breaking news
Best Service Award
-
ఊరంతా మా కుటుంబమే!
విధుల్లో ఉత్తమసేవలు అందించినందుకుగాను జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం, రేగట్టె వెంకట రమణ ఎంపికయ్యారు. నేడు న్యూఢిల్లీలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా రేగట్టె వెంకటరమణను పలకరిస్తే తన ఇరవై మూడేళ్ల్ల కృషిని వివరించారు. ‘‘పై అధికారులు చెప్పిన పనిని సమయానుకూలంగా నూటికి నూరు శాతం పూర్తి చేస్తూ రావడం వల్లే ఈ రోజు ఈ పురస్కారం లభించింది. ఎనిమిదవ తరగతి పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఇరవై మూడేళ్ల్ల క్రితం అత్తింటిలో అడుగుపెడుతూనే అంగన్వాడీ టీచర్గానూ చేరాను. ఆ తర్వాత మా వారు భద్రయ్య, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు ఇద్దరు కూతుళ్లు. మా ఇంటినే కాదు ఊరు బాగోగులు చూసుకునే అవకాశం కూడా దక్కడం అదృష్టంగా భావిస్తాను. అందుకే, నాకు మా ఊరే కుటుంబం అయ్యింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరికీ తెలిసిపోతుంది. అందరూ అందరి కోసం అన్నట్టుగా ఎన్నో కార్యక్రమాలను జరుపుతుంటాం. ఇవన్నీ ఊళ్లో అందరినీ సంఘటితం చేస్తున్నాయి. ప్రీ స్కూల్, ఆరోగ్యలక్ష్మి, ఇంటింటి అంగన్వాడీ హోమ్ విజిట్స్, పౌష్టికాహార, తల్లిపాల వారోత్సవాలు, మిల్లెట్స్ మాసం, పిల్లల చదువుకు సంబంధించి.. ఇలా ప్రతిదీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. ఏ కార్యక్రమం చేసినా నూరు శాతం సక్సెస్ అవుతుంది. ఇంటింటి ప్రోగ్రామ్.. గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. వారి ఆరోగ్యం, పౌష్టికాహారం.. ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. అలాగే పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుంటాం. మేం మా డైరీలో సక్సెస్ స్టోరీలు కూడా నోట్ చేస్తాం. ఒకసారి ఒక గర్భిణి పౌష్టికాహారం గురించి, తీసుకోవలసిన ఇతర జాగ్రత్తల గురించీ మేం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇచ్చిన పౌష్టికాహారం తీసుకోలేదు. ఆమెకు డెలివరీ అయి బరువు తక్కువతో పాప పుట్టి, చనిపోయింది. అయినా ఆమెను మళ్ళీ మళ్లీ కలుస్తూనే, విషయాలన్నీ చెబుతూ ఆమె తిరిగి కోలుకునేలా చేశాం. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అయినప్పుడు మేం చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించింది. ఈసారి ఆరోగ్యకరమైన పాపకు తల్లి అయ్యింది. ఆ తర్వాత ఆమెనే ఊళ్లో ఎవరు ప్రెగ్నెంట్ అయినా తనలా అశ్రద్ధ చేయద్దని సూచనలు చేస్తుంటుంది. చంటిపిల్లల విషయంలోనూ తల్లులు ఒకరిద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. అందరూ మా వాళ్లే.. గర్భిణులకు సీమంతాలు, స్కూల్ డే, చిల్డ్రన్ డే వంటి కార్యక్రమాలకు గ్రామపెద్దలు డబ్బులు పోగేసి మరీ చేస్తుంటారు. ర్యాలీలు, వారోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటికీ గ్రామపెద్దలను కలిసి చెబుతాను. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తాను. వాళ్లూ మిగతా అందరినీ కూడగట్టుకొని, మాకు మద్దతు ఇస్తారు. దీంతో ఊరంతా ఆరోగ్యంగా ఉండేలా సరైన కృషి జరుగుతోంది. కార్యక్రమాల్లో ఊరంతా ఒక్కటవుతుంది. ఆ రోజు ఎవరూ పనులకు కూడా వెళ్లరు. కార్యక్రమాలను ఓ పండగలా జరుపుతుంటారు. నేను చెప్పిన విషయాలను వినడంలోనూ, ఆచరించడంలోనూ మా ఊరంతా నాకు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. కరోనా సమయంలోనూ తీసుకున్న జాగ్రత్తలకు రాష్ట్రస్థాయి అ«ధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. బెస్ట్ అవార్డీగా... మండల, ప్రాజెక్ట్, జిల్లా స్థాయుల్లోనూ.. బెస్ట్ అంగన్వాడీ టీచర్గా అవార్డులు అందుకున్నాను. ఈ యేడాది జాతీయ స్థాయికి ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిల్లెట్స్తో ఐటమ్స్ తయారుచేసి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాం. వాటి ప్రయోజనాలను వివరిస్తాం. దీనివల్ల ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి. మా అంగన్వాడీ టీచర్స్కి నెలలో రెండు సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో ఊళ్లలో చేపట్టే కార్యక్రమాల వివరాలు పంచుకోవడం, ముందస్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడం, నిర్ణయాల అమలుకు కృషి చేయడం మాకున్న పెద్ద బాధ్యత. దీనిని సక్రమంగా నిర్వర్తించడమే ఈ రోజు మీ అందరి ముందు నిలిపింది’’ అని ఆనందంగా వివరించింది వెంకటరమణ. – నిర్మలా రెడ్డి -
‘ఏరియా’.. అదిరెనయా
♦ ఉత్తమ సేవలకు గుర్తింపు ♦ ఈనెల 11న హైదరాబాద్లో ప్రదానం ♦ హైరిస్క్’లో టార్గెట్కు మించి ప్రసవాలు మెదక్ : స్థానిక ఏరియా ఆస్పత్రి.. ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికైంది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మెదక్ ఏరియా ఆస్పత్రితోపాటు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిని రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవా ఆస్పత్రులుగా గుర్తించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్లు ఈ నెల 11న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి అధికారుల చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రిలో ఏడాదికి 1400 ప్రసవాలు చేయాలనే టార్గెట్ ఉండగా, 2,400 చేసి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. అలాగే నెలకు 10యూనిట్ల రక్తానికి గాను, ప్రస్తుతం నెలకు 60-70 యూనిట్ల రక్తాన్ని వినియోగిస్తున్నారు. హైరిస్క్ సెంటర్ ఏర్పాటుతో ప్రసవాలు రెట్టింపుస్థాయిలో అవుతున్నాయి. వంద పడకల ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ మెరుగైన సేవలే అందుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఆరు మాసాల క్రితం కొత్త బెడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ బెడ్షీట్స్ రోజుకో కలర్ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే మెదక్లో ప్రథమంగా బెడ్షీట్ల మార్పిడిని పెలైట్గా ఏర్పాటు చేసి మంచి ఫలితాలను సాధించారు. మూడు నెలల క్రితం ఏరియా ఆస్పత్రిలో రూ.12లక్షలు వెచ్చించి అధునాతన ఎక్స్రేలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించారు. నిరుపేదలకు మెరుగైన సేవలు.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన సేవలందించేందుకు ఇప్పటికే డయాలసిస్తోపాటు ఐసీయూ మంజూరు చేయించాం. 100 నుంచి 250 పడకల ఆస్పత్రిగా, గర్భిణులకు అదనంగా 50 పడకల కోసం ప్రతిపాదనలు పంపాం. -డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు ఏడాదిగా మెదక్ ఏరియా ఆస్పత్రిలో నిరుపేదలకు అనేక రకాలుగా సేవలందిస్తున్నాం. ఈ సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా గుర్తించింది. ఈ అవార్డు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. -పి.చంద్రశేఖర్, సూపరింటెండెంట్