, దానిని కచ్చితంగా తీసుకొస్తామని అన్నారు. స్థానికంగా ఉన్న మౌలిక వసతుల దృష్ట్యా ఇక్కడ ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. అలాగే హిందూపురం ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. పట్టణానికి బెంగళూరు ఉండటం, అక్కడ ప్రభుత్వ కిద్వాయ్ ఆస్పత్రి ఉండటం వల్ల నిపుణుల ద్వారా లోతుగా అధ్యయం చేస్తున్నామన్నారు. ఇక నియోజకవర్గానికి పీఏబీఆర్ నుంచి నీటి సరఫరా నిమిత్తం నిరంతర విద్యుత్ సరఫరా కోసం బంజుల బండ నుంచి ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్యపై శుక్రవారం అనంతపురంలో జరిగిన సమావేశంలో హంద్రీ నీవా, పీఏబీఆర్ పథకాలపై చర్చించామన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి ఉపాధి నిమిత్తం బెంగళూరు గార్మెంట్స్ సంస్థల్లో పని చేసేందుకు వెళ్తున్న మహిళల వలసల నివారణకు ఇక్కడే గార్మెంట్స్ పరిశ్రమల స్థాపనకు తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. బాలకృష్ణకు అంగన్వాడీ కార్యకర్తల వినతి అంగన్వాడీ కార్యకర్తలు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎదుట ఏకరువు పెట్టారు. స్థానిక ఆర్అండ్ బీలో వారు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దె చాలడం లేదంటూ యజమానులు, బాడుగకు భవనాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదన్నారు. దీంతో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిందని, శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, అలాగే తమ జీతాలను పెంచాలని వారు కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు బాలకృష్ణకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.