breaking news
Central Minister Smriti Irani
-
Smriti Irani: ఆ అయిదు రోజులు... అయితే ఏంటీ!
మెనుస్ట్రుయేషన్కు సంబంధించిన విషయాలు బహిరంగంగా మాట్లాడడానికి సంకోచించే రోజుల్లో, శానిటరీ యాడ్స్లో నటించడానికి నటీమణులు ససేమిరా అనే రోజుల్లో కెరీర్ తొలి అడుగుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్ లో నటించింది స్మృతి ఇరానీ. అది తన తొలి యాడ్. ‘అది ఫ్యాన్సీ యాడ్ కాదు. వదిలేయ్’ ‘ఈ యాడ్ చేస్తే తక్కువ చేసి చూస్తారు. నటిగా అవకాశాలు రావు’ అని అందరూ భయపెట్టారు. కానీ వాటిని పట్టించుకోకుండా ఆ యాడ్లో నటించింది స్మృతి. 25 సంవత్సరాల క్రితం నాటి ఆ వీడియోను స్మృతి ఇరానీ(ప్రస్తుతం కేంద్రమంత్రి) ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. ఆ వీడియోలో... పీరియెడ్స్, వాటిపై ఉండే అపోహలు... మొదలైన వాటి గురించి స్మృతి ఇరానీ మాట్లాడింది. ‘ఆ అయిదు రోజులు. అయితే ఏంటీ? పీరియెడ్స్ అంటే వ్యాధి కాదు. ప్రతి మహిళకు ఉండే సహజ లక్షణం. నేను, మా అమ్మ, మీరు... లక్షలాదిమంది భారతీయ మహిళల కోసం శానిటరీ ప్యాడ్లు ఉన్నాయి...’ అంటూ సాగే స్మృతి మాటలకు ఆ రోజుల్లో ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం వైరల్ అవుతోంది. ‘ఇది తప్పనిసరిగా గుర్తుచేసుకోదగిన జ్ఞాపకం’ అని తన వీడియో గురించి కాప్షన్ రాసింది స్మృతి ఇరానీ. ‘ఈరోజుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్లు చేయడానికి నటీమణులు సంకోచించడం లేదు. కాని ఆరోజుల పరిస్థితి వేరు. ఆ రోజులు నాకు ఇంకా బాగా గుర్తు ఉన్నాయి. పీరియెడ్స్ గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడే రోజుల్లో ధైర్యంగా స్మృతి ఆ యాడ్ చేయడం అభినందనీయం’ అంటూ ఒక యూజర్ కామెంట్ సెక్షన్లో స్పందించారు. -
స్మృతి ఇరానీ.. భవిష్యత్తులో రాష్ట్రపతి..!?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భవిష్యత్తులో భారతదేశానికి రాష్ట్రపతి కానున్నారా..? దీనికి అవుననే అంటోంది జాతీయ మీడియా. ఆదివారం రాజస్థాన్లోని భిల్వారాలో ఓ జ్యోతిష్కుడిని తన భర్తతో పాటు వెళ్లి స్మృతి ఇరానీ కలిశారని.. ఈ సందర్భంగా ఆ జ్యోతిష్కుడు స్మృతి భవిష్యత్తులో దేశానికి అధ్యక్షురాలు అవుతారని చెప్పారని కథనాలు వెలువరించాయి. ఇదే జ్యోతిష్కుడు గతంలో కూడా స్మృతి మంత్రి అవుతారని జోస్యం చెప్పారని, అది నిజం కావడంతో మరోసారి ఆయన దర్శనం కోసం స్మృతి వచ్చారని పేర్కొన్నాయి. మీడియాలో వార్తలపై స్మృతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం ఆమె స్పందిస్తూ.. ‘‘మంత్రిగా నా కార్యక్రమాలపై ప్రశ్నలు అడిగేందుకు మీకు హక్కు ఉంది. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం నా ఇష్టం. నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించొద్దు’’ అని విలేకరులకు సూచించారు.