breaking news
ASA
-
టయోటా హైలక్స్ యాడ్ బ్యాన్ చేసిన యూకే - కారణం ఇదే!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న జపనీస్ వాహన తయారీ దిగ్గజం 'టయోటా' (Toyota)కు యూకేలో గట్టి షాక్ తగిలింది. సామాజిక బాధ్యత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు కంపెనీ ప్రకటనను నిషేధిస్తూ ఏఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది. టయోటా హైలక్స్ యాడ్ నిలిపేయడం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? గతంలో ఇలాంటి నిషేధాలు విధించారా? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. యూకే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ASA) పర్యావరణ బాధ్యతారహిత డ్రైవింగ్ను ప్రోత్సహిస్తున్న రెండు టయోటా ప్రకటనలను నిషేధించింది. ఇందులో ఒకటి పోస్టర్, మరొకటి వీడియో. వీడియోలో టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కులు కఠినమైన భూభాగాల్లో న్యావిగేట్ చేస్తున్నాయి. ఇందులో రివర్స్ క్రాసింగ్ కూడా ఉంది. ఆ తరువాత పట్టణ ప్రాంతం గుండా వెళ్లడం చూడవచ్చు. రోడ్డులో వాటికవి విడిపోవడం చూడవచ్చు. ఇవన్నీ వినియోగదారులను కొంత తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని చెబుతున్నారు. పోస్ట్ విషయానికి వస్తే.. ఇందులో తిరగటానికే పుట్టాను అన్నట్లు రాసి ఉంది. అంతే కాకుండా కొండల్లో దిగటం, ఎత్తైన ప్రదేశాల్లో దుమ్ములేపుకుంటూ ప్రయాణించడం వంటివి ఇందులో చూడవచ్చు. ఈ ప్రకటనలు పర్యావరణ హానికరమైన ప్రవర్తనను ఆమోదించాయని, అధిక కార్బన్ ఉత్పత్తులు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ.. ఈ ప్రకటనలను నిషేదించింది. ఈ ప్రకటనలపై అడ్ఫ్రీ సిటీస్ కో-డైరెక్టర్ వెరోనికా విగ్నాల్ మాట్లాడుతూ.. వాహనాలు నదులు, అడవి గడ్డి మైదానాల గుండా వేగంగా డ్రైవింగ్ చేస్తే.. ప్రకృతి దెబ్బతింటుందని చెబుతూ, యూకేలో చాలా వాహనాలు పట్టాన ప్రాంతాలకు పరిమితమయ్యాయి. అలాంటిది ఇలాంటి ప్రకటలను ఎలా చిత్రీకరిస్తారని వాదించింది. ఇదీ చదవండి: లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్ ఈ ప్రకటనను కంపెనీ సమర్థిస్తూ.. వ్యవసాయ, అటవీ ప్రాంత వాసులకు ఇలాంటి కార్లు చాలా ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ, ప్రకటనలో అలాంటి కార్మికులు కనిపించలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ ఫుటేజీని యూకే వెలుపల ఉన్న ప్రైవేట్ భూమిలో చిత్రీకరించినట్లు, పోస్టర్ మాత్రం కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసినట్లు ప్రతినిధి స్పష్టం చేశారు. ఇందులో మళ్ళీ మార్పులు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. -
హెచ్సీయూ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం ఎగురవేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్ను శుక్రవారం నిర్వహించారు. శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 5,300 ఓట్లకు గాను 76 శాతం ఓట్లు పోలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, డీఎస్యూ విద్యార్థి సంఘాల కూటమి ఘన విజయం సాధించింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రజ్వల్ 1,838 ఓట్లు సాధించారు. ఉపాధ్యక్షుడు పృథ్వీసాయికి 1,860 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా క్రిపామారియాజార్జ్, కల్చరల్ సెక్రెటరీగా లిఖిత్కుమార్, జాయింట్ సెక్రెటరీగా కత్తిగణేశ్, స్పోర్ట్స్ సెక్రెటరీగా సీహెచ్ జయరాజ్ ఎన్నికయ్యారు. ఇతర పదవుల్లోనూ ఈ కూటమికి చెందిన వారే ఎన్నిక కావడం విశేషం. -
హెచ్సీయూలో ఎస్ఎఫ్ఐ కూటమి ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం ప్రభావం హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ(హెచ్సీయూ) ఎన్నికల్లో ప్రతిబింబించింది. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) కూటమిలోని సామాజిక న్యాయపోరాట ఐక్యకార్యాచరణ కమిటీ అన్ని పదవులనూ కైవసం చేసుకొని సత్తా చాటుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం 2016-17 విద్యా సంవత్సరానికిగాను బుధవారం జరిగిన హెచ్సీయూ విద్యార్థి సంఘ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలోని జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా హెచ్సీయూ ఎన్నికలు జరిగాయి. మొత్తం 5,000 మంది విద్యార్థులుండగా అందులో 3,800 ఓట్లు పోలయ్యాయి. గురువారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఎస్ఎఫ్ఐ, ట్రైబల్ స్టూడెంట్స్ ఫోరం(టీఎస్ఎఫ్) దళిత్ స్టూడెంట్స్ యూనియన్(డీఎస్యూ), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్)లు ఒకే ప్యానల్గా ఏబీవీపీకి వ్యతిరేకంగా పోటీ చేశాయి. హెచ్సీయూ ప్రెసిడెంట్గా ఎస్ఎఫ్ఐ అభ్యర్థి కుల్దీప్సింగ్ నాగి, ఏబీవీపీ అభ్యర్థి గోపికృష్ణపై 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా టీఎస్ఎఫ్ నుంచి బిక్యాసుందర్ 401 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు, జనరల్ సెక్రటరీగా డీఎస్యూ అభ్యర్థి సుమన్ దామెర 390 ఓట్లతో గెలుపొందారు. సాంస్కృతిక కార్యదర్శిగా బీఎస్ఎఫ్ నుంచి నఖ్రాయ్ దిబ్బరామ, సంయుక్త కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి పిల్లి విజయ్కుమార్, క్రీడల కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉష్ణిస్ దాస్ విజయం సాధించారు. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య ఎన్నికలుగా సాగాయి. చివరకు వామపక్ష, దళిత, గిరిజన విద్యార్థి సంఘాలతో కూడిన సామాజిక న్యాయ ఐక్యకార్యాచరణ పోరాట కమిటీ ఘనవిజయం సాధించింది. లైంగిక వే ధింపుల నిరోధక కమిటీ(కమిటీ ఎగెనైస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) సభ్యులుగా ఎస్ఎఫ్ఐ నుంచి తుషార, ఇండిపెండెంట్ అభ్యర్థి ఫిర్దోసి సోనీ ఎన్నికయ్యారు. అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్(ఏఎస్ఏ) 944 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచింది. -
విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్
-
విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్
• హైకోర్టులో హెచ్సీయూ రిజిస్ట్రార్ కౌంటర్ దాఖలు • భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే కఠిన నిర్ణయం • యూనివర్సిటీ నుంచే పంపేయాలని బోర్డు సిఫారసు చేసింది • అయితే మేం వారి పట్ల ఉదారంగా వ్యవహరించాం • వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సస్పెన్షన్ ఎత్తేశాం • హాస్టళ్లలో ప్రవేశం, ఎన్నికల్లో పోటీకి మాత్రమే సస్పెన్షన్ను వర్తింపజేశాం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లో ఏబీవీపీ నాయకుడు సుశీల్కుమార్పై జరిగిన దాడి వ్యవహారంలో ఐదుగురు పరిశోధక (పీహెచ్డీ) విద్యార్థులను యూనివర్సిటీ నుంచే పంపేయాలని ప్రొక్టోరియల్ బోర్డు సిఫారసు చేసిందని వర్సిటీ రిజిస్ట్రార్(ఇన్చార్జ్) ఎం.సుధాకర్ హైకోర్టుకు నివేదించారు. అయితే వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎంతో ఉదారంగా వ్యవహరించామని, అందులో భాగంగానే పూర్తిస్థాయి సస్పెన్షన్ను రద్దు చేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు, మిగిలిన విద్యార్థులకు గుణపాఠం కావాలన్న ఉద్దేశంతోనే విధిలేని పరిస్థితుల్లోనే ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. యూనివర్సిటీలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసు మేరకే సస్పెన్షన్ను ఎత్తివేశామని కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిదీ యూనివర్సిటీ నిబంధనల మేరకే జరిగిందన్నారు. యూనివర్సిటీ తమపై విధించిన సస్పెన్షన్ను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పీహెచ్డీ విద్యార్థులు దొంత ప్రశాంత్ తదితరులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని హెచ్సీయూ రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. అది స్వచ్ఛంద క్షమాపణ కాదు సుశీల్ కుమార్ తమకు స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పారని పిటిషనర్లు పేర్కొనడంలో వాస్తవం లేదని రిజిస్ట్రార్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ‘‘అంబేద్కర్ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతూ ఎన్ఆర్ఎస్ హాస్టల్లో సుశీల్కుమార్ ఉన్న గదికి 30 మంది వరకు విద్యార్థులు వెళ్లినట్లు 2015 ఆగస్టు 4 రోజు వేకువజామున మాకు సమాచారం వచ్చింది. సుశీల్ను అతని రూం నుంచి సైకిల్ షెడ్ వరకు తీసుకొచ్చి రాతపూర్వక క్షమాపణలు తీసుకున్నారు. గది నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో పిటిషనర్లు అతనిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఒత్తిడిలో సుశీల్కుమార్ క్షమాపణలు చెప్పారు. యూనివర్సిటీ భద్రతా సిబ్బంది తమ వాహనంలో సుశీల్కుమార్ను మెయిన్గేట్ సమీపంలోని సెక్యూరిటీ పోస్ట్ వద్దకు తీసుకొచ్చారు. పిటిషనర్లు, ఇతరులు అక్కడకు వచ్చి ఫేస్బుక్లో తన క్షమాపణలను సుశీల్కుమార్తోనే అప్లోడ్ చేసేలా చేశారు. సుశీల్కుమార్ తన క్షమాపణలను శాంతిపూర్వకంగా, స్వచ్ఛందంగా చెప్పారన్న పిటిషనర్ల వాదనలను ఖండిస్తున్నా. అసలు అంత మంది ఓ విద్యార్థి హాస్టల్ గదికి వెళ్లి, బలవంతంగా బయటకు తీసుకురావడం న్యాయబద్ధం కాదు. అసలు భౌతిక హింసే జరగలేదని అనుకున్నా.. మొత్తం వ్యవహారం ప్రజాస్వామ్యయుతంగా, శాంతిపూర్వకంగా జరిగిందని పిటిషనర్లు చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ ఘోర తప్పిదానికి పిటిషనర్లే కారణం. వారు తమ పాత్రను ఎంత మాత్రం తోసిపుచ్చలేరు’’ అని రిజిస్ట్రార్ వివరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు ‘‘సుశీల్కుమార్ ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యల వల్ల తమకు ఇబ్బంది ఉందని భావిస్తే పిటిషనర్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సింది. అంతే తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు’’ అని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ‘‘ఆ రోజు సుశీల్కుమార్ ఫోన్ చేయడంతో పోలీసులు హాస్టల్కు చేరుకున్నారు. తర్వాత పిటిషనర్లపై అదేరోజు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అటు యూనివర్సిటీని, ఇటు పోలీసులను ఎవరో తప్పుదోవ పట్టించారంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనలో ఎంత మాత్రం వాస్త వం లేదు. ప్రొక్టోరియల్ బోర్డు నిర్వహించిన విచారణలో ఈ మొత్తం ఘటన వెనుక పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు తేలింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు సుశీల్కుమార్ తల్లి, ఇతరుల సమక్షంలో వైస్ ఛాన్స్లర్ను కలిసిన మాట నిజమే. బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరిన మాట కూడా నిజం. ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి చేసిన ఫిర్యాదుకు కౌంట ర్గా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు కూడా ఫిర్యాదు చేసి సుశీల్కుమార్ను సస్పెండ్ చేయాలన్నారు. ఈ రెండు ఫిర్యాదుల ను యూనివర్సిటీలో విద్యార్థుల క్రమశిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ప్రొక్టోరియల్ బోర్డుకు నివేదించాం. పిటిషనర్లకు కూడా నోటీసులు జారీ చేసి బోర్డు ముందు హాజరు కావాలన్నాం. వారి వాంగ్మూలాలు నమోదు చేశాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సుశీల్కుమార్ విచారణకు హాజరు కాలేదు. అయినా బోర్డు విచారణను కొనసాగించి, ఆగస్టు 12న మధ్యంతర నివేదిక ఇచ్చింది. వర్సిటీ వర్గాలకు ఫిర్యాదు చేయకుండా సుశీల్కుమార్ గదికి వెళ్లి గొడవకు దిగిన పిటిషనర్లకు గట్టి హెచ్చరికలు చేయాలని బోర్డు తన నివేదికలో సిఫారసు చేసింది. సుశీల్కుమార్, ఇతర సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసేం దుకు బోర్డు మరోసారి సమావేశమై ఆగస్టు 31న తుది నివేదిక సమర్పించింది. సుశీల్కుమార్పై పిటిషనర్లు భౌతికంగా దాడి చేశారని, అందువల్ల వారిని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 8న పిటిషనర్లను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశాం. ఈ ఘటనలో వారు ఎక్కడా తమ పాత్రను తోసిపుచ్చలేదు. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన వినతి మేరకు సెప్టెంబర్ 11న వారి సస్పెన్షన్ను ఎత్తివేశాం’’ అని రిజిస్ట్రార్ కోర్టుకు తెలిపారు. ఉదారంగా వ్యవహరించాం ‘‘ప్రొక్టోరియల్ బోర్డు నివేదికను వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పరిశీలించి, అందులో చేసిన సిఫారసులతో ఏకీభవించింది. తన నివేదికను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు ఉంచింది. ప్రొక్టోరియల్ బోర్డు, సబ్ కమిటీల నివేదికను పరిశీలించిన కౌన్సిల్ విద్యార్థుల విద్యా, ఆర్థిక పరిస్థితులను దృష్టి పెట్టుకుని వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. యూనివర్సిటీ నుంచి కాకుండా హాస్టళ్లు, పరిపాలన భవనాల్లో ప్రవేశానికి, ఎన్నికల్లో పోటీ చేయకుండా మాత్రమే పిటిషనర్లను అనర్హులుగా చేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది’’ అని రిజిస్ట్రార్ తన కౌంటర్లో వివరించారు. ‘‘పిటిషనర్లలో ఒకరైన వేల్పుల సుంకన్న ఇప్పటికే పీహెచ్డీ థీసిస్ సమర్పించారు. అయితే సస్పెన్షన్ అతని విద్య కొనసాగింపునకు అడ్డంకి కాదు. తరగతులకు, సెమినార్లకు, వర్క్షాపులకు, గ్రంథాలయానికి హాజరు కాకుండా అతన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. విషయపరంగా ఓ అంశంపై ఆరోగ్యకరమైన చర్చలు విద్యార్థి జీవితంలో భాగం. అయితే రెచ్చిపోయి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడాన్ని సహించం. అందుకే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో పిటిషనర్లను హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేశాం’’ అని రిజిస్ట్రార్ వివరించారు.