breaking news
ASWO
-
సీనియారిటీ తేలదు.. పదోన్నతి రాదు!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ అభివృద్ధి శాఖలో వసతిగృహ సంక్షేమాధికారి (హెచ్డబ్ల్యూఓ) గ్రేడ్–1 కేటగిరీ అధికారుల పదోన్నతులపై ప్రతిష్టంభన తొలగట్లేదు. అర్హతలున్నప్పటికీ వారిని సహాయ సాంఘిక సంక్షేమాధికారి (ఏఎస్డబ్ల్యూఓ)గా పదోన్నతి ఇవ్వట్లేదు. దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా కనీస పదోన్నతి కల్పించకపోవడంపై ఆయా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అర్హతలున్న పలువురు హెచ్డబ్ల్యూఓలు ఏడాదిన్నరగా పదవీ విరమణ పొందుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమశాఖలన్నింట్లోనూ హెచ్డబ్ల్యూఓ పోస్టుల్లో అందరూ ఏకకాలంలో నియమితులైనప్పటికీ బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లోని అధికారులు జిల్లాస్థాయి అధికారి హోదా పదోన్నతి పొందగా ఎస్సీ అభివృద్ధి శాఖలో మాత్రం అదే కేడర్లో హెచ్డబ్ల్యూఓలుగానే మిగిలిపోయారు.తాజాగా గ్రూప్–2 ఉద్యోగ నియామకాలు పూర్తవగా పలువురు ఏఎస్డబ్ల్యూఓలుగా ఎస్సీ అభివృద్ధి శాఖలో నియమితులై విధుల్లో చేరారు. కానీ ఏళ్లు గడుస్తున్నా సీనియర్ హెచ్డబ్ల్యూఓలకు పదోన్నతులు ఇవ్వకపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లో కొలువుదీరిన వారి కంటే జూనియర్లుగా మిగిలిపోయామంటూ మండిపడుతున్నారు. జాడలేని సీనియారిటీ జాబితా... సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పదోన్నతులు, నేరుగా నియామకాలు (డైరెక్ట్ రిక్రూట్మెంట్) పద్ధతిలో జరుగుతుంది. 30 శాతం ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తే 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ఎస్సీ అభివృద్ధి శాఖలోనూ ఏఎస్డబ్ల్యూఓ పోస్టులను హెచ్డబ్ల్యూఓ (గ్రేడ్–1) అధికారులకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాలి. కానీ దాదాపు రెండు దశాబ్దాలుగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. శాఖాపరమైన పదోన్నతులకు నిర్ణయం తీసుకొనే డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ ఐదేళ్లుగా కనీసం భేటీ కాకపోవడం గమనార్హం. కోర్టు కేసును సాకుగా చూపుతూ పదోన్నతుల ప్రక్రియను కొంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ కేసులో మూడేళ్ల క్రితమే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని ప్రభుత్వం అమలు చేయట్లేదని పలువురు హెచ్డబ్ల్యూఓలు చెబుతున్నారు. పదోన్నతులు కల్పించాలంటే ముందుగా సీనియారిటీ జాబితా రూపొందించాలి. ఇందుకుగాను ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న హెచ్డబ్ల్యూఓ (గ్రేడ్–1) సీనియారిటీ జాబితాను వెల్లడించాలి. కానీ ఈ దిశగా ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనరేట్ చర్యలు చేపట్టట్లేదు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని అధికారులు చెబుతున్నారు. సంబంధిత మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఎస్సీ అభివృద్ధి శాఖ ఇటీవల హడావుడిగా ప్రాథమిక సీనియారిటీ జాబితాను బహిర్గతం చేసింది. దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు... నాలుగు నెలలు గడిచినా నిర్ణయం తీసుకోలేదు. కాగా, సీనియారిటీ జాబితాను జోనల్ స్థాయిలో రూపొందించాల్సి ఉండగా కేవలం జిల్లా స్థాయిలో రూపొందించుకోవాలని పేర్కొనడం ఇప్పుడు హెచ్డబ్ల్యూఓల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. -
వసతి గృహాలకు.. విద్యార్థులు కావలెను
స్థానికంగా ఉండని వార్డెన్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ఒకప్పుడు సాంఘిక సంక్షేమ వసతిగృహా (హాస్టళ్లు) ల్లో చేరాలంటే విద్యార్థులకు సిఫార్సులు అవసరమయ్యేవి.. నేడు వాటిలో చేరడానికి విద్యార్థులెవరూ ముందుకు రావడంలేదు.. ఖాళీలున్నాయి చేర్పించండంటూ వార్డెన్లు వేడుకునే దుస్ధితి దాపురించింది.. చేవెళ్ల : డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ సాంఘిక సంక్షేమాధికారి (ఏఎస్డబ్ల్యూఓ) పరిధిలో 14 ఎస్సీ హాస్టళ్లున్నాయి. వీటిలో సుమారు 40శాతానికిపైగా ఖాళీలున్నాయి. 2015-16 విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు దాటినా ఇంకా పూర్తిగా భర్తీ కాలేదు. మొత్తం 1,400 మంది విద్యార్థులకుగాను కేవలం 991 మంది మాత్రమే ఉన్నారు. 409 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రతి హాస్టల్లో కనీసం వంద మందిని చేర్చుకునే అవకాశముంది. ఇంతవరకు 35 నుంచి 40 శాతం వరకు ఖాళీలున్నాయి. చేవెళ్ల బాలుర హాస్టల్లో 52 మంది విద్యార్థులు, బాలికల హాస్టల్లో 64, ఆలూరు బాలుర హాస్టల్లో 40, పెద్దమంగళారం హాస్టల్లో 29, శంకర్పల్లి బాలుర హాస్టల్లో 102, బాలికల హాస్టల్లో 63, షాబాద్ బాలుర హాస్టల్లో 92, హైతాబాద్ బాలికల హాస్టల్లో 82, దర్గా బాలుర హాస్టల్లో 68, నార్సింగి బాలికల హాస్టల్లో 60, రాజేంద్రనగర్ బాలుర హాస్టల్లో 95 మంది, బాలికల హాస్టల్లో 172, శం షాబాద్ బాలుర హాస్టల్లో 35, బాలికల హాస్టల్లో 37 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. ఎందువల్ల? ఆయా హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం వండుతున్నా నాసిరకమైన కూరగాయలు, నీళ్లచారు వండి వడ్డిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పాఠశాలల నుంచి సాయంత్రం వచ్చినప్పటినుంచి వార్డెన్ దగ్గరుండి పిల్లలను చదివించాలి. చేరిన విద్యార్థుల్లో స్థానికులైతే చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారు. చాలా మంది వార్డెన్లు స్థానికంగా అందుబాటులో ఉండటంలేదు. దీంతో కామాటీలు, వాచ్మెన్లు, పనిమనుషులు విద్యార్థుల పట్ల ఇష్టారాాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ట్యూషన్లు కూడా చెప్పేవారే కరువయ్యారు. వార్డెన్లు ముట్టజెప్పే అమ్యామ్యాలకు ఉన్నతాధికారులు ఆశపడి కనీసం వారం, పదిహేను రోజులకోసారైనా హాస్టళ్లను పర్యవేక్షించిన పాపానపోవడంలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు చేవెళ్లలోని బీసీ హాస్టల్లో ఇటీవల తాగునీటి కొరతతో మధ్యాహ్నం వరకు కూడా విద్యార్థులు ముఖం కడుక్కోకుండా, స్నానం చేయకుండా ఉన్నారంటే నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. విద్యార్థుల సంఖ్యపై కాకిలెక్కలు ఇప్పటికే హాస్టళ్లలో అతితక్కువ సంఖ్యలో విద్యార్థులున్నా ఉన్నవారి విషయంలోనూ కాకిలెక్కలు చెబుతున్నారు. మా హాస్టల్లో ఇంతమంది విద్యార్థులున్నారని రిజిస్టర్లో చూపిస్తున్న వార్డెన్లు ఎప్పుడైనా ఆకస్మికంగా ఎవరైనా అధికారులు వెళితే ఆ సంఖ్య కనిపించని సందర్భాలున్నాయి. ఎక్కడికి వెళ్లారని నిలదీస్తే ఇప్పుడే వెళ్లారనో, స్థానికులైందున ఇళ్లకు వెళ్లారనో అస్పష్ట సమాధానాలు చెబుతున్నారు. ఏ రోజుకారోజు విద్యార్థుల సంఖ్యను బట్టిమెనూ చార్జీలు క్లెయిమ్ చేయాల్సి ఉన్నా రిజిస్టర్లో నమోదైన సంఖ్య ప్రకారమే పేద విద్యార్థుల బిల్లులు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ హాస్టళ్లలో చేరడానికి విద్యార్థులు, చేర్పించడానికి వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపించడంలేదు. ఖాళీలున్నమాట నిజమే చాలా హాస్టళ్లలో ఖాళీలున్నమాట నిజమే.ఆదర్శపాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాల యాలు (కేజీబీవీ) వసతి గృహాలు ఏర్పాటుచేయడంవల్ల సంక్షేమ హాస్టళ్లలో చేరేవారి సంఖ్య ప్రతియేటా తగ్గుతోంది. హాస్టళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నాం. తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. - శ్వేతాప్రియదర్శిని, ఏఎస్డబ్ల్యూఓ


