breaking news
albatross
-
ఎడిసన్లో అతిపెద్ద బౌలింగ్ కేంద్రం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ థీమ్ మినీ పుట్టింగ్, లగ్జరీ బౌలింగ్ గమ్యస్థానమైన అల్బాట్రోస్ న్యూజెర్సీలోని ఎడిసన్లో ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ వేడుక ఇటీవల వైభవంగా జరిగింది. ఇందులో ఎడిసన్ మేయర్ శామ్ జోషి, స్థానిక నాయకులు, మీడియా, ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.ఎడిసన్లోని 991 యుఎస్-1 వద్ద ఏర్పాటైన అల్బాట్రోస్ న్యూజెర్సీలో సామాజిక వినోదానికి ఒక కొత్త బెంచ్ మార్క్ ను ఏర్పరుస్తుంది. 50,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇది అద్భుతమైన థీమ్డ్ మినీ పుట్టింగ్, అప్స్కేల్ బౌలింగ్, ఎలివేటెడ్ డైనింగ్, క్రాఫ్ట్ కాక్టెయిల్స్ వంటి హంగులతో సాయంత్రం వేళ ఆటవిడుపును మరింత హుషారుగా మారుస్తుంది."మా గ్రాండ్ ఓపెనింగ్ ఒక అద్భుతమైన వేడుక, చివరికి అల్బాట్రోస్లోకి అతిథులను స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది" అని అల్బాట్రోస్ ఎన్జె ప్రెసిడెంట్ స్టీఫెన్ సాంగర్మానో అన్నారు. "ఇది కేవలం వినోద వేదిక మాత్రమే కాదు- ఇది మరచిపోలేని సాటిలేని విధంగా రూపొందించబడిన సామాజిక ఆటస్థలం. మినీ పుటింగ్, లగ్జరీ బౌలింగ్ నుంచి క్రాఫ్ట్ కాక్టెయిల్స్, వైబ్రెంట్ డైనింగ్, లైవ్ డీజేల వరకు ఎక్కడా ఇలాంటివి లేవు’ అన్నారు."ప్రపంచ స్థాయి వినోదం, 350 కి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్న అల్బాట్రోస్ ఎడిసన్కు గేమ్ ఛేంజర్. మా మొత్తం కమ్యూనిటీకి శక్తిని తెస్తోంది" అని ఎడిసన్ మేయర్ సామ్ జోషి అన్నారు. "175,000 డాలర్ల అంచనా పన్నులతో మా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, కుటుంబాలు, స్నేహితులు, సందర్శకులు కనెక్ట్ కావడానికి, ఆనందించడానికి నూతన, ఉత్తేజకరమైన ప్రదేశాన్ని అందించే గమ్యస్థానానికి స్వాగతం పలకడం నిజంగా ఉత్తేజకరమైనది. ఎడిసన్ ఇంత డైనమిక్, సృజనాత్మక వేదికకు నిలయంగా ఉండటం మాకు గర్వకారణం’ అని పేర్కొన్నారు. -
మనిషి పాపం.. వాటికి శాపం..
వాషింగ్టన్ : మనిషి సృష్టిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం జనావాసంలోని వారినే కాకుండా.. మనిషికి దూరంగా బతుకుతున్న మూగ జీవాల ప్రాణాలను కూడా తీస్తోంది. గత కొద్ది నెలలుగా పసిఫిక్ సముద్ర తీరంలోని మిడ్వే ఐలాండ్లో కొన్ని వేల పక్షులు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ప్రాణాలు విడిచాయి. ఈ ఐలాండ్లో ఎక్కువగా ఆల్బట్రాస్ జాతి పక్షులు జీవిస్తుంటాయి. తీరాల వెంట చేపలను వేటాడి తింటూ బతికేస్తుంటాయి. కానీ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన ప్లాస్లిక్ వ్యర్థాలను పోల్చుకోలేక వాటిని చేపలుగా భావించి అవి తినటమే కాకుండా వాటి పిల్లలకు కూడా తినిపిస్తున్నాయి. దీంతో తిన్న వ్యర్థాలను అరాయించుకోలేక భారీ సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. అమెరికా ఫోటోగ్రాఫర్ క్రిస్ జార్డన్ హోప్స్ తీసిన ఫోటోలు ప్రజల్ని కదిలించాయి. చనిపోయిన పక్షి కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్న ఆ చిత్రంతో అక్కడి పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఫొటో గ్రాఫర్ జార్డన్ మాట్లాడుతూ.. ‘ప్లాస్టిక్ వస్తువులను మనం ఒకసారి వాడేసిన తర్వాత పడేస్తున్నాం. అవి భూమిలో కలిసిపోవడం చాలా కష్టం. ప్లాస్టిక్ను నివారించడం ఒక్కరితో అయ్యే పని కాదు. మార్పు తీసుకురావాలంటే అందరిలోనూ చైతన్యం రావాలి’ అని అన్నారు. ప్రతి మనిషి ఒక రోజులో 130 అతిచిన్న ప్లాస్టిక్ వ్యర్థాలను శ్వాసిస్తున్నాడని ఓ పరిశోధనలో తేలింది. -
నేవీకి 'అల్బాట్రాస్' బై బై
న్యూఢిల్లీ: భారతీయ నేవీ నుంచి మరో దిగ్గజం రిటైర్ కానుంది. హిందూ మహాసముద్రంపై 30 ఏళ్ల పాటు డేగ కన్ను వేసిన టుపోలెవ్-142ఎమ్ ఎయిర్క్రాఫ్ట్(రష్యా నుంచి కొనుగోలు చేశారు) ఈ నెలాఖరుకు విధుల్లో నుంచి తప్పుకోనుంది. టర్బోప్రొపెల్లర్తో నడిచే టుపోలెవ్-142ఎమ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది, వేగవంతమైనది. రాయల్ బ్రిటీష్ నేవీలో కొద్దికాలంపాటు సేవలందించిన టుపోలెవ్-142లను ఆ తర్వాత భారత నేవీ తీసుకుని 'అల్బాట్రాస్' అని నామకరణం చేసింది. 1988లో ఎనిమిది టీయూ-142ఎమ్లను నేవీ ఇండక్ట్ చేసింది. యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్లలో టీయూ-142ఎమ్లు ఎనలేని సేవలు అందించాయి. తమిళనాడులోని అరక్కోనం వద్ద మార్చి 29న భారత నేవీ టీయూ-142 విమానాలకు ఘనంగా వీడ్కోలు పలుకుతుందని ఓ నేవీ అధికారి చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ ప్రొపెల్లర్ జెట్ కూడా టీయూ-142 అంత ఎత్తులో ఎగరలేదని అయితే టీయూ-142ల రాడార్ వ్యవస్ధ పాతదైపోయిందని చెప్పారు. అప్పటికీ వాటిని వినియోగించదలచినా పాత వ్యవస్ధలను పునరుద్ధిరించడానికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతోందని తెలిపారు. దీంతో నేవీ వాటిని విధుల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. టీయూ-142ల స్ధానంలో దాదాపు 3.2 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన పన్నెండు పీ-8ఐ లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్లను నేవీ వినియోగించనుంది. వీటిని అమెరికా నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటివరకూ ఎనిమిది పీ-8ఐ విమానాలను అమెరికా భారత్కు అందించింది. భారత నేవీ నుంచి ఐఎన్ఎస్ విరాట్ ఇప్పటికే రిటైర్ అయిన విషయం తెలిసిందే.