breaking news
asok
-
టిడిపి ఎమ్మెల్సీ కుమారుడిపై కేసు నమోదు
అనంతపురం: సాక్షి ప్రతినిధులపై దాడికి సంబంధించి టిడిపి ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నేతలు పింఛన్ లబ్ధిదారుల జాబితాను ఇష్టానుసారం తయారు చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను చిత్రీకరించిన సాక్షి ఫొటోగ్రాఫర్, విలేకరిపై నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే.శింగనమల నియోజకవర్గం టీడీపీ నేతలు నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సమావేశమై ఏకపక్షంగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టారు. జాబితాల నుంచి వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీల సానుభూతిపరుల పేర్లను తొలగించారు. ఆ జాబితాను టీడీపీ వారితో నింపుతున్న విషయం బయటకు వచ్చింది. దీంతో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సాక్షి ఫొటోగ్రాఫర్ జి. వీరేష్, విలేకరి సి. రమణారెడ్డి అక్కడకు వెళ్లారు. వారిని చూసి ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్, గార్లదిన్నె మాజీ మండలాధ్యక్షుడు ముంటిమడుగు శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు కేశవరెడ్డి, శింగనమల ఎంపీటీసీ చిదంబరంలు వారి అనుచరులతో మూకుమ్మడిగా దాడి చేశారు. వారిని అసభ్య పదజాలంతో దూషి స్తూ, కొట్టుకుంటూ ఫంక్షన్ హాల్ కింది గదిలో ఉన్న ఎమ్మెల్సీ శమంతకమణి వద్దకు ఈడ్చుకెళ్లారు. ఈలోపు కొందరు ఫొటోగ్రాఫర్ వద్ద ఉన్న కెమెరా లాక్కున్నారు. అందులోని చిత్రాలను తొలగించి కెమెరాను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ నుంచి సాక్షి ప్రతినిధులను ఈడ్చుకుంటూ వెళ్లి గేటు బయటకు నెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి అశోక్పైన, మరో ముగ్గురిపైన పోలీసులు 143,323,506,302 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్, గార్లదిన్నె మాజీ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు కేశవరెడ్డి, శింగనమల ఎంపీటీసీ సభ్యుడు చిదంబరంలపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ శుభకుమార్ తెలిపారు ఇదిలా ఉండగా, సాక్షి ప్రతినిధులపై టిడిపి నేతల దాడికి నిరసనగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ** -
రూ.32.5 లక్షల నగదు స్వాధీనం
తిరుపతి క్రైం, న్యూస్లైన్: ఎయిర్ బైపాస్ రోడ్డులో గురువారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో ఎలాంటి ఆధారాలూ లేని రూ.32.5 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గిరిధర్ తెలిపారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. స్టేషన్లో శుక్రవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల వైపు నుంచి ఎయిర్బైపాస్ రోడ్డులోకి వెళుతున్న ఏపీ 29ఏసీ 5778 నెంబరు ఇండికా కారు ను తనిఖీ చేయగా నగదు దొరికిందని, దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. కారులో ఉన్న మహారాష్ట్రకు చెందిన సూరజ్ భాస్కర్, తొడిగి మహేష్, ఆర్సీపురం మండలం సొరకాయలపాళెంకు చెందిన వెంకటముని, తిరుపతి మిట్టవీధికి చెందిన ఆశోక్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.