breaking news
Amrutha Rao
-
పోరుబాటలో ఆయనది ఉక్కు సంకల్పం
స్వాతంత్య్రోద్యమంలో గర్జించిన గుంటూరు పోరాట కీర్తి.. పొట్టిశ్రీరాములు కంటే ముందే ఆంధ్రరాష్ట్రం కోసం గళమెత్తిన అమృతమూర్తి.. విశాఖ ఉక్కు కోసం పిడికిలెత్తిన ఉద్యమస్ఫూర్తి.. మహోజ్వలిత తేజం తమనంపల్లి అమృతరావు. ఆయన జీవితం ఆద్యంతం ఆదర్శనీయం. అక్టోబర్ 21న మహనీయుని జయంత్యుత్సవం సందర్భంగా ఆయన సేవా ప్రస్థానం స్మరణీయం.. గుంటూరు: అమృతరావు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదల గ్రామంలో 1920 అక్టోబర్ 21న పేద దళిత కుటుంబంలో జన్మించారు. పేదరికం వల్ల విద్యను మధ్యలోనే ఆపేశారు. సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. మహాత్మా గాంధీ పిలుపుతో 1940 దశకంలో స్వాతంత్య్రసమరంలోకి అడుగుపెట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. గుంటూరులోని కొండా వెంకటప్పయ్య పంతులు ఇంటికి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ అమృతరావును ప్రత్యేకంగా పిలిపించుకుని గంటకుపైగా మాట్లాడారట. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారట. అమృతరావు కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, వింజమూరి భావనాచార్యులు, నడింపల్లి తదితరులతో కలిసి బ్రిటిష్ సేనలపై వీరోచితంగా పోరాడారు. ఆంధ్రరాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది పొట్టి శ్రీరాములుకంటే ముందే అమృతరావు ఆంధ్రరాష్ట్ర సాధనకు నడుంకట్టారు. 1952 ఆగస్ట్ 2న మద్రాసు సెక్రటేరియెట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో స్పందించిన ప్రకాశం పంతులు ఇంత చిన్నవయసులో ఇంత పెద్ద ఉద్యమం వద్దని హితవు పలికి దీక్షను విరమింపజేశారు. ఆ తర్వాత 1952 అక్టోబర్లో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష ప్రారంభించి ప్రాణత్యాగం చేశారు. అనంతరం మహాత్ముని సిద్ధాంతాల ప్రచారానికి అమృతరావు 1959లో గాంధీ మిషన్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. విశాఖ ఉద్యమంలో కీలకంగా.. 1964లో కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ముందు ప్రకటించి ఆ తర్వాత వెనక్కుతగ్గింది. దీంతో అమృతరావు విశాఖపట్నం కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ పేరుతో 21 రోజులపాటు దీక్షను నడపడం విశేషం. ఇది మహోద్యమంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారపత్రం అందజేశారు. ► అనంతరం 1978–83 వరకు తాడికొండ నియోజకవర్గం నుంచి అమృతరావు శాసన సభ్యుడిగా పనిచేశారు. ► అప్పట్లో జిల్లా కలెక్టర్ అమృతరావుకు ఇచ్చిన సుమారు 15 ఎకరాల భూమిని ఆయన పేదలకు పంచి పెట్టారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు నగర్ ప్రాంతం అదే. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం ఇచ్చిన పింఛన్నూ తిరస్కరించిన నిజమైన దేశభక్తుడు అమృతరావు. ఆఖరుకు పేదరికంతోనే 1989 ఏప్రిల్ 27న ఆయన నెల్లూరులో కన్నుమూశారు. విశాఖలో విగ్రహం ఏర్పాటుచేసిన వైఎస్సార్ అమృతరావు సేవలకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుత గుర్తింపునిచ్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.78 లక్షలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణలో అమృతరావు కాంస్య విగ్రహంతోపాటు ఆయన పేరుతో పార్క్నూ ఏర్పాటు చేశారు. 2008లో గుంటూరులోనూ అమృతరావు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. వైఎస్సార్ రుణం తీర్చుకోలేనిది తాతగారి ఉద్యమాలను, గొప్పదనాన్ని గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ రుణం తీర్చుకోలేనిది. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తూ స్వాతంత్య్ర ఉద్యమకారులను గుర్తిస్తున్నారు. గుంటూరులోని సోషల్ వెల్ఫేర్ భవనానికి అమృతరావు పేరును పెట్టాలని కోరుతున్నాం. – తమనంపల్లి మోహన్ గాంధీ గాంధీ మిషన్ అధ్యక్షులు (అమృతరావు మనవడు) గొప్ప నేతతో నా సాంగత్యం అమృతరావుతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ రోజుల్లో ఆయన నిస్వార్థ ప్రజా సేవ ఎనలేనిది. ఆయన జ్ఞాపకార్థం 2008లో స్థానిక అమరావతి రోడ్డులో అమృతరావు విగ్రహాన్ని వైఎస్సార్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అమృతరావును స్మరించుకోవడం సంతోషంగా ఉంది. – వింజమూరి రాజగోపాలాచారి (బాబు), సీనియర్ న్యాయవాది -
30 రోజుల్లో 3 అవకాశాలు
దాదాదాపు 12 ఏళ్ల క్రితం మహేశ్బాబు హీరోగా నటించిన ‘అతిథి’ సినిమాతో తెలుగు తెరపై కనిపించారు ముంబై బ్యూటీ అమృతా రావ్. ఆ తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కొన్ని హిందీ సినిమాలు చేశారామె. 2013 తర్వాత హిందీ సినిమాల్లో కూడా నటించలేదు. ఆరేళ్ల విరామం తర్వాత ఆమె ఈ ఏడాది గత నెల ‘థాక్రే’ అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘అతిథి’ తర్వాత తెలుగు సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారామె. ‘‘అతిథి’ నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా మిలిగింది. ఆ సినిమాలో మహేశ్బాబు పాత్రకు సమానంగా నా పాత్ర ఉంది. ఆ సినిమా లొకేషన్లో నాతో మహేశ్బాబు, నమ్రత ఫ్యామిలీ మెంబర్స్లా ఉండేవారు. వారి ఇంటి భోజనం కూడా తిన్నాను. ‘అతిథి’ తర్వాత నాకు 30 రోజుల వ్యవధిలో మూడు అవకాశాలు వచ్చాయి. కానీ నేనే వద్దనుకున్నాను. టాలీవుడ్లో కథానాయిక పాత్రలు గ్లామర్ కోసమే అనిపించింది. దక్షిణాది సినిమాలు చేసేది తొందరగా డబ్బు సంపాదించుకోవడం కోసమే అని నాతో కొందరు అన్నారు. తెలుగు డైలాగ్స్ పలకడం కోసం పెద్దగా ఇబ్బంది పడవద్దని, సులభంగానే డబ్బింగ్ చెప్పించేయొచ్చని అని కూడా అన్నారు. కానీ నా వర్కింగ్ స్టైల్ అది కాదు. నటనకు సంబంధించి నా దృష్టిలో డబ్బు ముఖ్యం కాదు’’ అన్నారు అమృతా రావ్. హిందీలో గత ఆరేళ్లల్లో నచ్చిన పాత్రలు రాకపోవడంవల్లే చేయలేదని స్పష్టం చేశారు. -
'40 ఏళ్ల మహిళను దిగ్విజయ్ పెళ్లాడితే తప్పేంటి?'
న్యూఢిల్లీ: 40 ఏళ్ల మహిళను 68 ఏళ్ల వ్యక్తి పెళ్లాడితే తప్పేంటని ఆర్ఎల్డీ నేత అమర్ సింగ్ ప్రశ్నించారు. రాజకీయనేతల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయవద్దని అమర్ సింగ్ అభిప్రాయపడ్డారు. రాజకీయనేతల వ్యక్తిగత జీవితాలపై బహిరంగ చర్చ పెట్టకూడదని దిగ్విజయ్ సింగ్, టీవీ జర్నలిస్ట్ అమృతారాయ్ వివాహ వార్తపై ఆయన స్పందించారు. నరేంద్రమోడీ, దిగ్విజయ్ సింగ్ ల వైవాహిక జీవితాలపై ప్రజావేదికల మీద చర్చ పెట్టడం సమంజసం కాదని అమర్ సింగ్ అన్నారు. దేశంలో నరేంద్రమోడీ హవాలేదని అమర్ ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. సమాజ్ వాదీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రీయ లోకసభ అభ్యర్తిగా ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.