ashwith reddy
-
కిడ్నీ వ్యాధిగ్రస్తుడి కోసం ఆటో నడిపిన అఖిల్
ఖమ్మం: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి అశ్విత్రెడ్డిని సినీ హీరో అక్కినేని అఖిల్ పరామర్శించారు. మంచు లక్ష్మి హోస్ట్గా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేట్ టీవీ చానల్ ద్వారా అశ్విత్రెడ్డి దుస్థితిని తెలుసుకున్న అఖిల్ మంగళవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా అశ్విత్రెడ్డి వైద్యానికి అవసరమయ్యే డబ్బు కోసం ఆటో నడిపి కొంత మొత్తం సేకరించారు. నగరంలోని నర్సింహస్వామి దేవాలయం రోడ్డులో ఉంటున్న కట్టూరి కృష్ణారెడ్డి, కవితలకు కుమారుడు అశ్విత్రెడ్డి, కుమార్తె అనుషిత ఉన్నారు. రెండు నెలల క్రితం అశ్విత్ డెంగీ జ్వరం బారినపడటంతో వైద్య పరీక్షలు చేయించారు. ఆ సమయంలో అతనికి రెండు మూత్రపిండాలు పాడైనట్లు వైద్యులు తెలిపారు. వైద్యం కోసం ఆస్తి, బంగారం అమ్మి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు. కిడ్నీ మార్పిడికి రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. అంతమొత్తం వెచ్చించే స్థోమత అశ్విత్రెడ్డి తల్లిదండ్రులకు లేదు. ఈ నేపథ్యంలో టీవీ చానల్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న అఖిల్ ఖమ్మం వచ్చి ఆటో నడిపి డబ్బులు సేకరించి ఇచ్చాడు. -
చిన్నారికి అఖిల్ పరామర్శ
ఖమ్మం: టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించారు. ఖమ్మంకు చెందిన ఆరేళ్ల అశ్విత్ రెడ్డి గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కుమారుడు ఆరోగ్యం మెరుగుపడడం కోసం అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలో అశ్విత్ రెడ్డి హీరో అఖిల్ను కలవాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న అఖిల్ మంగళవారం ఖమ్మంలో చిన్నారిని పరామర్శించారు. కొద్దిసేపు అతనితో కలసి మాట్లాడి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నాడు. అంతకు ముందు అఖిల్ ఖమ్మం నగరంలో సందడి చేశాడు. సరదాగా ఆటో నడిపాడు. ప్రయాణికులు ఇచ్చిన నగదును అఖిల్ అశ్విత్ రెడ్డి కుటుంబానికి అందజేశాడు. దీంతో చిన్నారితో పాటు అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అశ్విత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని అఖిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గతంలో స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, బాలకృష్ణలు అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులను స్వయంగా పరామర్శించిన విషయం తెలిసిందే.