రాత్రికి రాత్రే రోడ్డు పేరును మార్చేశారు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రఖ్యాత అక్బర్ రోడ్డు పేరును రాత్రికి రాత్రే మార్చేశారు. పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ అధినేత అమిత్ షా నివాసాలు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు పేరును మార్చాలనే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ఇంతలోనే మంగళవారం రాత్రి ఎవరో ఇండియాగేట్ సర్కిల్కు వెళ్లే మార్గంలో అక్బర్ రోడ్డు దారిని చూపించే బోర్డుపైనా.. అక్బర్ బోర్డు కనిపించడకుండా.. మహారాణా ప్రతాప్ రోడ్డు అంటూ రాసి.. పోస్టర్ అతికించారు. అక్బర్ రోడ్డు మార్గాన్ని సూచించే ప్రధాన సూచికపై పేరును మార్చి.. మహారాణా ప్రతాప్ రోడ్డు అని రాయడం స్థానికంగా గందరగోళం సృష్టించింది.
ఎవరూ ఈ చర్యకు పాల్పడ్డారన్నది ఇంకా స్పష్టం కాలేదు. కానీ బుధవారం (మే 9) మేవార్ రాజ్పుత్ వీరుడు మహారాణా ప్రతాప్ జయంతి కావడంతో ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. బుధవారం ఆ పోస్టర్ను తొలగించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.