breaking news
Bachelor of arts
-
త్వరలో బీఏ ఆనర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న బ్యాచ్లర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) కోర్సును ఆధునీకరించబోతున్నారు. కొత్తగా బీఏ ఆనర్స్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వీలైతే ఈ ఏడాది నుంచే దీన్ని అమల్లోకి తెస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. కోర్సు స్వరూప, స్వభావాలపై త్వరలో విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో చర్చించబోతున్నట్టు చెప్పారు. అన్ని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులోకి తేవాలని అధికారులు యోచిస్తున్నారు. బీఏ ఆనర్స్ కోసం రాష్ట్ర విద్యార్థులు ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తున్నారు. తెలంగాణలోనూ ఆనర్స్ ఉండాలన్న ఒత్తిడి పెరగడంతో విద్యాశాఖ దీనిపై దృష్టి పెట్టింది. ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల నేపథ్యంలో బీఏ కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. సాంకేతికతను జోడించడం, ఇంజనీరింగ్ తరహాలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సు సమయంలోనే తర్ఫీదు ఇవ్వడం చేస్తున్నారు. దీనికోసం ఉన్నత విద్యామండలి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలతో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. కొత్తగా ఆనర్స్ కోర్సును అందుబాటులోకి తేవడం మరో మార్పుగా అధికారులు చెబుతున్నారు. బీఏ కోర్సు కాలపరిమితి ప్రస్తుతం మూడేళ్లు ఉండగా.. ఆనర్స్ జోడించడం వల్ల నాలుగేళ్లకు మారుతుంది. సబ్జెక్టులను మరింత లోతుగా, అధ్యయనానికి వీలుగా రూపొందించబోతున్నారు. దీనివల్ల డిగ్రీ దశలోనూ విద్యార్థిలో పరిపూర్ణత పెరుగుతుందని వర్సిటీల ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఆనర్స్ పూర్తి చేసిన తర్వాత పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సు కాలపరిమితి రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గుతుంది. ఈ కోర్సుకు సంబంధించిన ప్రతిపాదనలు 2020లోనే రూపొందించారు. కోవిడ్ కారణంగా ఇది ముందుకెళ్లలేదు. ఇప్పుడు దీన్ని వేగవంతం చేయబోతున్నారు. భవిష్యత్లో అన్ని చోట్లా ఆనర్స్ విధిగా ఉండే వీలుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సభ్యుడు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఇది ఆహ్వానించదగ్గ కోర్సు అని చెప్పారు. -
హ్యుమానిటీస్తో వైవిధ్యమైన కొలువులెన్నో..
నగరంలో గత నెలలో వివిధ కళాశాలల్లో జరిగిన అడ్మిషన్లలో ఎక్కువ మంది విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(బీఏ) కోర్సులో చేరడానికే మొగ్గుచూపారు. వీరిలో ఎంపీసీ/బైపీసీ కోర్సులు అభ్యసించినవారూ ఉండటం గమనార్హం. గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే పోస్ట్గ్రాడ్యుయేషన్కు డిమాండ్ పెరిగింది. హ్యుమానిటీస్ కోర్సులు చదివినవారికి కార్పొరేట్ కంపెనీలు ప్రాధాన్యత ఇస్తుండడమే ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల్లో సోషల్ సెన్సైస్కు ఉన్న డిమాండ్ తో ఈ కోర్సులను ఎంచుకుంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో హ్యుమానిటీస్ కోర్సులను అందించే విద్యా సంస్థలు, అర్హతలు, ప్రవేశ విధానం, ఉద్యోగావకాశాలపై ఫోకస్.. నిన్నమొన్నటివరకు క్రేజీ కోర్సులంటే.. ఇంజనీరింగ్.. మెడిసిన్. ఈ రెండూ కాకుంటే బీఎస్సీ. విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులు కూడా వీటివైపే మొగ్గుచూపేవారు. బీఏ కోర్సులకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. పరిస్థితుల్లో ఇప్పడిప్పుడే మార్పు వస్తోంది. టెక్నికల్, మెడిసిన్ సంబంధిత కోర్సులకు దీటుగా హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్ కూ ఆదరణ పెరుగుతోంది. ఇక సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లోనూ డిగ్రీలో ఏ విభాగాల విద్యార్థులైనా సోషల్ సెన్సైస్ సబ్జెక్టులను ఆప్షనల్స్గా ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2లు సోషల్ సెన్సైస్ చదివినవారికి అనుకూలంగా ఉంటాయి. సిలబస్లో ఎక్కువశాతం వీటికి సంబంధించినదే. సోషల్ సెన్సైస్.. పాపులర్ కోర్సులు హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్లో ఎన్నో పాపులర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నవాటితోపాటు కొత్త స్పెషలై జేషన్లు/సబ్జెక్టులను యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్నాయి. దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులు, కంపెనీలు, కార్పొరేట్ల అవసరాలకు తగిన కోర్సులను ఆఫర్ చేయడంలో ముం దుంటున్నాయి. బీఏ/ఎంఏలో జాగ్రఫీ, హిస్టరీ, యా నిసెంట్ ఇండియన్ హిస్టరీ- కల్చర్ అండ్ ఆర్కియాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, ఎడ్యుకేషన్, ఉమెన్స్ స్టడీస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటి కోర్సులు చదివిన వారికి నేడు వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో కొలువులు ప్రభుత్వ విభాగాల్లో సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ కోర్సులు చదివినవారికి ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. ఏటా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి అత్యున్నత అధికారులుగా రాణించొచ్చు. ఈ పరీక్షల్లో సైన్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఎక్కువమంది ఆప్షనల్గా జాగ్రఫీ/సోషియాలజీ/తెలుగు సాహిత్యం/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/హిస్టరీ వంటి సబ్జెక్టులను ఎంచుకుని పరీక్ష రాస్తున్నారు. చిన్నతనం నుంచే సివిల్ సర్వీసెస్ను లక్ష్యంగా నిర్దేశించుకున్నవారు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో చేరుతున్నారు. గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలు రాసి డిప్యూటీ కలెక్టర్(ఆర్డీవో), డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ వంటి ఉద్యోగాలను దక్కించుకోవచ్చు. బీఈడీ కూడా పూర్తిచేస్తే డీఎస్సీ రాసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేయొచ్చు. సంబంధిత సబ్జెక్టులో పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తే.. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభు త్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్గా విధులు నిర్వర్తించవచ్చు. బ్యాంకు పరీక్షలు కూడా రాసుకోవచ్చు. సీఎస్ఆర్తో విస్తృత అవకాశాలు సోషల్వర్క్/రూరల్ డెవలప్మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ స్వచ్ఛంద సంస్థల్లో, గ్రామీణాభివృద్ధి సంస్థల్లో ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద కంపెనీలు కొంత మొత్తాన్ని సామాజిక, ప్రజోపయోగ కార్యక్రమాలకు ఖర్చు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఆయా కంపెనీలు ప్రత్యేకంగా సీఎస్ఆర్ విభాగాలను ఏర్పాటు చేశాయి. వీటిని పర్యవేక్షించడానికి సోషల్ వర్క్ కోర్సులను చేసినవారిని నియమించుకుంటున్నాయి. ఇందుకోసం భారీ వేతనాలు చెల్లిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్ కోర్సులు చేసినవారికి ఉద్యోగాలు కోకొల్లలు. ఆర్కియాలజిస్టులు తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన కళాఖండాలను, ఆయుధాలు వస్తువులను భద్రపరిచే నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆయా వస్తువులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శనశాలలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరిత్రకారులు, ఆర్కియాలజిస్టుల అవసరం ఎంతో ఉంది. ఇప్పుడున్న కట్టడాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నిర్మాణాలు దెబ్బతినకుండా వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇలా చరిత్రకు సంబంధించి వివిధ విభాగాల్లో ఆర్కియాలజిస్టు లుగా అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నిపుణులు దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు, విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం, కొత్త కంపెనీల ఏర్పాటుతో ఆర్థిక శాస్త్రం చదివిన వారికి అవకాశాలు పెరిగాయి. ఆర్థిక శాస్త్రం ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూపీఎస్సీ ద్వారా ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్)ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ విభాగంలోని వివిధ శాఖల్లో ఆర్థికాధికారుల భర్తీకి ప్రతి ఏటా ఐఈఎస్ పరీక్షను నిర్వహిస్తున్నారు. లైబ్రరీ సైన్స్, జర్నలిజం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసినవారికి వివిధ ప్రభుత్వ గ్రంథాలయాల్లో, కళాశాలలు, యూనివర్సిటీల లైబ్రరీలు, పత్రికల్లో అవకాశాలుంటాయి. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ కోర్సులు పూర్తిచేసినవారు.. వివిధ పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ చానళ్లు, సినీ రంగం, ప్రభుత్వ విభాగాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించవచ్చు. ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ, ప్రజా సంబంధాల కార్యాలయాల్లో పబ్లిక్ రిలేషన్స్, సమాచార శాఖాధికారులుగా పనిచేయొచ్చు. ముందునుంచే కెరీర్ ప్రణాళిక విద్యార్థులు కోర్సుల్లో చేరడానికి ముందుగానే తాము ఎలాంటి కెరీర్లో స్థిరపడాలనుకుంటున్నారో ఒక నిర్ణయానికి రావాలి. ఆ కెరీర్కు రాబోయే ఐదు/పదేళ్లలో ఎలాంటి అవకాశాలుంటాయో కూడా తెలుసుకోవాలి. ఇందుకనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే విలువైన సమయం/డబ్బు వృథా అవుతాయని అంటున్నారు. విజయవంతమైన కెరీర్ను అందుకోవా లంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి. వీటి కోసం ముందునుంచీ సిద్ధం కావాలని చెబుతున్నారు. అవసరమైన స్కిల్స్: విస్తృత అధ్యయనం సమాచార సేకరణ, పరిశోధన నైపుణ్యాలు క్రిటికల్, లాజికల్ థింకింగ్ వర్తమానాంశాలపై పట్టు నెట్, సెట్తో.. రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) రాసి డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పరీక్షలకు అర్హత సాధించొచ్చు. జాతీయస్థాయిలో యూజీసీ ఏటా రెండుసార్లు నిర్వహించే నేషనల్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) రాసి.. జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రస్థాయి యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అవకాశాలందుకోవచ్చు. నెట్ ద్వారా జేఆర్ఎఫ్కు ఎంపికైతే ప్రతినెలా ఫెలోషిప్ పొందుతూ.. పీహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంది. కోర్సులను అందిస్తున్న సంస్థలు ఐఐటీ - మద్రాస్ వెబ్సైట్: http://hsee.iitm.ac.in/. ఐఐటీ-ఖరగ్పూర్. వెబ్సైట్: www.iitkgp.ac.in/ ఐఐటీ-ఢిల్లీ. వెబ్సైట్: www.iitd.ac.in ఐఐటీ-కాన్పూర్. వెబ్సైట్: www.iitk.ac.in ఐఐటీ- బాంబే. వెబ్సైట్: www.iitb.ac.in హైదరాబాద్లో.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం - హైదరాబాద్ వెబ్సైట్: http://www.manuu.ac.in/ ఇగ్నో - హైదరాబాద్ వెబ్సైట్: http://rchyderabad.ignou.ac.in/ నిజాం కాలేజ్ వెబ్సైట్: www.nizamcollege.ac.in బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్: www.braou.ac.in టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ వెబ్సైట్: http://campus.tiss.edu/hyderabad/