breaking news
Bachupalli Police Station
-
సహజీవనం చేస్తూ ‘రిచ్’గా బిల్డప్.. పక్కాగా చీటింగ్
సాక్షి, నిజాంపేట: సహజీవనం చేస్తున్న ఆ జంట భారీ స్కెచ్ వేసింది. తమకు పరిచయమైన మైనింగ్ వ్యాపారిని పక్కా ప్లాన్తో నిండా ముంచింది. తాను మోసపోయినట్లు గుర్తించిన మైనింగ్ వ్యాపారి తన డబ్బు కోసం ఒత్తిడి చేశాడు. దీంతో సూత్రధారి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు బుధవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... కడప జిల్లాకు చెందిన ఉద్దనం శిరీష అలియాస్ స్మృతి సిన్హాకు పద్నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే రాజంపేట వాసితో బాల్య వివాహమైంది. పదేళ్ల క్రితం భర్త నుంచి వేరుపడ్డ స్మృతి తన ఇద్దరు పిల్లలతో హైదరాబాద్కు చేరింది. హీరోయిన్గా సినిమాల్లో నటించాలనే ఆశతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో శిక్షణ తీసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో ఆరేళ్ల క్రితం బోరబండలో సూపర్ మార్కెట్ ప్రారంభించింది. ఇందులో కంప్యూటర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసేందుకు తరచూ వచ్చే విజయ్కుమార్ రెడ్డితో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆపై వీరిద్దరూ సహజీవనం చేస్తూ చిన్న చిన్న మోసాలకు పాల్పడ్డారు. రాఘవరెడ్డి, రామకృష్ణారెడ్డి లగ్జరీ కార్లు... రిచ్ లైఫ్స్టైల్ వీరిద్దరూ 2018 డిసెంబర్లో బాచుపల్లిలోని ప్రణవ్ ఆంటిలియా గేటెడ్ కమ్యూనిటీలోకి తమ మకాం మార్చారు. అందులోని 268 నెంబర్ విల్లాలో ఉండే మైనింగ్ వ్యాపారి పి.వీరారెడ్డితో వాలీబాల్ ఆట నేపథ్యంలో వీరికి పరిచయమైంది. అప్పట్లో తానో ట్రైనీ ఐపీఎస్ అంటూ విజయ్ పరిచయం చేసుకున్నాడు. స్మృతి తన భార్య అని, ఆమె అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్లో సౌత్ ఇండియా ఛైర్ పర్సన్ అని చెప్పాడు. ఆధారంగా కొన్ని కార్డులు కూడా చూపించాడు. వీరిద్దరూ విలాసవంతమైన జీవితం గడపటం, లగ్జరీ కార్లతో తిరగడటంతో వీరారెడ్డి తేలిగ్గా నమ్మేశారు. వీరారెడ్డిని నిండా ముంచాలని పథకం వేసిన విజయ్ తన కుటుంబీకులు, బంధువులను రంగంలోకి దింపాడు. వాళ్లు ఇతనికి వంత పాడారు. విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్న తన తండ్రి, సీఐఎస్ఎఫ్ ఏఎస్సై రాఘవరెడ్డిని కేంద్ర బలగాల్లో డీసీపీగా పని చేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఒకే ప్రాంతం, సామాజికవర్గం కావడంతో పాటు తాము దూరపు బంధువులమని వీరారెడ్డితో పదేపదే చెప్పిన విజయ్ మరింత దగ్గరయ్యాడు. తనకు 72 వోల్వో బస్సులున్నాయని, పార్కింగ్ కోసం బాచుపల్లిలోనే 32 ఏకరాల భూమి కొన్నానని నమ్మబలికాడు. వాటి నిర్వహణ, మరమ్మతులు, ఇతర అవసరాల పేరు చెప్పి వీరారెడ్డి నుంచి దఫదఫాలుగా రూ.11.37 కోట్లు తీసుకున్నాడు. ఇందులో రూ.5.37 కోట్లు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకోగా... మిగిలింది నగదు రూపంలో తీసుకున్నాడు. ఈ డబ్బును నేరుగా తన ఖాతాల్లోకి కాకుండా సోదరుడు అభిలాష్ రెడ్డి, బంధువులు రామకృష్టారెడ్డి, రణధీర్ రెడ్డి బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయించి వారి ద్వారా తన ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. మీడియాకు నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వర్లు పెళ్లి పేరిట... మరో వల ఓ సందర్భంలో వీరారెడ్డి తన బావమరిదికి సంబంధాలు చూడమని విజయ్తో చెప్పారు. ఆ వెంటనే విజయ్ తనకు సోదరి వరుసయ్యే ప్రవల్లిక సిద్ధంగా ఉందని చెప్పి సోషల్మీడియా నుంచి సేకరించిన ఓ అందమైన యువతి ఫొటోను చూపించాడు. ప్రవల్లిక పేరుతో కొత్త ఫోన్ నంబర్తో స్మృతియే వీరారెడ్డి బావమరిదితో కవ్వింపుగా మాట్లాడుతూ మాయ చేసింది. వీరి ఒల్లో పడిపోయిన వీరారెడ్డి భార్య కుటుంబం ప్రవల్లికను తమ కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా స్మృతి పుట్టిన రోజు కోసం విజయ్ భారీ మొత్తమే ఖర్చు చేశాడు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో ఆమె ఇద్దరు పిల్లలతో సహా ఈ ఏడాది 40 రోజులు గడిపాడు. రోజుకు రూ.లక్ష చొప్పున హోటల్ వారికి చెల్లించాడు. తనకు ఉన్న ఐదు లగ్జరీ కార్లనూ రోజుమార్చి రోజు వాడుతూ ఉండేవాడు. డెహ్రాడూన్లో శిక్షణలో ఉన్నానని మార్ఫింగ్ ఫొటోలు కాగా, కొంతకాలంగా తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ విజయ్కుమార్రెడ్డిని వీరారెడ్డి ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల చివరి వారం లో ఫోన్ చేసి గట్టిగా అడగ్గా... తాను డెహ్రాడూన్లో ఐపీఎస్ శిక్షణలో ఉన్నానంటూ విజయ్ తప్పించుకున్నాడు. దీనికి ఆధారంగా అంటూ కొన్ని ఫొటోలనూ షేర్ చేశాడు. అనుమానం వచ్చిన వీరారెడ్డి వాట్సాప్ ద్వారా లైవ్ లోకేషన్ పంపాలని కోరగా, అతడు పంపలేదు. దీంతో అనుమానం వచ్చి అప్పటికే పంపిన ఫొటోలను పరిశీలించి అవి మార్ఫింగ్ చేసినవిగా గుర్తించాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న వీరారెడ్డి.. విజయ్ నగరంలో ఉన్నాడనే సమాచారం తెలుసుకున్నాడు. వీరారెడ్డి నుంచి విజయ్కు ఒత్తిడి పెరగడంతో.. మిమ్మల్ని మోసం చేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని విజయ్ ఈనెల 5న వాట్సాప్లో ఓ సందేశం పంపాడు. ప్రగతినగర్లో తన కుటుంబం నివసించే ఇంట్లో ఉరేసుకున్నాడు. దాంతో వీరారెడ్డి ఈ నెల 12న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు, ఇన్స్పెక్టర్ నర్సింహ్మారెడ్డి, ఎస్ఐ సతీష్కుమార్ దర్యాప్తు చేశారు. బుధవారం స్మృతితో పాటు రాఘవరెడ్డి, రామకృష్ణారెడ్డి, రణధీర్రెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి పదుల సంఖ్యలో గుర్తింపు కార్డులు, పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులు, రూ.50 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు, రూ.2 లక్షల నగదు, సెల్ఫోన్లతో పాటు 3 బీఎండబ్ల్యూ, 2 ఫోర్డు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పలు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు సీజ్ చేశారు. -
పెళ్లి పేరుతో రూ.11కోట్లకు నకిలీ ఐపీఎస్ మోసం
సాక్షి, హైదరాబాద్: తాను ఐపీఎస్ అధికారిని చెప్పి.. మా చెల్లితో పెళ్లి చేయిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.11 కోట్లు వసూలు చేసిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి నుంచి ఆమె తీసుకున్న ఖరీదైన కార్లు, కోట్ల విలువైన ఆస్తుల వివరాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఈ మోసాలు తన బంధువుతో కలిసి ఆమె చేసింది. ఆమెను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. శ్రుతిసిన్హా అనే యువతి ఐపీఎస్ అధికారిణిగా చలామణీ అవుతోంది. ఈ క్రమంలో వీరారెడ్డి అనే వ్యక్తిని కలిసింది. అతడి సోదరుడికి తన చెల్లిని ఇచ్చి వివాహం చేస్తానని శ్రుతిసిన్హా నమ్మించింది. ఈ క్రమంలో అతడి వద్ద నుంచి రూ.11 కోట్ల వరకు వసూలు చేసింది. ఆమె తన బంధువు విజయ్కుమార్ రెడ్డితో కలిసి మోసానికి పాల్పడింది. అయితే నెల రోజుల కిందట విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వ్యవహారం బయటకు పొక్కింది. వీరారెడ్డితో వసూలు చేసిన డబ్బుతో ఖరీదైన కార్లను శ్రుతి కొనుగోలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు శ్రుతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితురాలి నుంచి 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె బారినపడి మోసానికి గురయిన వాళ్లు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. -
సాయం చేస్తున్నట్లు నటించి.. లైంగిక దాడి
జీడిమెట్ల : అర్ధరాత్రి ఆపదలో ఉన్న ఓ యువతికి సహాయం చేసినట్లు నటిస్తూ ఆమెపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బాలకృష్ణారెడ్డి కథనం ప్రకారం.. ప్రగతినగర్కు చెందిన యువతి(20) అనారోగ్యంతో ఉన్న తన తల్లికి మందులు తీసుకెళ్లేందుకు సోమవారం తెల్లవారుజామున స్థానిక జగన్ స్టూడియో వద్ద నిలుచుని ఉంది. అదే సమయంలో అటువైపు వెళుతున్న భౌరంపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎస్.పరశురామ్ ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశాడు. మెడికల్ షాపునకు తీసుకు వెళ్లాలని కోరడంతో ఆమెను ఆటోలో ఎక్కించుకున్న పరశురామ్ సదరు మహిళను నైన్ స్టార్ హోటల్ వెనకకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు తనకు మంచినీళ్లు కావాలని అడుగగా అదే ఆటోలో బాచుపల్లిలోని ఓ టీస్టాల్ వద్దకు తీసుకువచ్చాడు. అదే సమయంలో అటువైపు వెళుతున్న పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తించిన బాధితురాలు కేకలు వేయడంతో గమనించిన పోలీసులు ఆటోను చేజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
యాజమాన్యమే బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ హైదరాబాద్: రాజధానిలోని ప్రగతినగర్ నారాయణ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పంటకుదురుకు చెందిన వంశీధర్ కుమారుడు నాగసాయి.. ప్రగతినగర్ నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం హాస్టల్లో నాగసాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే నాగసాయి మృతి విషయం తెలుసుకున్న అతని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్దకు చేరుకుని, ఈ ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కళాశాల నిర్వాహకుల ఒత్తిడి మూలంగానే నాగసాయి మృతి చెందాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా, నారాయణ కళాశాలల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. నారాయణ విద్యాసంస్థల చైర్మన్, ఏపీ మంత్రి నారాయణ దిష్టిబొమ్మను బర్కత్పుర చౌరస్తాలో దగ్ధం చేశారు. గత 15 రోజుల నుంచి నారాయణ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.