breaking news
Artos
-
ఇది గోదారోళ్ల డ్రింకండీ.. దీని టేస్ట్ సూపరండీ బాబూ..
ఆర్టోస్.. ఇది పక్కా లోకల్.. ఈ సాఫ్ట్ డ్రింకు ఒక్కసారి తాగితే చాలు.. జిహ్వ ‘వహ్వా’ అనక మానదు. ఆ రుచి మళ్లీ మళ్లీ కావాలని కోరకా మానదు. ‘రామచంద్రపురం రాజుగారి డ్రింకు’గా పేరొందిన ఈ శీతల పానీయం గురించి తెలియనివారే ఈ ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కానేకాదు. కార్పొరేట్ కూల్డ్రింక్ కంపెనీలు ఎన్ని వచ్చినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ‘ఆర్టోస్’ వందేళ్లకు పైగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఈ ఉగాది సందర్భంగా విస్తరణ బాట పట్టిన ఈ సంస్థ.. మరిన్ని రుచులతో సరికొత్త డ్రింకులు తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. రామచంద్రపురం: ‘ఏంటీ గోలీ సోడానా? అయ్యబాబోయ్! ఎవ్వరూ తాగకండి. అందులో భూతం ఉంది’ అంటూ ఒకప్పుడు అందులో నుంచి వచ్చే గాలికి జనం హడలిపోయే స్థాయి నుంచి.. ‘ఆర్టోసా! ఏదీ మరోటి ఇవ్వండి తాగుతాం’ అనే స్థాయిలో ఆర్టోస్ సాఫ్ట్ డ్రింక్ ప్రాచుర్యం పొందింది. దేశంలో ఎక్కడ ఏ డ్రింకులు తాగినా.. గోదావరి సీమకు వచ్చేసరికి మాత్రం ఆర్టోస్ తాగి వెళ్లాల్సిందే. అచ్చం ద్రాక్ష పండ్ల మాదిరిగానే ఉండే దాని రుచి చూడాల్సిందే. మూడు తరాల కృషి ఆర్టోస్ పరిశ్రమ ఈ స్థాయికి రావడం వెనుక మూడు తరాల కృషి ఉంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వృథాగా పడి ఉన్న గోలిషోడా మెషీన్ను 1912లో కొనుగోలు చేశారు. దానిని ఇక్కడికి తెచ్చి, విశాఖపట్నం పోర్టు ద్వారా ఇంగ్లండ్ నుంచి స్పేర్ పార్టులు తెప్పించి, మరమ్మతులు చేయించారు. ఆ మెషీన్తో పట్టణంలో గోలీసోడా తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో గోలీసోడా ద్వారా వస్తున్న గ్యాస్ను చూసి ప్రజలు దానిలో భూతం ఉందని, ఎవ్వరూ తాగకూడదని చెప్పుకొనేవారు. దీంతో అప్పట్లో అంతంత మాత్రంగానే సోడాలు అమ్ముడు పోయేవి. అప్పట్లో రాజుగారు ఒక్కరే వెల్ల ప్రాంతం నుంచి తాగునీరు తెచ్చుకుంటూ సోడాలు తయారు చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పట్టణంలో సేద తీరేందుకు వచ్చిన బ్రిటిష్ మిలిటరీ సైనికులకు ఈ గోలీసోడాను అందించేవారు. దీంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. 1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు తన చదువు ముగించుకున్న అనంతరం అప్పట్లో మద్రాసులో ప్రాచుర్యం పొందిన స్పెన్సెన్స్ డ్రింక్ తాగి, అటువంటి సాఫ్ట్ డ్రింక్ తయారు చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో దానిని తయారు చేసే విధానాన్ని, ముడి సరకును లండన్, జర్మనీ ప్రాంతాల నుంచి రప్పించారు. అదే ఏడాది ఏఆర్ రాజు డ్రింక్స్ పేరుతో సాఫ్ట్ డ్రింక్ తయారీ ప్రారంభమైంది. ఒక్క నీరు తప్ప మిగిలిన ముడి సరకులన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఈ డ్రింకులను అప్పట్లో తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమహేంద్రవరం వరకూ అర్ధణా నుంచి మూడు పైసలకు అమ్మేవారు. 1930లో సెమీ ఆటోమెటిక్ మెషీన్ అమర్చి మరింతగా డ్రింకులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. 1955లో ఇంగ్లండ్ నుంచి పూర్తి స్థాయి ఆటోమెటిక్ మెషీన్ రప్పించారు. డ్రింక్స్కు ‘ఆర్టోస్’గా పేరు మార్చారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే అదే ఏడాది పేటెంట్ హక్కులు కూడా పొందారు. తరువాత ఆయన కుమారులు పద్మనాభరాజు, సత్యనారాయణరాజులు ఆర్టోస్ డ్రింక్ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువచ్చారు. 1912 నుంచి ఇప్పటి వరకూ సుమారు ఆరుసార్లు డ్రింక్ రూపాంతరం చెందుతూ వచ్చింది. 1955లో 30 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 150కి పెరిగింది. అప్పటి నుంచీ మన జిల్లాతో పాటు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఆర్టోస్ డ్రింక్ను పంపిణీ చేస్తున్నారు. ఈ కంపెనీకి మూడు జిల్లాల్లోనూ 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే రామచంద్రపురం పరిసర గ్రామాలకు ఆర్టోస్ వాటర్ బాటిళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వందేళ్ల తరువాత రెండో యూనిట్ ఆర్టోస్ ఫ్యాక్టరీ వందేళ్లు పూర్తి చేసుకున్న తరువాత మూడో తరం వారైన ఆర్టోస్ బ్రదర్స్ అడ్డూరి జగన్నాథవర్మ, వీరభద్రరాజు, రవీంద్రలు పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రెండో యూనిట్ను మంగళవారం ప్రారంభించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ చెలికాని స్టాలిన్, మంత్రి వేణు తనయుడు నరేన్, మున్సిపల్ చైర్పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఇక నుంచి 1.25, 250, 200 మిల్లీలీటర్ల ప్లాస్టిక్ బాటిళ్లతో ఇప్పటి వరకూ అందిస్తున్న ద్రాక్షతో పాటు మ్యాంగో, లెమన్, ఆరెంజ్ ఫ్లేవర్లలో కూడా డ్రింకులు తయారు చేయనున్నారు. అలాగే సోడాలు కూడా తయారు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో.. వందేళ్లుగా గోదావరి ప్రజలు ఆదరిస్తున్న ఆర్టోస్ను మరిన్ని రుచులతో అందించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రెండో యూనిట్ ప్రారంభించాం. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని యంత్రాలను అమర్చి బాటిల్ యూనిట్ ఏర్పాటు చేశాం. గతంలో కంటే మరింత వేగంగా ఆర్టోస్ డ్రింక్ను వినియోగదారులకు అందించే ప్రయత్నంలో భాగంగానే రెండో యూనిట్ ప్రారంభించాం. – అడ్డూరి జగన్నాథవర్మ, ఆర్టోస్ అధినేత చదవండి: చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. చంద్రబాబు పిలుపు: మందు తాగండి.. ఓటు వేయండి -
గోలీ సోడాతో గోల్ కొట్టారు!
గోదావరికెళితే ఆర్టోస్ కూల్డ్రింక్ తాగాల్సిందే 50 ఏళ్ల కిందట ఆరంభం... ఏటా రూ.15 కోట్ల వ్యాపారం కోక్... కొంటామన్నా విక్రయించడానికి యాజమాన్యం నో 5 ఫ్లేవర్స్లో కూల్డ్రింక్స్; ఈ ఏడాదిలో మ్యాంగో జ్యూస్ బహుళజాతి సంస్థల పోటీని తట్టుకుని నిలబడటమంటే మాటలు కాదు. అది కూడా కూల్డ్రింక్స్ మార్కెట్లో!!! వేల కోట్ల రూపాయల ప్రచారం... టాప్ సెలబ్రిటీలతో ప్రకటనలు... పోటీ పడలేని స్థాయిలో మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఒకెత్తయితే ప్రత్యర్థులు ఊహించని ఆఫర్లిచ్చి వారిని పడేయటం మరొకఎత్తు. థమ్స్ అప్, గోల్డ్స్పాట్, లిమ్కా వంటి సూపర్ బ్రాండ్లతో లీడర్గా ఉన్న పార్లే సైతం పడిపోయిందంటే ఇలాంటి ఆఫర్ల వల్లే!. అలాంటి ఆఫర్లకు సైతం పడకుండా పోటీని తట్టుకుంటూ... తమ బ్రాండ్ను కాపాడుకుంటున్న ‘లోకల్’ మెరుపులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అలాంటి మెరుపే ఆర్టోస్. ఇది తూగోజీ బ్రాండ్. గోదావరి జిల్లాలకు పరిచయం అక్కర్లేని శీతల పానీయం. హైదరాబాద్, బిజినెస్బ్యూరో ఆర్టోస్ది దాదాపు యాభై ఏళ్ల చరిత్ర. ఇక దాన్ని తయారు చేసే ఏఆర్ రాజు డ్రింక్స్దైతే దాదాపు వందేళ్ల చరిత్ర. 1912లో ప్రపంచ యుద్ధం కమ్ముకొస్తున్న సమయంలో బ్రిటిష్ మిలిటరీ పెద్ద ఎత్తున రామచంద్రపురానికి వచ్చేది. వారికి ‘గోలీ సోడా’లు అందించటమే అడ్డూరి రామచంద్రరాజు వ్యాపారం. అలా... వారికి దగ్గరైన రాజు... వారి సహకారంతోనే బ్రిటన్ నుంచి కూల్డ్రింక్ తయారీకి సంబంధించిన యంత్రాలను, ముడి సరుకులను తెప్పించుకున్నారు. 1919లో ఏఆర్ రాజు డ్రింక్స్ పేరిట కూల్డ్రింక్ వ్యాపారం మొదలుపెట్టారు. అప్పట్లో బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ లేఖల రూపంలోనే జరిగాయి. 1955లో పూర్తి ఆటోమిషన్ కావటంతో ‘ఆర్టోస్’ డ్రింక్ బయటకు వచ్చింది. అదే ఏడాది దీనికి సంబంధించిన పేటెంట్ హక్కులను కూడా తీసుకున్నారు. ఇప్పటికీ ఈ కూల్డ్రింక్ తయారీకి సంబంధించిన ముడిపదార్థాల మిశ్రమాన్ని వారసత్వంగా వస్తున్న రామచంద్రరాజు కుటుంబం మాత్రమే తయారు చేస్తుంది. కోక్ కొనటానికి ముందుకొచ్చినా... పెప్సీ, కోక్లను తట్టుకోలేక దేశీయ దిగ్గజం పార్లేనే థమ్స్ అప్, మజా, లిమ్కా, కిస్మత్, సిట్రా వంటి బ్రాండ్లను అమ్మేసింది. వాటిని కొనుగోలు చేసిన కోక్... ఆ బ్రాండ్ల బదులు తమవి పెట్టాలని చూసినా ఫలితం లేకపోవటంతో... చివరికి థమ్స్ అప్, మజా, లిమ్కాలనే తన బ్రాండ్లుగా విక్రయించటం మొదలుపెట్టింది. ఇదంతా ఎందుకంటే 1960లో ఆర్టోస్ కూడా ఇలాంటి ఒత్తిడే ఎదుర్కొంది. రామచంద్రపురం యూనిట్ను కొనుగోలు చేయడానికి కోకాకోలా ముందుకొచ్చింది. విక్రయానికి ఒక దశలో రామచంద్రరాజు సరేనన్నారు. కాకపోతే కొనుగోలు చేసిన అనంతరం ఆర్టోస్ బ్రాండ్ను తీసేస్తామని కోక్ చెప్పటంతో ఆయన ఒప్పుకోలేదు. పెపైచ్చు కొత్త రుచులను పరిచయం చేస్తూ బ్రాండ్ను మరింత విస్తరించారు. ఒకానొక దశలో విజయవాడ వరకు ఆర్టోస్ విస్తరించింది. ‘‘అప్పట్లో మా కూల్డ్రింక్ ధర రూ. 5 కన్నా తక్కువే. దాంతో మా బ్రాండ్ను పడగొట్టడానికి పెప్సీ, కోక్లు చిన్న బాటిళ్లలో 5 రూపాయల కూల్డ్రింక్స్ను తెచ్చాయి. ఆ పోటీని మేం తట్టుకోలేకపోయాం. విజయవాడ నుంచి వెనక్కొచ్చేశాం. ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఉంది కానీ పెద్ద కంపెనీల పోటీని తట్టుకోవటం చాలా కష్టం’’ అన్నారు ఆర్టోస్ ఎండీ అడ్డూరి జగన్నాథ వర్మ. ప్రస్తుతం తూర్పుగోదావరితో పాటు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలకే ఆర్టోస్ పరిమితమైంది. గ్రామీణ మార్కెట్, నమ్మకమే బలం పెద్ద కంపెనీలను తట్టుకొని నిలబడటానికి విభిన్నమార్కెటింగ్ వ్యూహాన్ని అనుసరించామంటారు వర్మ. ‘‘పెప్సీ, కోక్లు ఫ్రిజ్లు, ఆఫర్లతో వచ్చి... ఎక్కువ వ్యాపారం జరిగే మార్కెట్లపైనే దృష్టి పెట్టాయి. వాటితో పోటీ కష్టమని భావించిన మేం.. అవి పట్టించుకోని చిన్న షాపులు, గ్రామాలపై దృష్టి పెట్టాం. లాభాలను తగ్గించుకుని షాపు వాళ్లకు ఎక్కువ మార్జిన్లు ఆఫర్ చేశాం. దీంతో గ్రామాల్లో కూల్డ్రింక్ అంటే ఆర్టోస్ అనేస్థాయికి చేరాం’’ అని చెప్పారు. కోకాకోలా బాటిల్పై రూపాయి కమీషన్గా ఇస్తే ఆర్టోస్ రూ. 1.75 ఇస్తోంది. దీంతో చిన్న వ్యాపారులు ఆర్టోస్ విక్రయానికే మొగ్గు చూపుతున్నట్లు వర్మ తెలిపారు. దీనికి తోడు బడా కంపెనీలు అం దించని ద్రాక్ష ఫ్లేవర్పై ఆర్టోస్ ప్రధానంగా దృష్టిపెట్టింది. మిగతా కంపెనీలు చిన్న బాటిల్ను రూ.10కి విక్రయిస్తుంటే ఆర్టోస్ రూ.8కే ఇస్తోంది. ‘‘ఈ చర్యలన్నీ మా వ్యాపారాన్ని పెంచాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడంతో పదేళ్లుగా చక్కని వృద్ధి నమోదవుతోంది. గతేడాది మేం రూ. 15 కోట్ల టర్నోవర్ను నమోదు చేశాం’’ అని వర్మ తెలియజేశారు. తరాలు మారినా అదే అనుబంధం... కూల్ డ్రింక్లతో పాటు సోడా, మంచినీటి వ్యాపారంలోకి కూడా ఆర్టోస్ ప్రవేశించింది. తాజాగా మ్యాంగో డ్రింక్ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, ఈ సంవత్సరాంతానికి మ్యాంగో డ్రింక్ను ప్రవేశపెడతామని తెలిపిన జగన్నాథ వర్మ... ఈ కుటుంబంలో మూడో తరానికి చెందుతారు. వీరభద్రరాజు, పద్మనాభవర్మతో కలిసి ఈయన ఆర్టోస్ను నిర్వహిస్తున్నారు. నాలుగో తరానికి చెందిన వీరి వారసులు కూడా చదువులు పూర్తయ్యాక దీన్లో అడుగుపెట్టడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనికింకో ఐదేళ్లు పట్టొచ్చు.