breaking news
Bee forms
-
దారులన్నీ తెలంగాణ భవన్కే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎన్నికల పరుగుపందెంలో ముందంజలో ఉన్న అధికార బీఆర్ఎస్ పార్టీ.. బరిలో నిలిచే అభ్యర్థులకు ఆదివారం బీ ఫారాలు అందించనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీ బరిలోకి దిగనున్న అభ్యర్థులంతా ఉదయం 9గంటల వరకు తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు. అక్కడ 11 గంటలకు సీఎం చేతుల మీదుగా బీ ఫారాలు అందుకోనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్త అభ్యర్థులతో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కాసేపు మాట్లాడుతారు. భోజనం అనంతరం వారంతా తిరుగుముఖం పడతారు. హుస్నాబాద్లో సభా ఏర్పాట్ల నేపథ్యంలో కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్ నేతలు కాస్త ముందుగానే బయల్దేరుతారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు చాలా మంది రాజధానికి చేరుకున్నారని సమాచారం. వీరిలో ముగ్గురు తొలిసారి, ఇద్దరు రెండోసారి, ఆరుగురు మూడోసారి, ఒకరు ఐదోసారి, మరొకరు ఏడోసారి బీ ఫారాలు అందుకోనుండడం గమనార్హం. ఈ దఫాతో ఎవరెన్నిసార్లంటే.. ► కొప్పుల ఈశ్వర్, ధర్మపురి: ఏడుసార్లు (2004, 2008, 2009, 2010, 2014, 2018, 2023) ► కేటీఆర్, సిరిసిల్ల: ఐదుసార్లు (2009, 2010, 2014, 2018, 2023) ► గంగుల కమలాకర్, కరీంనగర్: మూడుసార్లు (2014, 2018, 2023) ► పుట్ట మధు మంథని: మూడుసార్లు (2014, 2018, 2023) ► దాసరి మనోహర్రెడ్డి, పెద్దపల్లి: మూడుసార్లు (2014, 2018, 2023) ► రసమయి బాలకిషన్, మానకొండూరు: మూడుసార్లు (2014, 2018, 2023) ► వొడితెల సతీశ్బాబు, హుస్నాబాద్: మూడుసార్లు (2014, 2018, 2023) ► డాక్టర్ సంజయ్, జగిత్యాల: మూడుసార్లు (2014, 2018, 2023) ► సుంకె రవిశంకర్, చొప్పదండి: రెండుసార్లు (2018, 2023) ► కోరుకంటి చందర్, రామగుండం: రెండుసార్లు (2009, 2023) తొలిసారి అందుకునేవారిలో ► డాక్టర్. కె.సంజయ్ (కోరుట్ల) : తొలిసారి ► పాడి కౌశిక్రెడ్డి (హుజూరాబాద్): తొలిసారి ► సీహెచ్ లక్ష్మీనరసింహారావు (వేములవాడ): తొలిసారి విజయంపై ధీమా.. పదేళ్లుగా పార్టీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులే తమను తిరిగి గెలిపిస్తాయని గులాబీ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న 88 సీట్లకు మించి ఈసారి విజయం సాధిస్తామంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తూ వచ్చిన తాము.. ఈసారి 13కు 13 సీట్లు గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శనివారంతో అమావాస్య ముగియనుంది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ సభతో పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించనున్నారు. ఆ వెంటనే బీ ఫారాలు అందుకున్న అభ్యర్థులంతా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. చాలామంది నాయకులు ఎన్నికల ప్రచార రథాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఆనందంగా ఉంది నాపై విశ్వాసంతో టికెట్ కేటాయించి నేడు బీఫారం అందిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాను. మూడు నెలలుగా అన్నివర్గాల ప్రజలతో మమేకం అయ్యాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి. తప్పకుండా భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి కేసీఆర్ను సీఎం చేసేందుకు కృషి చేస్తాను. – చల్మెడ లక్ష్మీనర్సింహారావు -
'బి' టెన్షన్
గంట ముందే బీ ఫారాలు అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి ‘దూకుడు’ను అడ్డుకునేందుకే... అభ్యర్థుల్లో ఆందోళన సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు... ఇతర పార్టీల అభ్యర్థులుగా మారకూడదనే తలంపుతో వివిధ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలతో పాటు అధికార టీఆర్ఎస్లో సైతం ఇదే పరిస్థితి. అభ్యర్థులను ప్రకటించేందుకు తాత్సారం చేసిన పార్టీలు.. బీ ఫారాలు ఇచ్చేందుకూ వెనుకాడుతున్నాయి. అన్ని పార్టీల నుంచీ ఒకరికి మించి నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. వీరిలో సొంత పార్టీ బీఫారం అందని వారంతా గోడ దూకి వేరే పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారేమోనని అగ్రనేతలు ఆలోచిస్తున్నారు. దీంతో ఇప్పుడే బీ ఫారాలు ఇచ్చేందుకు సాహసించడం లేదు. నామినేషన్లు వేసిన వారిలో కొందరు స్థానికంగా పట్టున్నవారు కావడం... ఎన్నికల్లో సొంత బలంతో గెలిచే పరిస్థితి ఉండటంతో అలాంటి వారి విషయమై పార్టీలు ఆందోళనలో ఉన్నాయి. దీంతోచివరి గంటలో మాత్రమే బీ ఫారాలు అందజేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప సంహరణకు తుది గడువైన 21వ తేదీ(గురువారం) మధ్యాహ్నం 3 గంటల్లోగా అభ్యర్థులు బీఫారాలు సమర్పించాల్సి ఉంది. ఆ వ్యవధి ముగిసేందుకు గంటో... గంటన్నర ముందు మాత్రమే బీ ఫారాలు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా చేస్తేనే ‘దూకుడు’కు అడ్డుకట్ట వేయవచ్చనేది వారి యోచన. మంగళవారం నియోజకవర్గాల ఇన్చార్జులతో సమావేశమైన టీడీపీ ప్రోగ్రామ్ కమిటీ నాయకులు తమ అభ్యర్థులకు బుధవారం బీ ఫారాలు ఇస్తామని చెప్పారు. అయితే గడువుకు కొద్దిసేపటి ముందు మాత్రమే ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు హైదరాబాద్ జిల్లా నాయకుడొకరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా చివరి రోజు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్దనే అభ్యర్థులకు బీ ఫారాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.