breaking news
BC residential school
-
కలెక్టర్ సీరియస్
సాక్షి, పోడూరు(పశ్చిమ గోదావరి) : కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మంగళవారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో సిబ్బంది హడలెత్తిపోయారు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ సమయంలో స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయిన కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్(ఏబీసీడబ్ల్యూఓ)ను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్టేరు సమీపంలో ఉన్న నెగ్గిపూడి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ను నాలుగునెలల కిందటే ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి స్కూలు ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 12వ తేదీ నుంచే స్కూళ్లు తెరిచినా ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ పొందకపోవడంతో తరగతులు నిర్వహించడంలేదు. 11 హాస్టళ్ల నుంచి దాదాపు 219 మంది విద్యార్థులు నెగ్గిపూడిలోని రెసిడెన్షియల్ స్కూల్లో చేరాల్సి ఉంది. ఇంతవరకు ఒక్కరూ చేరలేదు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో ఆయన రికార్డులను పరిశీలించడంతో ఈ వైఫల్యాలన్నీ వెలుగుచూశాయి. ఎస్సీ బాలికల హాస్టల్ పరిశీలన కలెక్టర్ రేవు ముత్యాలరాజు మంగళవారం మద్యాహ్నం తణుకు పట్టణంలో అకస్మికంగా పర్యటించారు. మంగళవారం తణుకులోని ఇరగవరం కాలనీలో గల ఎస్సీ బాలికల హాస్టల్ను కలెక్టర్ ముత్యాలరాజు అకస్మికంగా తనిఖీ చేశారు. తను పరిశీలిస్తున్న విషయం కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్త పాటించారు. ముందుగా తణుకు మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే తణుకు పట్టణంలో గతంలో సేకరించిన రాజీవ్ స్వగృహ పథకంలో ఉద్యోగుల గృహ వసతి కోసం సేకరించిన 20.8 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఇరగవరం కాలనీలో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అందులో విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ ఎల్ శివకుమార్ ఉన్నారు. -
కొత్త గురుకులాలు రెడీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కోసం కొత్తగా మంజూరు చేసిన 119 గురుకుల పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 19 పాఠశాలలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. 2017–18 విద్యా సంవత్సరంలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించగా.. 2019–20 విద్యా సంవత్సరంలో మరో 119 గురుకుల పాఠశాలలను స్థాపించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) కసరత్తు పూర్తి చేసింది. 119 గురుకుల పాఠశాలలకు అద్దె భవనాలను సిద్ధం చేసి అందులో మౌలిక వసతులను కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. పుస్తకాలు, విద్యార్థుల మెటీరియల్ను ఇప్పటికే పాఠశాలల్లో అందుబాటులో పెట్టింది. దాదాపు అన్ని పాఠశాలల్లో సిబ్బంది సర్దుబాటు సైతం పూర్తయింది. వాస్తవానికి ఈ నెల 12 నుంచి బడులు ప్రారంభమవుతాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొత్త గురుకులాలు మాత్రం 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 28,560 మందికి లబ్ధి.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున 119 గురుకుల పాఠశాలలు వారంరోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కొత్త గురుకులాల్లో 5, 6, 7 తరగతులను ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతి అప్గ్రేడ్ అవుతుంది. కేజీ టూ పీజీ విద్యా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న గురుకుల పాఠశాలలను ఇకపై జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తారు. పదో తరగతి వరకు అప్గ్రేడ్ అయిన వాటిల్లో ఇంటర్మీడియట్ను సైతం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది కొత్తగా 119 గురుకులాల ప్రారంభంతో అదనంగా 28,560 మంది విద్యార్థులకు లబ్ధి కలగనుంది. కొత్త వాటితో కలిపితే రాష్ట్రంలో మొత్తం 257 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో 94,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరో రెండేళ్లలో ఈ విద్యార్థుల సంఖ్య లక్ష దాటనుంది. గురుకులాల్లో జూనియర్ కాలేజీలు సైతం ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుంది. కొత్త గురుకులాల ప్రారంభంతో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ అతి పెద్ద గురుకుల సొసైటీగా అవతరించనుంది. ఇప్పటివరకు 238 గురుకుల పాఠశాలలతో పెద్ద సొసైటీగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)ని రికార్డును బీసీ గురుకుల సొసైటీ అధిగమించనుంది. వచ్చే ఐదేళ్లలో అత్యధిక విద్యార్థులున్న సంస్థగా బీసీ గురుకుల సొసైటీ అవతరించనుంది. -
బీసీ గురుకులాలదే అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈసారి బీసీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 89.8 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రభాగాన నిలిచారు. ఆ తరువాతి స్థానంలో విద్యాశాఖ గురుకులాలు 88.8 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్ కాలేజీలు మాత్రం 50.1 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. తెలంగాణ ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎప్పటిలాగే బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. తగ్గిన ఉత్తీర్ణత శాతం... రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్ విద్యార్థులు 8,70,924 మంది హాజరయ్యారు. అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,653 మంది పరీక్షలకు హాజరవగా 2,70,575 మంది (59.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,18,271 మంది పరీక్షలకు హాజరవగా వారిలో 2,71,949 మంది (65 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్లో బాలికలు 66.2 శాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలురు 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్ రెగ్యులర్ విద్యార్థుల్లో బాలికలు 70.8 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 58.2 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. గతేడాది ద్వితీయ సంవత్సరంలో 67.06 శాతం మంది ఉత్తీర్ణులవగా ఈసారి 65 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 1,18,455 మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా 1,52,120 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 1,18,591 మంది బాలురు ఉత్తీర్ణులుకాగా 1,53,358 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ప్రైవేటు విద్యార్థులు 72,365 మంది పరీక్షలకు హాజరుకాగా 18,365 మంది (25.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మేడ్చల్ టాప్.. మెదక్ లాస్ట్ ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా తొలిస్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం జనరల్లో మేడ్చల్ జిల్లా 76 శాతం ఉత్తీర్ణత సాధించగా 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలించింది. మెదక్ జిల్లా మాత్రం 29 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానానికి పరిమితమైంది. ద్వితీయ సంవత్సరం జనరల్లో మేడ్చల్ జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా 75 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కేవలం 35 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ద్వితీయ సంవత్సరం వొకేషనల్లో 87 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో నిలవగా, కొమురం భీం జిల్లా 83 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. 51 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది. వచ్చే నెల 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 14 నుంచి నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఎన్నికలనుబట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులతోపాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు ఈ నెల 25లోగా ఫీజు చెల్లించాలని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష ఫీజుకు అదనంగా ఒక్కో పేపరుకు రూ. 150 చొప్పున చెల్లించి ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చని పేర్కొన్నారు. రెండింటిలో ఎందులో ఎక్కువ మార్కులుంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ జవాబు పత్రాల కాపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు రీ కౌంటింగ్ కోసం ప్రతి పేపరుకు రూ. 100 చొప్పున చెల్లించాలని, ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే రీ వెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ జవాబు పత్రాల కాపీ కోసం ఒక్కో పేపరుకు రూ. 600 చొప్పున చెల్లించాలని సూచించారు. విద్యార్థులు ఈ నెల 19 నుంచి 25లోగా ఆన్లైన్లో ( ఠీఠీఠీ. bజ్ఛీ. ్ట్ఛl్చnజ్చn్చ. జౌఠి. జీn) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్నవుతా.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను అధ్యాపకుల స్ఫూర్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంపీసీలో 993 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది నా లక్ష్యం. బిట్స్ పిలానీలో సీఎస్సీలో సీటు సంపాదిస్తా. -ఎన్. శశిధర్రెడ్డి, ఎంపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ (993 మార్కులు), అల్పోర్స్ కళాశాల(ద్వితీయ), కరీంనగర్ ఫలితాల తగ్గుదలకు ప్రధాన కారణాలు.. ఇంటర్మీడియెట్ ఫలితాలు గతేడాది కంటే ఈసారి 2 శాతం తగ్గిపోయాయి. గతేడాది ప్రథమ సంవత్సరంలో 62.73 శాతం మంది ఉత్తీర్ణులుకాగా ఈసారి 60.5 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. అలాగే గతేడాది ద్వితీయ సంవత్సరం 67.06 శాతం మంది ఉత్తీర్ణులుకాగా ఈసారి 65 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో గత రెండేళ్లతో పోల్చుకున్నా ఈసారి ఫలితాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరం జూన్లో పూర్తి కావాల్సిన మొదటి దశ ప్రవేశాలు ఆగస్టు చివరి వరకు కొనసాగడం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూన్లో తరగతులు ప్రారంభమైనా 1,200 మంది గెస్ట్ ఫ్యాకల్టీని ఆగస్టులో నియమించడం. జూన్, జూలైలలో అధ్యాపకుల బదిలీలతో పాఠ్యాంశాల బోధనకు ఆటంకం ఏర్పడటం. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వల్ల పాఠ్యాంశాల బోధన సకాలంలో పూర్తికాకపోవడం. ఎంపీసీలో 993.. బైపీసీలో 992.. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో టాప్ మార్కులివే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి అత్యధిక మార్కులు 993. ఈ మార్కులను ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఒకే ఒక్క విద్యార్థి నల్ల శశిధర్రెడ్డి సాధించగా ఆ తరువాత 992 మార్కులను బి. ఉమామహేశ్వర్రెడ్డి, ఎస్. దినేశ్రెడ్డి సాధించారు. బైపీసీలో 992 మార్కులతో చల్లా దీపికారెడ్డి టాపర్గా నిలవగా ఆ తరువాత 991 మార్కులతో బింగి సాయితేజ రెండో ర్యాంకు సాధించాడు. ఎంఈసీలో 987 మార్కులతో వి. వంశీ తొలి ర్యాంకు సాధించగా ఆ తరువాత 985 మార్కులతో డి. వైష్ణవి రెండో ర్యాంకు సాధించింది. హెచ్ఈసీలో అత్యధిక మార్కులు 964 పీఎస్ఎన్ సౌగంధికకు లభించాయి. సీఈసీలో అత్యధిక మార్కులు 979 దివాన్ శివానీకి లభించాయి. చల్లా దీపికారెడ్డి, నల్ల శశిధర్రెడ్డి ప్రథమ సంవత్సరంలో.. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో నలుగురికి అత్యధికంగా 467 మార్కులు లభించగా 33 మందికి 466 మార్కులు వచ్చాయి. బైపీసీలో ముగ్గురికి అత్యధికంగా 437 మార్కులు లభించాయి. ఎంఈసీలో ముగ్గురికి అత్యధికంగా 494 మార్కులు రాగా హెచ్ఈసీలో ఒక్కరికే అత్యధికంగా 486 మార్కులు లభించాయి. సీఈసీలో ఇద్దరికి అత్యధికంగా 492 మార్కులు లభించాయి. పరీక్షకు హాజరైనా ఆబ్సెంట్? ఇంటర్ పరీక్షల ప్రాసెసింగ్లో లోపాలు తలెత్తినట్లు తెలిసింది. సాఫ్ట్వేర్ సమస్యలతో వందలాది మంది విద్యార్థులకు తప్పుల తడకగా మార్కులు వచ్చాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షలకు హాజరైనా పలువురు విద్యార్థులను ఆబ్సెంట్ అయినట్లు చూపించి ఫెయిల్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని ఓ కార్పొరేట్ కాలేజీకి చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఫలితాల్లో ఫెయిల్ చేసినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఒక్క సబ్జెక్ట్ మినహా అన్ని సబ్జెక్టుల్లో 831 మార్కులు వచ్చిన ఒక విద్యార్థి ఇంగ్లీష్ పేపర్–2 పరీక్షకు హాజరుకానట్లుగా మెమోల్లో ఆబ్సెంట్ వచ్చింది. అయితే ఆ విద్యార్థి పరీక్షకు హాజరయ్యారని సదరు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. 810 మార్కులు వచ్చిన మరో విద్యార్థికి మాథ్స్ పేపర్–2బీలో 17 మార్కులే వచ్చినట్లు చూపించారని, బాగా చదివే ఆ విద్యార్థికి అంత తక్కువ మార్కులు వచ్చే అవకాశమే లేదని చెప్పారు. 841 మార్కులు వచ్చిన మరో విద్యార్థిని సంస్కృతం పేపర్–2లో ఆబ్సెంట్గా చూపించి ఫెయిల్ చేశారన్నారు. మరోవైపు వందల మంది విద్యార్థులకు ఫలితాలే ఇవ్వలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. అనేక మంది విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్తో ఫలితాలు చూసుకోగా ఇన్వ్యాలిడ్ హాల్ టికెట్ నంబర్ అని వస్తోందని, దీంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సామర్థ్యంలేని సాఫ్ట్వెర్ సంస్థకు ఫలితాల ప్రాసెస్ పనులను అప్పగించడం వల్లే ఇలాంటి తప్పిదాలు దొర్లాయని అధ్యాపకులు పేర్కొంటున్నారు. సమస్యలపై మొదటి నుంచీ మొత్తుకుంటున్నా బోర్డు అధికారులు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని అధ్యాపకులు మండిపడుతున్నారు మేడ్చల్లోని సదరు కార్పొరేటు కాలేజీ యాజమాన్యానికి బోర్డు ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు విద్యార్థులను కూడా బయటకు రాకుండా కాలేజీ క్యాంపస్ గదుల్లోనే పెట్టినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
'రూ.100 కోట్లతో ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్'
హైదరాబాద్: రూ. 100 కోట్లతో ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బీసీ విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. గురువారం హైదరాబాద్లో బీసీ సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా కొత్తగా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పథకాల ద్వారా బీసీల్లో అన్ని కులాల వారు లబ్ధి పొందేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.