AG Office
-
ఖైరతాబాద్ ఏజీ ఆఫీసులో అగ్నిప్రమాదం
* ఆడిట్ విభాగంలో మంటలు * కాలిపోయిన లాకర్లు, బీరువాలు, పత్రాలు ఖైరతాబాద్: సైఫాబాద్లోని ఏజీ ఆఫీసులో సోమవారం అర్దరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో డి బాక్ల్ 3వ అంతస్తులోని ప్రిన్సిపల్ డెరైక్టర్ సెంట్రల్ (ఆడిట్) కార్యాలయ విభాగం కాలిపోయింది. అక్కడున్న హై సెక్యూర్డ్ లాకర్లు, బీరువాలు, కంప్యూటర్లు, టేబుళ్లపై ఉన్న డాక్యుమెంట్లు పూర్తిగా తగలబడిపోయాయి. వివరాలు... సోమవారం అర్దరాత్రి తర్వాత ఏజీ ఆఫీసు ప్రధాన గేటు ముందు ఉన్న డి బ్లాక్ 3వ అంతస్తు నుంచి మంటలు, పొగలు వచ్చాయి. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఏజీ ఆఫీసు ఉన్నతాధికారులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 1.30కి అసెంబ్లీ నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి ల్యాడర్ సాయంతో 3వ అంతస్తు పైకి ఎక్కి మంటలను ఆర్పేందుకు యత్నించినా ఫలితంలేకపోయింది. దీంతో గౌలిగూడ, సికింద్రాబాద్ల నుంచి ఫైరింజిన్లుతో పాటు ప్రత్యేకంగా బ్రౌజర్ ఫైర్ ఇంజిన్ను రప్పించారు. బ్రౌజర్ సాయంతో నేరుగా కిటికీల వద్దకు వెళ్లి అద్దాలు పగులగొట్టి మంటలు ఆర్పేందుకు యత్నించారు. మరోవైపు కార్యాలయ గదుల్లోకి వెళ్లి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. పూర్తిగా పొగ కమ్ముకోవడం, మరో వైపు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చీకట్లోనే సహాయక చర్యలు చేపట్టారు. అయినా ఒకపట్టాన మంటలు అదుపులోకి రాలేదు. అతికష్టం మీద అదుపులోకి... మొత్తం 8 ఫైరింజిన్లలో నీరు చల్లి అతికష్టం మీద ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం 12.30కి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఆఫీసులోని లాకర్లు, బీరువాలు, కంప్యూటర్లు, ముఖ్యమైన పత్రాలు కాలిపోయాయి. సహాయక చర్యలను సిటీ డీఎఫ్ఓ శ్రీనివాస్రెడ్డి, ఏడీఎఫ్ఓ ప్రభాకర్రెడ్డి, ఎస్ఎఫ్ఓ తుకారం, ముస్తఫాలు పర్యవేక్షించారు. కాగా, అగ్నిప్రమాదంపై మంగళవారం సాయంత్రం ఏజీ ఆఫీసు డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎల్.కృష్ణన్ సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫైర్సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా... ఏజీ ఆఫీసులో అగ్నిప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదం ఎలా జరిగిందో అంటుబట్టడంలేదు. అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్లోనే ప్రమాదం జరిగి ఉంటుందని చెప్తున్నారు. -
ఫ్రెండ్స్ బుక్
స్థలం.. బేగంపేట్లోని ఉమానగర్.. ‘అందరిమాట ఏమోగాని నాకు మాత్రం ఇంటర్నెట్ చాలా యూజ్ఫుల్ అయింది. ఏజీ ఆఫీస్లో అంకౌట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాక కాలక్షేపం ఏంటా అనుకుంటున్నప్పుడు ఫేస్బుక్ పరిచయమైంది. ఇందులోని ప్రమదాక్షరి గ్రూప్ నాకు ఎందరో రచయితలను, కొత్త రచనలను పరిచయం చేసింది. ఈ గ్రూప్లోని వాళ్లలో కాంపిటేటీవ్ స్పిరిట్ను చూస్తున్నాను’ అంటూ ఉపోద్ఘాతం ఇచ్చారు సీఎస్ఎమ్ లక్ష్మీ. ‘బ్లాగ్లో.. ఫేస్బుక్ గ్రూప్లో రచనలు రాయడంలో నేను జూనియర్నే అయినా రచయిత్రిగా మాత్రం మీ అందరికన్నా సీనియర్నే’ అంటూ ఈ చర్చలోకొచ్చారు పొత్తూరి విజయలక్ష్మి..‘ మేం కథలు, నవలలు రాసే కాలంలో పాఠకుల నుంచి వచ్చే ఉత్తరాల కోసం వారాలకు వారాలు ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడలాకాదు ఇలా ఓ వాక్యం రాశామో లేదో అలా లైక్లూ.. కామెంట్లు వచ్చిపడుతున్నాయ్. పుస్తకాలు చదివేవాళ్లు, రాసేవాళ్లు లేటెస్ట్ టెక్నాలజీని ఇట్లా ఉపయోగించుకుంటున్నారు. అందుకే పఠనాసక్తి తగ్గిందంటే నేనొప్పుకోను’అని కరాఖండిగా చెప్పారామె. ‘అవును నేనూ ఒప్పుకోను. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ పత్రికలు నిర్వహిస్తున్న పాత్ర అంతాఇంతా కాదు మరి. మీలాంటి సీనియర్స్ సీరియస్గా రచనా వ్యాసంగంలో ఉన్న రోజుల్లో మీ రచనలకు ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్, సింగపూర్లాంటి దేశాల్లో పాఠకులుండేవారా? కానీ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ పత్రికలకు ప్రపంచవ్యాప్త పాఠకులున్నారు. కథను పోస్ట్ చేసిన క్షణంలోనే దాన్ని చదివేవాళ్లున్నారు. వెంటనే తమ స్పందననూ తెలుపుతున్నారు’అంటూ పొత్తూరి విజయలక్ష్మి అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ తన అభిప్రాయాన్నీ చెప్పారు మంథా భానుమతి. ‘ఇదివరకు రచయితలు తక్కువ, పాఠకులు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు రచయితలు ఎక్కువయ్యారు. రచన ఎవరి సొత్తు కాదని ఇవి నిరూపిస్తున్నాయి’అని స్వాతి శ్రీపాద అంటుంటే ‘పాఠకులూ రచయితలు అవుతున్నారన్న మాట.. రచయితలు మంచి పాఠకులుగా కూడా ఉంటున్నారు’ అని తన వాక్యాన్ని ఆమె మాటకు జోడించారు ప్రముఖ రచయిత్రి, వాన చినుకులు బ్లాగ్ రైటర్ వారణాసి నాగలక్ష్మి. ‘మా మనవడితో మాట్లాడటానికని ఇంటర్నెట్ యూజ్ చేయడం నేర్చుకున్నాను. అలా ప్రమదావనం అనే గ్రూప్తో పరిచయం ఏర్పడింది. దానివల్లే ఫొటోషాప్ నేర్చుకున్నాను. నాలుగు కథలూ రాశాను’అని తన వాణి వినిపించారు మాలాకుమార్. ‘పుస్తకాలు తగ్గిపోతున్న ఈ కాలంలో అంతర్జాల పత్రికలతో చెలిమైంది. ప్రమదావనంలో మెంబర్అయి సొంతంగా బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. వెంటనే వచ్చే రెస్పాన్స్ ఈ వయసులో కూడా నాలో రచనా ఉత్సాహాన్ని నింపింది’ అని విశ్రాంత సమయాన్ని వినియోగపర్చుకుంటున్న తీరును పంచుకున్నారు జీఎస్ లక్ష్మీ. ‘ఇంటర్నెట్ పత్రికలను ఏ ఫోన్లోనైనా. ట్యాబ్లోనైనా చదువుకోవచ్చు. నా మటుకు నాకు పత్రికలు, ఫేస్బుక్ గ్రూప్స్ వల్ల కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, పాత ఫ్రెండ్షిప్ మరింత సన్నిహితమైంది’ అని వివరించారు కే బీ లక్ష్మి. ‘మీ అందరి స్నేహాన్ని నేను పొందగలిగానంటే ఫేస్బుక్కే కారణం. అంతేకాదు నాలో ఉన్న రచనాసక్తిని వెలికితీసి కథలు రాయగలిగేలా చేసిందీ ఈ గ్రూప్లే. పదాల పందిరి లాంటి ఆటలను పరిచయం చేశాను’ అని తన జ్ఞాపకాన్ని పంచుకుంది నండూరి సుందరీనాగమణి. ‘తీరిక సమయాల్లో కుట్లుఅల్లికలతో కాలక్షేపం చేస్తున్న నేను పిల్లల చదువుకోసం ఇంటర్నెట్ను పరిచయం చేసుకున్నాను. పచారీ కోసం దినుసుల పేర్లు రాయడం తప్ప ఇతర రాతలు అలవాటు లేని నేను ఇంటర్నెట్ పుణ్యమాని బ్లాగ్ రైటర్గా మారాను. దినపత్రికల్లో ఫుడ్కాలమిస్ట్గా.. చివరకు కథారచయిత్రిగా, పబ్లిషర్గా ఎదిగాను. అంతర్జాల పత్రికకు సంపాదకురాలినయ్యాను. ఇలా ఇంటర్నెట్ వల్ల నా కన్నా ఎక్కువ ఉపయోగపడినవారు లేరనుకుంటా’ అంటూ చర్చకు ముగింపు పలికారు రచయిత్రి జ్యోతి వలబోజు. - సరస్వతి రమ