breaking news
Brajesh tribunal
-
ఇప్పుడైనా ఆర్డీఎస్కు నీరందేనా..?
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)తో రాష్ట్రానికి రావాల్సిన వాస్తవ నీటి వాటాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీతో ఉన్న వివాదాన్ని కేంద్ర సహకారంతో చక్కదిద్దుకునే ప్రయత్నం చేసిన రాష్ట్రం.. వాటా మేరకు నీటిని వినియోగంలోకి తెచ్చి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరిచ్చే యత్నాలకు పూనుకుంది. కేంద్రం ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ఏపీ సహకారం అందిస్తే ఆర్డీఎస్ కింద బ్యారేజీ నిర్మించి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే దిశగా కసరత్తు చేస్తోంది. అవసరమైతే దీనిపై మరోమారు ఏపీతో, కర్ణాటకతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీలు లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించినమేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక అంగీకరించింది. అలాగే కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ర్టం రూ.72 కోట్ల మేర డిపాజిట్ కూడా చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతుండడంతో 4 టీఎంసీలు మాత్రమే రాష్ట్రానికి అందుతున్నాయి. దీంతో 37 వేల ఆయకట్టుకు సాగునీరందుతోంది. ఈ విషయాన్ని ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం దృష్టికి తీసుకురాగా, నిర్ణీత నీటిని తెలంగాణ వాడుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇందుకు తాము సహకరిస్తామని ఏపీ స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మిస్తే మేలంటున్న తెలంగాణ.. ఆర్డీఎస్ కింద ఉన్న నీటి కేటాయింపులను వాడుకునేందుకు బ్యారేజీ నిర్మిస్తే మేలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యారేజీ అయితేనే లక్ష్యం మేర ఆయకట్టుకు నీటిని అందించవచ్చని చెబుతోంది. బ్రజేష్ ట్రిబ్యునల్ సైతం కొత్తగా తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అదనం గా ఏపీలోని కేసీ కెనాల్కు కేటాయించిన దృ ష్ట్యా, ఆ నీటిని ఈ బ్యారేజీ ద్వారా అందించవచ్చు. బ్యారేజీ నిర్మాణంలో ఏపీ సైతం భాగస్వామ్యం కావాలని రాష్ట్రం అంటోంది. -
శ్రీశైలం నుంచే ‘పాలమూరు’ నీరు!
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ⇒ మంత్రులు, అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లతో సుదీర్ఘ సమీక్ష ⇒ బ్రజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన కేటాయింపుల్లోంచే 70 టీఎంసీల నీరు తీసుకునేలా ప్రణాళిక ⇒ 31న శంకుస్థాపన ⇒ అదేరోజు నక్కలగండికి శిలాఫలకం! సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ముందుగా నిర్ణయించిన జూరాలపై ఇప్పటికే నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా మంటి ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉండడం, జూరాల రిజర్వాయర్ సామర్ధ్యం చిన్నది కావడంతో... పెద్ద రిజర్వాయర్గా ఉన్న శ్రీశైలం నుంచి నీటిని తీసుకుంటేనే మేలనే అభిప్రాయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. అంతేకాక... జూరాలకు 25 రోజులు మాత్రమే వరద ఉంటుండగా, శ్రీశైలంలో 90 రోజులపాటు ఉండడం కూడా అక్కడి నుంచే నీటిని మళ్లించేందుకు మొగ్గుచూపారు. నీటిని మళ్లింపు విషయంలో స్పష్టత రావడంతో ఈ నెల 31న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించారు. గురువారం పాలమూరు ఎత్తిపోతలు, మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు తదితరాలపై నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్రావు, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, రిటైర్డు ఇంజనీర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సమీక్షలో... బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కృష్ణాలో వినియోగించుకునేందుకు హక్కు ఉన్న నీటిలో నుంచే ప్రాజెక్టుకు అవసరమైన 70టీఎంసీలను వాడుకొని పది లక్షల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. శ్రీశైలం నుంచి నీటిని మళ్లిస్తే మొదటి ప్రతిపాదనలో ఉన్న కోయిల్కొండ, గండేడు రిజర్వాయర్లు ఉండవు. అయితే వాటి కింద ఉన్న ఆయకట్టు దెబ్బతినకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు. కొత్త ప్లాన్లో లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్తో పాటు మరో నాలుగు రిజర్వాయర్లు చేపట్టాల్సి ఉంటుంది. కొత్త కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణం అంచనాలను ఈనెల 25లోగా తమకు అందజేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. వాటి పరిశీలన అనంతరం 31న ప్రాజెక్టుకు భూత్పూర్ వద్ద శంకుస్థాపన చేయనున్నారు. జీవో 13కు ఓకే! రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్)పెంపు చేయాలన్న నలుగురు సభ్యుల కమిటీ నివేదికకు ముఖ్యమంత్రి ఆమోదం ఇచ్చినట్లు తెలిసింది. జీవో-13ని చిన్నపాటి మార్పులుచేర్పులతో అమలు చే సి, పనులు వేగిరం అయ్యేల ఆచూడాలని సూచించినట్లు సమాచారం. ఈ జీవో అమలైతే సుమారు రూ.4వేల కోట్లఅదనపు భారం పడనుందని సమాచారం. 31నే నక్కలగండి... నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని మూడన్నర లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, ఫ్లోరైడ్ గ్రామాల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని పాలమూరుతో పాటు ఈ నెలాఖరునే శిలాఫలకం వేసేందుకు సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. 7.64 టీఎంసీల సామర్ధ్యం ఉండే నక్కలగండి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్డిండి ద్వారా అప్పర్ డిండి వరకు నీటి తరలించేందుకు మొత్తంగా రూ.5,500 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు.