breaking news
Auto Dealer
-
వాహన విక్రయాలు.. టాప్గేర్
న్యూఢిల్లీ: వాహన రిటైల్ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 13% పెరిగినట్లు ఆటో డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. ఏడాది ఆరంభంలో ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ కొంత మేర తగ్గినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 అమలుతో విక్రయాలు వేగవంతమయ్యాయని ఫాడా తెలిపింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన పండుగల సీజన్లో నవరాత్రి, దీపావళి ఒకే కాలంలో రావడంతో అక్టోబర్లో నెలవారీ రిటైల్ విక్రయాలు 40 లక్షల యూనిట్లను దాటి ఆల్టైమ్ రికార్డు నమోదు చేశాయి. ఈ ఉత్సాహం తరువాతి నెలల్లోనూ కొనసాగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి నెల కూడా రెండంకెల (డబుల్ డిజిట్) వార్షిక వృద్ధి నమోదైంది. దీంతో ఈ వృద్ధి కేవలం పండుగల ప్రభావం మాత్రమే కాకుండా, నిర్మాణాత్మకంగా బలపడినట్లు స్పష్టమైంది. అన్ని విభాగాల్లో కలిపి వాహన రిటైల్ విక్రయాలు 2,61,87,255 (2024–25) నుంచి 13 శాతం వృద్ధితో 2,96,71,064 యూనిట్లకు చేరాయి. జీఎస్టీ 2.0 అమలుతో బూస్ట్: ఫాడా అధ్యక్షుడు భారత ఆటో రిటైల్ రంగం 2025–26 ఆర్థిక సంవత్సరంలో చరిత్రాత్మక ప్రదర్శన కనబర్చిందని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. మొత్తం 2.96 కోట్లకు పైగా వాహనాలు విక్రయంతో ఆటో రంగం కొత్త గరిష్ట స్థాయిని చేరిందన్నారు. ఈ వృద్ధి కేవలం సంఖ్యల పరంగానే కాకుండా, పరిశ్రమ 3కోట్ల మార్క్కు చేరువవుతోందని సూచిస్తోందన్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న మొబిలిటీ అవసరం, మెరుగైన కొనుగోలు సామర్థ్యం, వివిధ ఇంధన సాంకేతికతల విస్తరణ ఈ వృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయని వివరించారు.అయితే, ఏడాది మొత్తం వృద్ధి సమానంగా కొనసాగలేదన్నారు. గత ఏడాది ఇన్వెంటరీ సమస్యలు, ఫైనాన్సింగ్ పరిమితులు, వినియోగదారుల ‘వెయిట్ అండ్ వాచ్’ ధోరణి కారణంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు విక్రయాలు మోస్తరుగా ఉన్నాయని తెలిపారు. అయితే, సెప్టెంబర్లో అమలైన జీఎస్టీ 2.0తో పరిస్థితి మారిందని, చిన్న వాహనాలు, ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గడంతో కొనుగోలు సామర్థ్యం పెరిగి డిమాండ్ ఊపందుకుందని వెల్లడించారు. అప్రమత్తతతో కూడిన ఆశావాద దృక్పథం: ఫాడా పశ్చిమాసియా పరిస్థితుల్లో మార్పులు భారత ఆటో రిటైల్ రంగంపై కీలక ప్రభావం చూపవచ్చని ఫాడా పేర్కొంది. ఇంధన ధరలు, సరఫరా లభ్యత, వినియోగదారుల విశ్వాసం ఆటో రంగం దిశను నిర్ణయించే ప్రధాన అంశాలుగా మారనున్నాయని తెలిపింది. తాజా సర్వే ప్రకారం, 53.2 శాతం డీలర్లు సరఫరా లేదా డిస్పాచ్లో అంతరాయాలను ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. వీరిలో 17.1 శాతం డీలర్లు మూడు వారాలకుపైగా గణనీయమైన జాప్యాలు (కంపెనీల నుంచి డీలర్లకు వాహనాల సరఫరాలో ఆలస్యం) నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రభావం ముఖ్యంగా వాణిజ్య వాహనాల విభాగంలో ఎక్కువగా కనిపించింది. అలాగే ప్యాసింజర్ వాహనాలు (పీవీ), ద్విచక్ర వాహనాల (టూ వీలర్స్) డీలర్లు కూడా కొన్ని మోడళ్లలో ఆలస్యాలు ఉన్నట్లు తెలిపారు. ఇంధన ధరల పెరుగుదల కూడా కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది. సుమారు 36.5 శాతం డీలర్లు పెరుగుతున్న లేదా పెరగవచ్చని భావిస్తున్న ఇంధన ధరలు వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. దీని వల్ల కొనుగోలు నిర్ణయాలు ఆలస్యమవడంతో పాటు, కస్టమర్లు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వైపు మళ్లే అవకాశముందని ఫాడా తెలిపింది. అయితే, ఫైనాన్సింగ్ పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, 72.5 శాతం డీలర్లు రుణ నిబంధనల్లో మార్పులేదని వెల్లడించారు. మొత్తంగా, సమీప కాలంలో జాగ్రత్తతో కూడిన ఆశావాద దృక్పథాన్ని ఫాడా వ్యక్తం చేసింది. ఈవీ రిటైల్ విక్రయాలు @ 24.52 లక్షలుదేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రిటైల్ విక్రయాలు గత (2025–26) ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. మొత్తం 24.52 లక్షల ఈవీలు అమ్ముడైనట్లు ఫాడా తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2024–25)లో విక్రయాలతో పోలిస్తే ఇవి 24.6 శాతం అధికంగా ఉన్నాయి. ప్రతి వాహన విభాగం కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేయడం విశేషం. ‘‘ఎఫ్వై 2026 భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి మైలురాయిగా నిలిచింది. ఇది ఆటోమొబైల్ రంగ విజయం మాత్రమే కాదు, ‘ఎనర్జీ మార్పిడి’లో భారతదేశ నాయకత్వ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. దేశ ఈవీ ప్రయాణం స్థిరమైన వేగంతో దూసుకెళ్తోంది అనేందుకు విక్రయ గణాంకాలు నిదర్శనం’’ అని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్. విఘ్నేశ్వర్ తెలిపారు. ⇒ 2025–26లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు 1,99,923 యూనిట్లు అమ్ముడయ్యాయి. రెండు లక్షల యూనిట్ల లక్ష్యం కొద్దిలో చేజారింది. అయితే ఎఫ్వై25లోని 1,08,873 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 83.63% వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాలు 78,811 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచాయి. తరువాత జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 53,089 యూనిట్లతో రెండో స్థానంలో, మహీంద్రా అండ్ మహీంద్రా 42,721 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ⇒ ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాల విభాగంలో 21.81% వృద్ధితో 14,01,818 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ 3,41,513 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బజాజ్ ఆటో 2,89,349 యూనిట్లతో రెండో స్థానంలో, ఏథర్ ఎనర్జీ 2,39,178 యూనిట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ⇒ ఎలక్ట్రిక్ త్రి చక్ర వాహనాల విక్రయాలు 18.97 % వృద్ధితో 8,30,819 యూనిట్లకు చేరాయి. అలాగే ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన అమ్మకాలు 120.57% పెరిగి 19,454 యూనిట్లుగా నమోదయ్యాయి. -
తగ్గుతున్న ఆటో డీలర్ల ఆదాయం!.. రిపోర్ట్
ఆటోమొబైల్ రంగంలో దేశం దూసుకెళ్తోంది. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటో డీలర్ల ఆదాయ వృద్ధి గణనీయంగా తగ్గుతున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ నివేదికలు చెబుతున్నాయి.గత ఏడాది 14 శాతంగా ఉన్న ఆదాయ వృద్ధి.. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుందని అంచనా. దీనికి కారణం ధరల పెరుగుదల అని తెలుస్తోంది. వాహన విక్రయాలు తగ్గడం వల్ల డీలర్లు డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ వంటివి ప్రకటించారు. దీంతో ఆదాయం కొంత తగ్గుముఖం పట్టింది. ఈ ప్రభావంలో ఎక్కువ భాగం తయారీదారులచే భరించబడినప్పటికీ, ఆటో డీలర్ల లాభదాయకతను కూడా 3 శాతానికి తగ్గిస్తుందని నివేదికలో వెల్లడైంది.పండుగల సీజన్లో అధిక తగ్గింపుల మధ్య విక్రయాలు పుంజుకోవడంతో ద్వితీయార్ధంలో కూడా ఇన్వెంటరీ కాస్త తగ్గుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. క్రిసిల్ రేటింగ్స్.. 110 మంది ఆటో డీలర్ల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదికను వెల్లడించింది.నిజానికి భారతదేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు ఇండియాలో తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో ఫ్యూయెల్ వెహికల్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. -
రిజిస్ట్రేషన్ లేకపోతే..
* వాహనం సర్వీసింగ్ కట్ * ఈమేరకు జిల్లా వాహన డీలర్లకు రవాణాశాఖ లేఖ * బీమా కోల్పోతారంటూ వాహనదారులకు అవగాహన సాక్షి ప్రతినిధి, కర్నూలు: మీ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే ఇక నుంచి మీ బండిని వాహన డీలర్లు సర్వీసు చేయరు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు జిల్లాలోని వాహన డీలర్లందరికీ లేఖలు రాశారు. అనేక మంది వాహనదారులు వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత పర్మినెంటు రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీనిని నిలువరించే యంత్రాంగం ప్రస్తుతానికి ఏదీ అమల్లో లేదు. దీంతో వాహనదారులు శాశ్వత రిజిస్ట్రేషన్ లేకుండానే ఎంచక్కా వాహనాల్లో.... ప్రధానంగా టూ వీలర్, కార్లు, ట్రాక్టర్లల్లో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని కట్టడి చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్ని వాహనాలు పర్మినెంటు రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్నాయనే దానిపై వారు లెక్కలు తీస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకపోతే...బీమా కట్! రిజిస్ట్రేషన్ లేని వాహనంపై ప్రయాణిస్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే బీమా కంపెనీలు సదరు వాహనానికిగానీ... వాహనంపై ప్రయాణించే వారికి కానీ బీమా మొత్తాన్ని అందజేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ప్రమాదం జరిగిన వాహనానికిగానీ, వాహనంపై ప్రయాణిస్తున్న వారికిగానీ ఎటువంటి బీమా మొత్తం అందలేదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వాహనదారులకు కూడా ఉపయోగకరమని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) మీరాప్రసాద్ తెలిపారు. అందుకే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ డీలర్లకు లేఖలు రాసినట్లు ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆదాయానికి అవకాశం ! వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులకు మొదట తాత్కాలిక (టెంపరరీ) రిజిస్ట్రేషన్ (టీఆర్) నంబరును కేటాయిస్తారు. వాస్తవానికి టీఆర్ నంబరు వచ్చిన నెల రోజుల్లోగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకోని పక్షంలో ఎటువంటి జరిమానాలు విధించే అధికారం రవాణాశాఖకు లేదు. దీంతో అనేక మంది పర్మినెంటు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఆదాయాన్ని రవాణాశాఖ తాత్కాలికంగా కోల్పోయినట్టు అవుతోంది. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యతో తప్పకుండా వాహనదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ ఆదాయం కూడా పెరుగుతుందని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద రవాణాశాఖ తాజా నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


