breaking news
Burdwan blast case
-
భారీ ఉగ్రవాద కుట్ర భగ్నం
డిస్పూర్ : బుర్ద్వాన్ పేలుడు కేసులో దర్యాప్తు బృందాలు మంచి పురోగతి సాధించాయి. జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎమ్బీ)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను అసోంలో పోలీసులు అరెస్టు చేశారు. 2014 అక్టోబర్లో జరిగిన బుర్ద్వాన్ పేలుళ్లలో వీరు ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా వీరి కార్యకలాపాలపై దృష్టిసారించిన కోల్కత్తా పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఈ ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. ఈ ఆరుగురిలో ముగ్గురు బంగ్లాదేశ్కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఇండియాకు చెందిన జమాత్-ఉల్-ముజాహుద్దీన్ ఉగ్రవాదులు. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం బుర్ద్వాన్ పేలుడు ఘటనతో లింక్ ఉన్న ఈ ఆరుగురు టెర్రరిస్టులలో ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు కోరినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల నుంచి భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు డిటోనేటర్లు, కేబుల్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సంయుక్త పోలీసు కమిషనర్ విశాల్ గార్గ్ తెలిపారు. అరెస్టు అయిన వారు, బంగ్లాదేశ్లో ఎంపికయ్యే ప్రభుత్వంపై, భారత సరిహద్దు రాష్ట్రాలలో దాడులకు పాల్పడేందుకు వ్యూహాలు పన్నుతున్నట్టు అధికారులు చెప్పారు. ఎన్ఏఐ అధికారులు వీరిని విచారిస్తారని, పేలుడు ఘటనతో సంబంధం ఉన్న మిగతా ఆధారాలను సేకరిస్తారని టాస్క్ ఫోర్స్ చెప్పింది. బుర్ద్వాన్లోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు బాంబులు తయారుచేస్తుండగా జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాటి ఘటనలో పేలుడు పదార్థాల తయారీలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు మృత్యువాత పడగా, మరొకరు గాయపడ్డారు. ఆ ఘటనపై స్పెషల్ టాస్క్ ఫోర్స్, జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. -
బర్ద్వాన్ పేలుళ్ల కేసులో కీలక నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని బర్ద్వాన్ లో జరిగిన పేలుళ్ల కేసులో కీలక నిందితుడు షహనూర్ ఆలంను శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. పేలుళ్లు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న షహనూర్ ఎట్టకేలకు చిక్కాడు. మయన్మార్ ఉగ్రవాది మహ్మద్ ఖలీద్ ఇచ్చిన సమాచారంతో షహనూర్ ను అరెస్ట్ చేసినట్టు సమాచారం. అసోంలోని బార్పేట జిల్లా చతాలో ఉన్న అతని నివాసంలో గత నెలలో ఎన్ఐఏ సోదాలు జరిపారు. ఆరు గంటల పాటు సోదాలు జరిపి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సాజిద్ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయగా, మయన్మార్ ఉగ్రవాది మహ్మద్ ఖలీద్ను ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్లోని ఓ ఇంటిలో అక్టోబర్ 2న బాంబు పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే.