‘మహాకూటమిగానే పోటీ’
వచ్చే లోక్సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ, ఆర్పీఐలు మహాకూటమిగానే పోటీ చేయనున్నాయి. కలిసి కట్టుగానే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే తెలిపారు. బీఎంసీ నిర్మించిన ట్రామా కేర్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మా కూటమి కలిసి పోటీచేయదని అనేక మంది అనుకుంటున్నారని, అయితే అవన్నీ వట్టివేనని, ఐక్యంగానే సత్తా చాటుతామని అన్నారు.
ఏటీఎం (అథవలే, ఠాక్రే, ముండే) ఎప్పటికీ బ్రేక్ కాదని, కలిసి కట్టుగానే ఉంటామని బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా పోరాటం సీట్లు, పదవులు, ప్రతిష్ట కోసం కాదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని నొక్కి చెప్పారు. అయితే బాల్ఠాక్రే పేరు పెట్టిన ట్రామా కేర్ని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముండే, అథవలే సమక్షంలో ప్రారంభించారు. అయితే వారం క్రితం జరిగిన దసరా ర్యాలీలో అవమానానికి గురైన శివసేన పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ జోషి రాసిన లేఖపై స్పందించేందుకు ఉద్ధవ్ నిరాకరించారు. తాను కావాలనుకున్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడతానని తెలిపారు.