breaking news
Ankit Bhardwaj
-
మిశ్రాను కొట్టిన యువకుడు జాబ్ వదిలేశాడు
న్యూఢిల్లీ: కపిల్ మిశ్రాపై దాడికి ప్రయత్నించిన యువకుడు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ జెండా పట్టుకోబోతున్నాడు. అతడు తాను చేస్తున్న సీఏ ఉద్యోగాన్ని వదిలేసి ఇక ఆప్కు సేవలు అందించాలని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఆమ్ ఆద్మీపార్టీ నుంచి బహిష్కరణకు గురైన కపిల్ మిశ్రాపై అంకిత్ భరద్వాజ్ దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు చేసిన కపిల్ మిశ్రా అనంతరం పార్టీ నుంచి బహిష్కరణ వేటుకు గురై నిరాహార దీక్షకు దిగిన సమయంలో అంకిత్ దాడి చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం అతడు తన ఉద్యోగానికి గుడ్బై చెప్పేశాడు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో బయటపెట్టినట్లు తెలిపారు. మోతీ బాగ్ ప్రాంతానికి చెందిన అంకిత్ మిశ్రా మెడపట్టుకొని చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
‘ఇదంతా కేజ్రీవాల్ ఆడించిన నాటకం’
న్యూఢిల్లీ: తనపై దాడి చేసిన అంకిత్ భరద్వాజ్ బీజేపీ కార్యకర్త అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తప్పుడు ప్రచారం చేస్తోందని కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఆరోపించారు. ఇదంతా కేజ్రీవాల్ ఆడించిన నాటకమని మండిపడ్డారు. తనపై దాడి జరిగిన వెంటనే భరద్వాజ్ బీజేపీ కార్యకర్త అంటూ ఆప్ నేతలు సోషల్ మీడియా అసత్య ప్రచారానికి దిగారని వెల్లడించారు. ఆప్ సీనియర్ నేతల విదేశీ పర్యటనలకు ఖర్చయిన నిధుల వివరాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్తో నిరాహారదీక్షకు దిగిన మిశ్రాపై బుధవారం భరద్వాజ్ దాడి చేశాడు. దీనిపై సీఎం కేజ్రీవాల్కు మిశ్రా లేఖ రాశారు. ‘నాపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు ఫేస్బుక్లో షేర్ చేయడం, ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే గతంలో మీపై (కేజ్రీవాల్) దాడి జరిగినప్పుడు ఎలా చేశారో అలాగే ఇప్పుడు చేశారు. ఇది పాత ట్రిక్కు. భరద్వాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకోకముందే అతడు బీజేపీ కార్యకర్త అని ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రకటించారు. ఇలాంటిది జరుగుతుందని ఆప్ నాయకులకు ముందే తెలుసున’ని లేఖలో మిశ్రా ఆరోపించారు. భరద్వాజ్తో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ యువ మోర్చా తెలిపింది.