breaking news
boycott classes
-
టీచర్ కోసం తరగతుల బహిష్కరణ
పుత్తూర్: టీచర్ బదిలీని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనబాట పట్టగా.. వారికి మద్దతుగా తల్లిదండ్రులు కూడా రోడ్డెక్కారు. టీచర్ బదిలీని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. వివరాల్లోకెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూర్లో సవితా కుమారి 19 ఏళ్లుగా ఉపాధ్యాయురాలిగా కొనసాగుతున్నారు. తనదైన శైలి బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దడంతోపాటు తల్లిదండ్రుల్లోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కాగా 185 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో సవితా కుమారిని అదనపు టీచర్గా గుర్తించిన అధికారులు ఆమెను మరోచోటుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తరగతులను బహిష్కరించి, తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. వీరికి ప్రజాసంఘాలు కూడా మద్దతుగా నిలవడంతో ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే రంగంలోకి దిగాల్సి వచ్చింది. సవితా కుమారిని బదిలీ చేస్తే దాని ప్రభావం విద్యార్థుల భవిష్యత్తుపై పడుతుందని, నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తల్లిదండ్రులు చేసిన డిమాండ్పై స్థానిక ఎమ్మెల్యే శంకుతల స్పందిస్తూ... బదిలీని ఉపసంహరించే అధికారం తనకు లేదని, అయితే ప్రభుత్వానికి ఈ మేరకు సిఫారసు చేస్తానంటూ హామీ ఇచ్చారు. అంతేకాక బదిలీ చేయడానికిగల కారణాలను తెలియజేయాలంటూ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అయితే నిబంధనల మేరకే సవితా కుమారిని బదిలీ చేశామని అధికారులు చెప్పడంతో ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తాము తరగతులకు వెళ్లబోమని విద్యార్థులు ప్రకటించారు. తల్లిదండ్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. -
కళేబరాల వాసన తో తరగతుల బహిష్కరణ..!
దిలావర్పూర్ : మండల కేంద్రమైన దిలావర్పూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆవరణ పరిసరాల్లో పందుల కళేబరాల దుర్గంధంతో మంగళవారం విద్యార్థులు పాఠశాల తరగతులను బహిష్కరించారు. గ్రామంలోని పందుల స్వైరవిహారం అధికమడంతో పాటు నిత్యం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విద్యార్థులకు పాఠశాల పక్కనే మతి చెందిన పందుల కారణంగా మంగళవారం ఉదయం నుంచి పాఠశాలకు తీవ్ర దుర్గంధం వ్యాప్తి చెందడంతో పాఠశాలలోని నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. అలాగే మిగతా విద్యార్థులు సైతం తీవ్ర దుర్గంధం కారణంగా పాఠశాలలో ఉండమంటూ బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు సైతం చేసిది ఏమీ లేక విద్యార్థులందరితో కలసి బయటకు వెళ్లారు. మధ్యాహ్న భోజన సామగ్రి నంతటినీ ఆటోలో తరలించుకుని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో వనభోజనానికి తరలివెళ్లి విద్యార్థులకు అక్కడే పాఠాలు చెప్పి ఇండ్లకు తరలి వెళ్లారు. ఈసందర్భంగా పలువురు విదార్థులు మాట్లాడుతూ గ్రామంలో పందుల స్వైరవిహారంపై అధికారుల స్పందించాలని డిమాండ్ చేశారు.