breaking news
Autobiographies
-
మా ఆత్మకథ చెబుతాం
ఎవరో రాసిన కథల్లో, ఎవరో సృష్టించిన పాత్రలకు, ఇంకెవరో రాసిన డైలాగులు చెబుతుంటారు యాక్టర్స్. మంచి కథల్ని స్క్రీన్ మీదకు తీసుకొస్తారు. మంచి పాత్రల్ని మర్చిపోకుండా చేస్తారు. కానీ అవేవీ వాళ్లు కాదు. అది కేవలం స్క్రీన్ మీద చేసిన నటనే. స్క్రీన్ వెనక వాళ్లదైన కథ ఒకటుంటుంది. అది చాలామందికి తెలియదు. ఆ కథను చెప్పబోతున్నాం అంటున్నారు కొందరు స్టార్స్. వాళ్ల కథను చెప్పడానికి రెడీ అయిపోయారు. వాళ్ల ఆత్మకథను చెబుతారట. ప్రస్తుతం ఆత్మకథలు రాసుకుంటున్న స్టార్స్ విశేషాలివి. ఇంకా పూర్తవలేదు బాలీవుడ్ సూపర్స్టార్ నుంచి హాలీవుడ్ హీరోయిన్గా ఎదిగారు ప్రియాంకా చోప్రా. హాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ భారతీయ ఖ్యాతిని పెంచుతున్నారు. ఇప్పుడు ప్రియాంక జీవితాన్ని పుస్తకరూపంలో ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారామె. తన జీవిత కథతో ‘అన్ఫినిష్డ్’ (ఇంకా పూర్తవలేదు) పేరుతో ఓ పుస్తకాన్ని రాశారామె. ఇందులో తన బాల్యం, హీరోయిన్గా మారడం, బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి షిఫ్ట్ అయ్యే విశేషాలు అన్నీ చర్చించారట. ఈ పుస్తకం వచ్చే ఏడాది జనవరి 19న విడుదల కానుంది. రక్షకుడిని కాదు లాక్డౌన్ సమయంలో ఎందరో వలస కార్మికుల పాలిట ఆపద్బాంధవుడు అయ్యారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. అందర్నీ సురక్షితంగా తమ ప్రాంతాలకు పంపే బాధ్యతను నవ్వుతూ భుజాన వేసుకున్నారు. లాక్డౌన్ సమయంలో జరిగిన కథను పుస్తకరూపంలో తీసుకొస్తున్నారు సోనూ సూద్. ‘ఐయామ్ నో మెసయ్య’ (నేను రక్షకుడిని కాదు) పేరుతో ఈ పుస్తకం విడుదల కాబోతోంది. ‘ఇలా సహాయం చేసే బాధ్యతను నాకు కలిగించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది నా కథ కాదు.. వలస కార్మికుల కథ కూడా’ అన్నారు సోనూ సూద్. ఈ పుస్తకం డిసెంబర్లో మార్కెట్లోకి వస్తుంది. రాయాలనిపించింది రాస్తున్నా! బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా కూడా తన ఆత్మకథను రాస్తున్నారు. లాక్డౌన్లో అందరూ ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆత్మకథ రాయాలనే ఆలోచన వచ్చిందట ఆమెకు. లాక్డౌన్ సమయాన్ని మొత్తం ఈ పుస్తకం రాస్తూ గడిపారట. ‘మీ జీవితకథను పుస్తకరూపంలో ఎందుకు తీసుకురాకూడదు? అని చాలా మంది అడిగేవారు. నేనంత ఎక్స్ట్రార్డినరీగా ఏమీ చేయలేదే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ వీలు దొరికింది.. రాసేశాను. కొన్ని నెలల్లో నా కథ బయటకు రాబోతోంది. నచ్చితే చదవండి. బోర్ అనిపిస్తే పక్కన పెట్టేయండి’ అని అన్నారు నీనా గుప్తా. ఆమె ఆత్మకథ పేరు ‘సచ్ కహూ తో’ (నిజం చెప్పాలంటే). వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది. గుర్తుగా ఉంటుందని.. ‘జీవితం ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. కొన్ని విషయాల్ని రికార్డ్ చేసుకుంటే ఎప్పుడైనా తిరిగి చూసుకోవడానికి బావుంటుంది. అందుకే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాను’ అంటున్నారు సైఫ్ అలీఖాన్. ఆత్మకథ రాస్తున్నాను అని ఇటీవలే ప్రకటించారు సైఫ్. యాక్టర్గా ఎలా మారారు, ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, తన కుటుంబం.. ఇలా ప్రతి విషయాన్నీ ఈ పుస్తకంలో ప్రస్తావించాలనుకుంటున్నారట. ఈ పుస్తకం వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. -
ఆత్మకథాస్త్రం!
సంపాదకీయం ‘ఆత్మకథలు సాధారణంగా నిజాయితీగానే ఉంటాయి. కానీ, అందులో నిజాలు ఉంటాయని మాత్రం చెప్పలేం’ అంటాడు ఒక రచయిత. బాగా సన్నిహితులైన వ్యక్తులు రాసిన ఆత్మకథలు చదివి ఆయనకు ఆ అభిప్రాయం ఏర్పడివుండొచ్చు. మహాత్మా గాంధీ ఇందుకు భిన్నం. జీవితంలో తనకు ఎదురైన సమస్యలు, వాటిపట్ల తాను అను సరించిన ధోరణులను దాచుకోకుండా వెల్లడించారు. తన కుటుంబం గురించి, తన సంతానం గురించి, వారి పోకడల గురించి కూడా నిర్మొ హమాటంగా, నిష్కల్మషంగా ఆయన రాశారు. వ్యక్తులకు ఇష్టాయిష్టా లుంటాయి. అనుభవాలుంటాయి. అనుభూతులుంటాయి. అందులో చేదువీ, తీపివీ కూడా ఉంటాయి. అయితే, ఆ వ్యక్తి రాజకీయవేత్తగానీ, మరే రంగంలోనైనా మెరిసిపోయే సెలబ్రిటీగానీ అయితే అలాంటివారి అనుభవాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆ గ్రంథాల్లో ఆయా ప్రము ఖులు ఎదుర్కొన్న కష్టాలు, ఎదురుదెబ్బలే కాదు... ఆ క్రమంలో వారికి తారసపడిన వ్యక్తుల గురించి వారికేర్పడివున్న అభిప్రాయాలు తెలుసు కోవాలన్న తహతహ ఉంటుంది. ఇదే సమయంలో ఆ ప్రముఖులతో పేచీ ఏర్పడినవారికి ఎంతో కొంత గుబులు కూడా ఉంటుంది. తన గురించి వారికి గుర్తున్నవేమిటో, అందులో గ్రంథస్తం చేస్తున్నవేమిటో నన్న దిగులు ఏర్పడుతుంది. ఇదంతా సర్వసాధారణం. కనుకనే దౌత్య వేత్తగా, కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా, ప్రత్యేకించి రాజీవ్గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన నట్వర్సింగ్ వెలువరి స్తానన్న గ్రంథం గురించి ఎదురుచూస్తున్నవాళ్లు ఈ దేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటివారిలో సహజంగానే సోనియాగాంధీ కూడా ఉంటారు. సోనియాగాంధీపై గత ఆరేళ్లుగా నట్వర్సింగ్కున్న ఆగ్రహావేశాలు గానీ, అందుకుగల కారణాలుగానీ రాజకీయాల్లో ఆసక్తిగలవారందరికీ తెలుసు. నట్వర్సింగ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ‘చమురుకు ఆహారం’ స్కాంలో ఇరుక్కుని రాజీనామాచేశారు. ఆ తర్వాత ఆయన 2008లో పార్టీనుంచి కూడా తప్పుకు న్నారు. నిజానికి తప్పుకున్నారనడం కంటే ఆయన్ను తప్పించారనడమే సరైంది. కాలం గాయాలు మాన్పుతుందంటారుగానీ... ఆరేళ్ల కాలం గడిచినా నట్వర్ను ఆనాటి అవమానాలు దహిస్తూనే ఉన్నాయని ఆయన ఆత్మ కథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’ గ్రంథంనుంచి పరిమితంగా వెల్లడి చేసిన అంశాలు చదివితే అర్ధమవుతుంది. ఇవన్నీ తెలియబట్టే కాంగ్రెస్ నేతలు, మరీ ముఖ్యంగా సోనియాగాంధీ ఈ ‘బుక్ బాంబు’ గురించి బెరుకుగానే ఉన్నారు. నట్వర్ చెబుతున్నదాన్నిబట్టి చాన్నాళ్ల తర్వాత మొన్నటి మే నెలలో సోనియా తన కుమార్తె ప్రియాంకా వాద్రా వెంట రాగా ఆయన ఇంటికెళ్లారు. తాను ప్రధాని పదవి స్వీకరించకపోవడా నికి సంబంధించిన ఉదంతాన్ని గ్రంథంలో ప్రస్తావించవద్దని సోనియా విజ్ఞప్తిచేశారని, అయితే ‘వాస్తవాలను ఉన్నవి ఉన్నట్టు’గా వెల్లడిం చాలన్న దృఢనిశ్చయంతో అన్ని వివరాలనూ పొందుపరిచానని నట్వర్ చెబుతున్నారు. కానీ, అందుకు ఇంత సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఆయన వివరించలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూలేని విధంగా 44 స్థానాలు మాత్రమే తెచ్చుకుని అట్టడుగుకు పోయిన కాంగ్రెస్ పార్టీకి స్వల్పకాలంలోనే నట్వర్ రూపంలో ఎదురైన మరో చేదు అనుభవమిది. దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవిని అధిష్టించడానికి అవకాశం వచ్చినప్పుడు సోనియాగాంధీ తన అంతరాత్మ చెప్పినట్టే నడుచుకున్నారని, ఆ పదవిని త్యాగం చేశారని ఇన్నాళ్లుగా సాగుతున్న ప్రచారాన్ని నట్వర్ తన గ్రంథంలో తిప్పికొ ట్టారు. తన నానమ్మలా, తన తండ్రిలా తల్లి కూడా దూరమవుతుం దేమోనని రాహుల్గాంధీలో గూడుకట్టుకుని ఉన్న భయమే అందుకు కారణమని చెప్పారు. పార్టీ మొత్తం ఆమె వెనకున్నా, ఆమె స్వయంగా ప్రధాని పదవి చేపట్టడానికి సిద్ధపడినా రాహుల్ మాటే చివరకు నెగ్గిందని చెప్పడమంటే కాంగ్రెస్ వ్యవహారాల్లో ఆయన అప్పటినుంచే క్రియాశీలంగా వ్యవహరించారని తెలియజేయడమే. అంతేకాదు... ఆయనది ఊగిసలాట ధోరణని, దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన ధైర్యసాహసాలు ఆయనలో లేవని చెప్పడమే. ఈ ఉదం తాన్ని విశ్లేషించుకుంటే రాహుల్ నాయకత్వంలో గుజరాత్, యూపీ, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గానీ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఓటముల వెనకున్న కారణాలు సుల భంగానే అర్ధమవుతాయి. ఆత్మకథలో దీనిని ప్రస్తావించవొద్దని సోనియాగాంధీ నట్వర్ను ఎందుకు కోరివుంటారో కూడా అవగతమవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఫైళ్లు సోనియా వద్దకు వెళ్లేవని గతంలో సంజయ బారు చెప్పినట్టుగానే ఇప్పుడు నట్వర్సింగ్ కూడా చెప్పారు. యూపీఏ పదేళ్ల పాలనాకాలంలో సోనియాగాంధీ ఎంత శక్తిమంతంగా వ్యవహరించారో తెలిసినవారికి ఇదేమంత ఆశ్చర్యమని పించదు. సామాన్యుడిని సమస్యలు చుట్టుముడుతున్నా యూపీఏ సర్కారు పట్టనట్టుగా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఇలా రెండు అధికార కేంద్రాలు పనిచేయడమేనని ఆ సమయంలోనే రాజకీయ నిపు ణులు చెప్పివున్నారు. ఈ నిర్ణయరాహిత్యం ఎన్ని అనర్ధాలు తెచ్చిందో అందరికీ తెలుసు. అందువల్లే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణమైన ఓటమిని చవిచూడాల్సివచ్చింది. ఇప్పుడు నట్వర్సింగ్ వెల్లడించిన విషయాల్లో చాలా భాగం ఆనోటా ఈనోటా పాకి దాదా పుగా అందరి ఎరుకలోనికీ వచ్చినవే. ఇక సోనియాగాంధీ రాస్తానని చెబుతున్న గ్రంథం వీటన్నిటినీ ఎలా పూర్వపక్షం చేస్తుందో చూడాలి. అంతకన్నా ముందు... నట్వర్ ఇప్పుడు వెల్లడించిన అంశాలకు అదనంగా ఆత్మకథలో ఇంకేమి ఉన్నాయో ఎదురుచూడాలి.