breaking news
Arun Bhatia
-
ఎయిర్ ఏషియా ఇండియాకు అరుణ్ భాటియా గుడ్ బై
♦ అరుణ్ వాటాను కొంటున్న టాటా సన్స్ ♦ 49%కి పెరగనున్న టాటా వాటా న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా ఇండియా నుంచి అరుణ్ భాటియా వైదొలిగారు. ఎయిర్ఏషియా ఇండియాలో అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్ప్లేస్ కంపెనీకి దాదాపు 10 శాతం వాటా ఉంది. దీంట్లో టాటా సన్స్ సంస్థ 7.94 శాతం వాటా కొనుగోలు చేయనున్నది. మిగిలిన వాటాను ఎయిర్ ఏషియా ఇండియా చైర్మన్ రామదొరై 0.5 శాతం వాటాను, కంపెనీ డెరైక్టర్ ఆర్. వెంకటరమణన్ 1.5 శాతం వాటాను కొనుగోలు చేయనున్నారు. అరుణ్ భాటియా వాటా కొనుగోలుతో టాటా సన్స్ వాటా 41.06 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుంది. ఈ డీల్ ఈ నెల 14న జరిగిందని, వచ్చే నెలలో పూర్తవుతుందని అంచనా. కాగా మలేషియా ఎయిర్ఏషియా బెర్హాద్కు ఎయిర్ఏషియా ఇండియాలో 49 శాతం వాటా ఉంది. అరుణ్ భాటియా అసంతృప్తి చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా వ్యవహారాల పట్ల అరుణ్ భాటియా గత ఏడాది డిసెంబర్లోనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విమానయాన సంస్థపై నియంత్రణ, యాజమాన్యహక్కుల విషయంలో విభేదాల నేప థ్యంలో ఎయిర్ ఏషియా ఇండియా నుంచి అరుణ్ భాటియా వైదొలుగుతున్నారని సమాచారం. గత నెలలో ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓగా మిట్టు చాండిల్య స్థానంలో అమర్ అబ్రాల్ నియామకం జరిగింది. వచ్చే నెల 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్నది. ఎయిర్ ఏషియా ఇండియా పట్ల టాటా గ్రూప్కు అపారమైన నమ్మకం ఉందని, అందుకే వారు వాటా పెంచుకున్నారని, ఇది గొప్ప విషయమని ఏయిర్ఏషియా గ్రూప్ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ ట్వీట్ చేశారు. ఎయిర్ఏషియా ఇండియా 2014 జూన్లో కార్యకలాపాలు ప్రారంభించింది.ఆరు విమానాలతో 12 రూట్లలో 18 లక్షల మంది ప్రయాణికులకు విమాన సర్వీసులను అందిస్తోంది. -
ఎయిర్ఏషియాకు అంతా తెలుసు
ముంబై: రెండు విమానయాన సంస్థలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసుకోవడంపై వస్తున్న ఆరోపణల మీద టాటా గ్రూప్ స్పందించింది. తాము సింగపూర్ ఎయిర్లైన్స్తో జేవీ ఏర్పాటు చేస్తున్న సంగతి గురించి ఎయిర్ఏషియాకి ముందు నుంచే తెలుసని టాటా గ్రూప్ ప్రతినిధి ముకుంద్ రాజన్ తెలిపారు. దీనిపై ఎయిర్ఏషియా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. రెండు జేవీలను కొనసాగించేందుకే తాము కట్టుబడి ఉన్నామని, ఇందులో సమస్యలేమీ తలెత్తకపోవచ్చని రాజన్ అభిప్రాయపడ్డారు. చౌక విమాన సర్వీసులు అందించేందుకు ఎయిర్ఏషియా, టెలిస్ట్రా ట్రేడ్ప్లేస్తోనూ.. పూర్తి స్థాయి సేవలు అందించేందుకు సింగపూర్ ఎయిర్లైన్స్తోనూ టాటా గ్రూప్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అయితే, సింగపూర్ ఎయిర్లైన్స్ గురించి టాటా గ్రూప్ తనకు చెప్పలేదంటూ టెలిస్ట్రా ట్రేడ్ప్లేస్ ప్రమోటర్ అరుణ్ భాటియా వ్యాఖ్యానించడం తాజా వివాదానికి దారి తీసింది.