కోర్టుకెళ్తే మీ బండారం బయట పెడతా
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో పేకాట అడిస్తూ పట్టుబడిన సీఎం చంద్రబాబు నాయుడు సన్నిహితుడు ప్రదీప్రెడ్డి పోలీసులను బెదిరించారు. కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్తే మీకు (పోలీసులకు, ఎమ్మెల్యేకు) క్రమం తప్పకుండా ఇస్తున్న మామూళ్ల సంగతి కూడా చెబుతానని హెచ్చరించారు. పాకాల మండలం చెన్నుగారిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం రహస్యంగా పేకాట ఆడుతున్నట్టు డ్రోన్ కెమెరాల ద్వారా బట్టబయలైంది. తిరుపతి ఎస్పీ కార్యాలయం ఆధీనంలోని కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తమై స్పెషల్ పార్టీ పోలీసులకు ఆ డ్రోన్ వీడి యోలు, లొకేషన్ పంపించారు.వాటి ఆధారంగా స్పెషల్ పార్టీ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రదీప్రెడ్డి అనే వ్యక్తి సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మరో ఇద్దరు ఎమ్మెల్యే నానికి అత్యంత సన్నిహితులు. వీరి ఆధ్వర్యంలోనే పేకాట సాగుతోంది. ఈ క్రమంలో వీరిని ఎలాగైనా తప్పించాలని ఎమ్మెల్యే నాని పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికే విషయం మీడియాకూ తెలియడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ప్రదీప్రెడ్డి పోలీసులను బెదిరించారు. పై నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో పోలీసులు సదరు నిందితులకు రాచమర్యాదలతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు.