నాకింకా 21 ఏళ్ల మాత్రమే.. ఆ డబ్బంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు: ‘హనుమాన్ అంశ్’ నిర్మాత
చిత్ర పరిశ్రమలో కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంటాయి. రూ. కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడతాయి. హనుమాన్ అంశ్ అనే చిత్రం కూడా ఆ కోవలోకి చెందినదే. రూ. 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల థియేటర్స్లోకి వచ్చి, రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తొలి రోజు కేవలం రూ. 10 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. రెండు వారాల తర్వాతే ఈసినిమాకు భారీ కలెక్షన్స్ రావడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు రూ. 235 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఇంకా ఓవర్సీస్లో విడుదల కాలేదు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగులో ఈ నెల 18న విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఇది 'సీఎం విజయ్' వినాయకుడు.. ఫొటోలు వైరల్)ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని.. ఈ మేరకు రూ. 100 కోట్లతో ప్రముఖ ఓటీటీ సంస్థ ఒప్పందం కూడా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా దీనిపై చిత్ర నిర్మాత అనుప్రియ నాగర్ స్పందిస్తూ ఆ వార్తలు అవాస్తవం అని ఖండించారు. ‘సినిమా తెరకెక్కించేటప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి నేను కలలో కూడా ఆలోచించలేదు. నీమ్ కరోలి బాబా దివ్య సందేశాన్ని నేటి యువతరానికి అందించాలనేదే నా ఏకైక లక్ష్యం. నాకింకా 21 ఏళ్లే.. ఇంత భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఊహించలేదు, అసలు ఈ డబ్బును ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు’ అని అనుప్రియ నాగర్ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ చిత్రం నిర్మాణంలో తాను ఒక్కదానినే పాల్గొనలేదని..పూర్తి బడ్జెట్తో మూడో వంతు మాత్రమే నేను పెట్టానని..మిగతాది ఇతరులు షేర్ చేసుకున్నారని చెప్పింది.హనుమాన్ అంశ్ సినిమా విషయానికొస్తే.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రమిది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభినవ్ సత్య ప్రధాన పాత్ర పోషించాడు.