breaking news
Bikshapathi Yadav
-
గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్లో విభేదాలు
హైదరాబాద్: మహాకూటమి సీట్ల సర్దుబాటులో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా శేరిలింగంపల్లి సీటు టీడీపీకి కేటాయించే అవకాశం ఉండటంతో లొల్లి మొదలైంది. దీనిలో భాగంగా గాంధీ భవన్ వద్ద బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అనుచరులు.. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే భిక్షపతి అనుచరుడు పెట్రోల్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తను ఇతర కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితం శేరిలింగంపల్లి సీటును తనకే కేటాయిస్తారంటూ ప్రచారం చేసుకున్న భిక్షపతి.. తాజా పరిణామాలతో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించవద్దని భిక్షపతి యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వకుండా ఎవరిని నిలబెట్టినా ఓడిస్తామని ఆయన హెచ్చరించారు. భిక్షపతి యాదవ్కు మద్దతుగా మరొక కార్యకర్త చేయి కోసుకుని నిరసన తెలిపాడు. -
గ్రేటర్ కాంగ్రెస్ లో అసమ్మతి సెగ
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు తారాస్థాకి చేరుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించిన వారికి.. తాజాగా టికెట్లు ఇస్తున్నారని ఒక వర్గం వారు ఆరోపించారు. మరి కాసేపట్లో అసమ్మతి నేతలు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. కాగా.. తమ మాట వినక పోతే.. రాజీనామాకు కూడా సిద్దమని గ్రేటర్ నేతలు హెచ్చరించారు. సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీశైలం గౌడ్, శ్రీధర్, బిక్షపతి యాదవ్ లు మరి కాసేపట్లో పీసీసీ అధ్యక్షుడిని కలవనున్నట్లు ప్రకటించారు. -
భయమా.. బద్ధకమా.!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారు. భూ కబ్జాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏమాత్రం చలనం ఉండట్లేదు. ఎందుకింత ఉదాసీనత.. ఆక్రమణదారుల నుంచి ఇబ్బందులుంటున్నాయా, లేక వాటిని తొలగించలేని నిర్లక్ష్యవైఖరా.. ఈ నాటకాలేంది..? అంటూ రెవెన్యూ, జీహెచ్ఎంసీ యంత్రాంగంపై జిల్లా సమీక్షా మండలి సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని స్ఫూర్తి భవన్లో జిల్లా సమీక్షా మండలి పట్టణ ప్రాంత సమావేశం జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి డి.శ్రీధర్బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి ప్రసాద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్, వాటర్బోర్డు ఎండీ శ్యామలరావు, కలెక్టర్ బి.శ్రీధర్, అర్బన్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమీక్షలో భాగంగా ఆక్రమణలపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ పైవిధంగా స్పందించగా, ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం, ఆకుల రాజేందర్ తదితరులు ఆయనకు గొంతు కలుపుతూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది అధికారుల నిర్వాకమే.. శేరిలింగంపల్లి మండలం కుడికుంటలోని సర్వేనంబర్ 188లోని చెరువు శిఖంలో ఓ ప్రైవేటు సంస్థ రియల్ వ్యాపారం సాగిస్తున్న తీరుపై గతంలో ఫిర్యాదు చేసినా యంత్రాంగం ఇప్పటివరకు స్పందించలేదని ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు సంస్థ కోర్టుకెళ్లినప్పటికీ అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో కోర్టు స్టే ఇచ్చిందని, అధికారుల సహకారంతోనే ఈ తతంగమంతా సాగిందనేది స్పష్టమవుతోందన్నారు. కలెక్టర్ బి.శ్రీధర్ స్పందిస్తూ.. అధికారులతో సర్వే చేయించగా ఆక్రమణలున్నట్లు గుర్తించి జీహెచ్ఎంసీకి నివేదిక ఇచ్చామన్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ స్పందిస్తూ.. సదరు సంస్థకు నోటీసులు జారీ చేశామని, పరిస్థితిని సమీక్షిస్తానన్నారు. ఇంతలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే అక్కడ రోడ్డు నిర్మాణం సైతం పూర్తి చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెలే ్య కూన శ్రీశైలం మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ మండలంలో మైనింగ్ కోసం ఓ కంపెనీకి భూమి కేటాయిస్తే ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని, ఇది చట్టవిరుద్ధమని ఆయన ప్రస్తావించారు. మల్కాజ్గిరిలోనూ ఇదే తరహాలో ఆక్రమణలున్నాయంటూ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పేర్కొనగా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నీళ్లివ్వండి.. రోడ్లు వేయండి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ముఖ్యంగా శివార్లలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, కేటాయింపులో కోతలు పెడుతుండడంతోనే సమస్య తీవ్రతరమవుతుందని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కేఎల్లార్, భిక్షపతి యాదవ్, రాజేందర్ తదితరులు వాటర్బోర్టుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో బిల్లులు చెల్లించిన మేరకు నీళ్లిస్తున్నామని, బకాయిలు చెల్లిస్తే పూర్తిస్థాయి నీటిని వదులుతామని వాటర్బోర్డు ఎండీ శ్యామలరావు స్పష్టంచేశారు. మల్కాజ్గిరిలోని వాంబే కాలనీలో నిర్మాణాలు చేపట్టి ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ లబ్ధిదారులకు అందించలేదని, అక్కడి సామగ్రిని కొందరు దొంగిలిస్తున్నారన్నారు. నీటివసతి లేకపోవడంతో అబ్దుల్లాపూర్మెట్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తాగునీటిని కేటాయించాలని ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. పంచాయతీల పరిధిలో బిల్లులు పెండింగ్లో ఉండడంతో అక్కడ నీటి సరఫరా నిలిపివేశామని, చెల్లింపులు చేసిన వెంటనే పునరుద్ధరిస్తున్నామని.. జలమండలి ఏటా కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లిస్తోందని, వసూళ్ల ప్రక్రియ లేకుంటే నీటి విడుదల కష్టమని శ్యామలరావు తేల్చి చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రేటర్ రోడ్లు అధ్వానంగా మారాయని, వెంటనే రోడ్లు పునరుద్ధరించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా, వెంటనే మరమ్మతులు చేస్తామని ఆర్అండ్బీ అధికారులు వివరించారు. విలీనంపై తేల్చండి ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో పంచాయతీల విలీనంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయా పంచాయతీల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, అటు గ్రేటర్లోకి రాకుండా, ఇటు పంచాయతీ అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. వెంటనే ప్రత్యేకాధికారులను నియమించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరగా మంత్రి శ్రీధర్బాబు స్పందిస్తూ ఈ అంశం పంచాయతీరాజ్ మంత్రి దృష్టిలో ఉందని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. నాగేశ్వర్ నిరసన అల్వాల్ ప్రభుత్వ పాఠశాలలో భవనం లేకపోవడంతో విద్యార్థులు రోడ్లపక్కన కూర్చోవాల్సి వస్తోందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పలుమార్లు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందంటూ మండిపడ్డారు. ఇంతలో డీఈఓ సోమిరెడ్డి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయగా.. ఆయన సంతృప్తి చెందకుండా కుర్చీలోంచి లేచి వేదిక ముందు బైఠాయించారు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ప్రకటనలు చేశారని, తనకు స్పష్టమైన తేదీని చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్నారాయణ మద్దతు పలుకుతూ పట్టణ ప్రాంతాల్లోని పలు పాఠశాలల్లో భవనాలు సరిగ్గా లేవన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుంటే వారంలోపు షెడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు.