breaking news
C. Vital
-
జీహెచ్ఎంసీలోని స్థానికేతరులు స్వస్థలాలకు వెళ్లాలి
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లతో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న తెలంగాణేతర ఉద్యోగులందరినీ వారి వారి ప్రాంతాలకు పంపించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు జి. దేవిప్రసాద్, సి. విఠల్, కారం రవీందర్రెడ్డి, తిప్పర్తి యాదయ్య తదితరులు మాట్లాడారు. జీహెచ్ఎంసీతోపాటు తెలంగాణలోని ఇతర మునిసిపాలిటీల్లో పనిచేస్తున్నవారిని కూడా ఎలాంటి ఆప్షన్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమించాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇక్కడ ఉద్యోగాల్లో చేరినవారు కూడా వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. అపాయింటెడ్ డే (జూన్2)కు ముందుగానే ఇక్కడి ఉద్యోగులంతా వారి మాతృసంస్థలకు వెళ్లిపోవాలని సూచించారు. వారంతా వెళ్లిపోయాక మిగిలే ఖాళీలను స్థానికులైన నిరుద్యోగ యువతతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు చెత్త నిర్వహణ పనులకు రాంకీకి అప్పగించరాదని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక తగిన నిర్ణయం తీసుకోగలదన్నారు. సమావేశానంతరం ఇవే డిమాండ్లతో రూపొందించిన వినతిపత్రాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్కు అందజేశారు. -
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన
ఆలంపల్లి, న్యూస్లైన్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీజేఏసీ రాష్ట్ర కో చైర్మన్ సీ.విఠల్ అన్నారు. సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో నిర్వహించిన ఉద్యోగుల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రా సచివాలయంలోనే పనిచేయాలని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు పనిచేయకూడదని జేఏసీ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఎన్నికల హడావుడిలో ఉండగా రెండు రాష్ట్రాల విభజనకు 21 కమిటీలు వేశారని, అందులో అందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని ఆరోపించారు. పనికిరాని భవనాలను తెలంగాణ కార్యాలయాలకు, అధునాతన భవనాలు ఆంధ్రా ప్రాంతం వారికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తామని, వికారాబాద్ జిల్లా ఏర్పాటు, స్థానికంగా జూనియర్ కళాశాల, ఎస్ఏపీ కళాశాలలో లెక్చలర్ల నియామకం, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కోసం జేఏసీ పోరాటం చేస్తుందన్నారు. సుస్థిరపాలన అందించే పార్టీకి, ప్రజలకు సేవచేసే సమర్థవంతమైన నాయకుడికి ఓటు వేయాలని కోరారు. పోలింగ్ విధుల తర్వాత ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్, టీయూటీఎఫ్ నాయకులు యూ.విఠల్, నాయకులు ప్రతాప్, మారుతీ, దేవదాస్, నందకుమార్, ప్రేం కుమార్, దుర్గప్రసాద్, నర్సింహులు, రామారావుజోషి పాల్గొన్నారు.