breaking news
adultery Relationship
-
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్జాదా హెచ్చరించారు. -
వివాహేతర సంబంధం..పెట్రోల్ పోసి...
అతనో ఆర్ఎంపీ వైద్యుడు. పెళ్లి కూడా అయింది. క్లినిక్కు తరుచుగా వచ్చే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం యువతి బంధువులకు తెలియడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. చేసేది లేక ఆమెను రెండో భార్యగా చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో కుటుంబకలహాలు మొదలయ్యాయి. దీంతో అప్పుడప్పుడు కలుసుకుంటున్న మాదిరిగానే ఆదివారం కూడా రెండో భార్యను కలిశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. యువతి ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగెడుతుండగా కర్రతో తలపై మోది అతికిరాతంగా చంపాడు. ఈ హృదయ విదారక సంఘటన ఆదివారం ఉదయం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో జరిగింది. రామన్నపేట(నకిరేకల్) : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షుకూర్ అనే వ్యక్తి రామన్నపేటకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వివాహం అనంతరం కొండమల్లేపల్లిలోనే గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్ఎంపీగా ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో గుంటూరుకు చెందిన షమీనా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. తరచుగా క్లినిక్కు వస్తుండంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం షమీన బంధువులకు తెలియడంతో పెళ్లిచేసుకోవాలని షుకూర్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో షుకూర్ ఆమెను 2017 ఏప్రిల్లో రెండో వివాహం చేసుకున్నాడు. విషయం మొదటి భార్యకు, ఆమె తల్లిదండ్రులకు తెలవడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి.మొదటి భార్య తరఫు బంధువుల ఒత్తిడి మేరకు షుకూర్ 5నెలల క్రితం తన మకాంను రామన్నపేటకు మార్చాడు. రామన్నపేట పాతబస్టాండ్ ఆవరణలో ఆయూస్ క్లినిక్ను తెరిచి వైద్య సేవలు అందిస్తున్నాడు. షుకూర్ రామన్నపేటకు వచ్చిన తర్వాత కూడా రెండో భార్యతో ఫోన్లో టచ్లో ఉన్నాడు. రెండు పర్యాయాలు ఆమె రామన్నపేటకు వచ్చి అతనిని కలిసి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం పదిగంటల సమయంలో షమీనా మండలంలోని ఇంద్రపాలనగరం శివారులోకి రాగా, షుకూర్ బైక్పై అక్కడికి వెళ్లాడు. రోడ్డుకు కొద్దిదూరంలో వ్యవసాయ బావి భూమిలోని చింతచెట్టుకు కింద కలుసుకున్నారు. ఆ సమయంలో వారి ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. షుకూర్ తనవెంట తీసుకువచ్చిన బాటిల్లోని పెట్రోల్ను ఆమెపై చల్లి లైటర్తో నిప్పంటించాడు. ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా తలపై కర్రతో బలంగా మోదడంతో అక్కడే కుప్పకూలిపోయింది. చుట్టు పక్కల రైతులు గమనించి మంటలను చూసి అరుపులను విని పరుగెత్తుకుంటూ వచ్చి 108కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రథమచికిత్స అనంతరం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షమీనా మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న సీఐ ఎన్.శ్రీనివాస్, ఎస్ఐ బి.నాగన్నలు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
వివాహేతర సంబంధం నేరం కాదు
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు గురువారం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దుచేసుకోవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును సామాజిక కార్యకర్తలు, పలువురు న్యాయవాదులు స్వాగతించారు. ఈ పురాతన చట్టాన్ని ఎప్పుడో రద్దు చేయాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు, వివాహేతేర సంబంధాలను నేరం కాదని ప్రకటించడం.. అక్రమ సంబంధాలకు అనుమతి ఇచ్చినట్లేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఐపీసీ సెక్షన్ 497ను ప్రవాస భారతీయుడు జోసెఫ్ షైన్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ సెక్షన్ ప్రకారం శిక్ష విషయంలో స్త్రీపురుషుల మధ్య వివక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. విడాకులకు కారణంగా చూపొచ్చు.. ‘ఇది ఏకపక్ష, నిరంకుశమైన పురాతన చట్టం. మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాల కల్పనను అతిక్రమించేలా ఉంది’ అని భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లో వివాహేతర సంబంధాల్ని నేరంగా పేర్కొంటున్న సెక్షన్ 497ను కొట్టివేస్తూ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళలను వేరుగా పరిగణించడం రాజ్యాంగ ఉల్లంఘేనని, స్వతంత్రత అనేది గౌరవప్రదమైన మానవ మనుగడలో భాగమని, అయితే సెక్షన్ 497 మహిళలకున్న ఎంపిక స్వేచ్ఛను హరిస్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినప్పటికీ.. దానిని సామాజికంగా తప్పుగా పరిగణించడాన్ని కొనసాగించాలని, వివాహ రద్దు లేదా విడాకులకు దానిని పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ‘వివాహేతర సంబంధాల్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ 497, వివాహానికి వ్యతిరేకంగా నేరాభియోగాలకు సంబంధించి సీఆర్పీసీలోని 198 సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమని మేం ప్రకటిస్తున్నాం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించారు. మహిళలను తక్కువగా చూసే ఏ నిబంధన కూడా రాజ్యాంగబద్ధం కాదని, మహిళకు భర్త యజమాని కాడని చెప్పే సమయం ఆసన్నమైందని జస్టిస్ ఖన్విల్కర్ పేర్కొన్నారు. సెక్షన్ 497 అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని స్పష్టంగా తెలుస్తోందని, దీనిని కొనసాగించడం సమర్ధనీయం కాదని ధర్మాసనంలోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా మల్హోత్రా తీర్పునిచ్చారు. ‘మహిళల గౌరవానికి భంగం కలిగించడంతో పాటు దానిని హరిస్తుందని, మహిళల్ని పురుషుల ఆస్తిగా పరిగణిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది’ అని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. వైవాహిక జీవితంలో అసంతృప్తికి వివాహేతర సంబంధాలు కారణం కాదని, వైవాహిక జీవితంలో అసంతృప్తి వల్లే ఇలాంటి సంబంధాలు తలెత్తుతున్నాయని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు. సమానత్వం అనేది రాజ్యాంగంలోని ప్రధాన అంశమని.. అయితే ఐపీసీలోని సెక్షన్ 497 మహిళల్ని పరిగణించే విధానం నిరంకుశత్వమని అన్నారు. వైవాహిక వ్యవస్థ పవిత్రతకు దెబ్బ.. ఈ కేసులో వాదనలు వినిపించిన ప్రభుత్వం.. ఈ చట్టంలో సవరణలు చేస్తే వైవాహిక వ్యవస్థ పవిత్రత దెబ్బతింటుందని, అది సమాజంపై చెడుభావం చూపిస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా తీర్పును స్వాగతిస్తూ.. 497 సెక్షన్ను ఎప్పుడో తొలగించాల్సిందని నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ చీఫ్ రేఖా శర్మ అన్నారు. ‘ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టం.. బ్రిటన్ దీనిని ఎప్పుడో రద్దు చేసినా.. మనం మాత్రం కొనసాగించాం’ అని పేర్కొన్నారు. మహిళలను పురుషుల ఆస్తిగా భావించే వారి విషయంలో వివక్ష చూపుతున్న ఈ సెక్షన్ను రద్దు చేయాలని జాతీయ మహిళా కమిషన్ గతంలో సిఫారసు చేసింది. పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరోగమన చర్య అవుతుంది: జస్టిస్ మిశ్రా ‘వరకట్న వేధింపులు, గృహ హింసతో పోలిస్తే వివాహేతర సంబంధం పూర్తిగా భిన్నమైనది. వివాహేతర సంబంధాన్ని నేరంగా భావిస్తే...అప్పటికే వైవాహిక జీవితం పట్ల సంతృప్తిగా లేని వారికి మరింత శిక్ష విధించినట్లవుతుంది. వివాహేతర సంబంధాన్ని నేర కోణంలోనే చూడటం తిరోగమన చర్య అవుతుంది. రాజ్యాంగం, చట్టాల్లో వచ్చిన ఎన్నో మార్పులను కోర్టు చూసింది. వెనక్కి వెళ్తున్న టైమ్ మెషిన్లో కూర్చుని మరో యుగానికి వెళ్లాలనుకోవడం సరికాదు’ తండ్రితో విభేదించారు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తండ్రి, మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ గతంలో ఇచ్చిన తీర్పుతో మరోసారి విభేదించారు. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 497ను గతంలో వైవీ చంద్రచూడ్ సమర్థించగా, తాజాగా డీవై చంద్రచూడ్ తోసిపుచ్చారు. గతేడాది ఆగస్టులో గోప్యతా హక్కు ప్రాథమిక హక్కే అని తీర్పునిస్తూ జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తండ్రి అభిప్రాయాలను తోసిపుచ్చారు. తాజాగా, వివాహేతర శృంగారం నేరం కాదని తేల్చిన బెంచ్లో సభ్యుడైన జస్టిస్ డీవై.. 1985 నాటి సౌతి విష్ణు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తన తండ్రి ఇచ్చిన తీర్పుతో విభేదించారు. ‘సౌమిత్రి విష్ణు కేసులో.. సెక్షన్ 497పై ప్రభావం చూపే రాజ్యంగ పరిధిలోని విషయాలను విస్మరించారు. సమానత్వపు హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అన్నింటికి మించి లింగ సమానత్వ హక్కు సమాజానికి ఆధారం’ అని డీవై తీర్పులో చెప్పారు. జస్టిస్ డీవై చంద్రచూడ్, వైవీ చంద్రచూడ్ వివాహేతర సంబంధాలు ఈ దేశాల్లో నేరం.. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఇరాన్, మాల్దీవులు, నేపాల్, పాక్, ఫిలిప్పైన్స్, యూఏఈ, అల్జీరియా, కాంగో, ఈజిప్టు, మొరాకో, నైజీరియా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఈ దేశాల్లో నేరం కాదు.. చైనా, జపాన్, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, బార్బడోస్, బెర్ముడా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, ద. కొరియా, గ్వాటెమాలా సెక్షన్ 497 ఏం చెబుతోంది.. భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది. ‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం’ అని ఆ సెక్షన్ నిర్వచిస్తోంది. ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష కాని, జరిమానా కాని లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు. ‘తప్పుడు’ భర్తలకే ఉపశమనం! న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలు నేరం కాదన్నసుప్రీం తీర్పు కొందరు తప్పుడు భర్తలకు ఉపశమనం కలిగించగా, కొందరు అమాయకపు భర్తలకు కంటకంగా మారింది. వివాహేతర సంబంధ ఆరోపణలతో భార్య కేసు పెట్టడంతో పుణేకు చెందిన ఐటీ ఉద్యోగి తన పిల్లలకు దూరమయ్యాడు. ఉద్యోగ అవకాశాలు కోల్పోయాడు. న్యాయ ప్రక్రియలో రూ.4 లక్షలు ఖర్చుపెట్టాడు. తన భార్య చేసిన ఆరోపణలు అబద్ధమని, ఇన్నాళ్లూ తాను అనుభవించిన మానసిక క్షోభ నిజమని, కోర్టు తీర్పు ఉపశమనం కలిగించిందని ఆయన అన్నారు. ఇక ఢిల్లీకి చెందిన ఓ వైద్యుడిది కూడా సుమారు ఇలాంటి కథే. తన భార్య వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉందని గుర్తించాక, ఆమెనే అతనిపై వ్యభిచార కేసు పెట్టడం గమనార్హం. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ఈ ఇద్దరు హర్షం వ్యక్తం చేశారు. తాజా తీర్పుకు ఇది ఒక పార్శ్వమే. వివాహేతర సంబంధాలపై సుప్రీం తీర్పు తమ జీవితాలను మరింత దుర్భరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న అమాయకపు భర్తలు కూడా ఉన్నారు. అందులో బెంగళూరుకు చెందిన 45 ఏళ్ల చైతన్య గౌడ ఒకరు. తన భార్య అక్రమ సంబంధంపై ఆయన 8 ఏళ్లుగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఆమె విటుడి భార్యతో కేసు పెట్టించాలని యోచిస్తున్నారు. కోర్టు తాజా తీర్పుతో.. ఆ కేసు నిలబడేందుకు అవకాశాల్లేవు. తన లాంటి వారి జీవితాలను ఈ తీర్పు మరింత కుదిపేస్తుందని గౌడ విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన ఐటీ నిపుణుడు దేవ్జ్యోతి దాస్(42) కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. తన భార్యకు ఇతరులతో లైంగిక సంబంధాలున్నాయని, అందుకు సంబంధించి రెండేళ్లుగా సేకరిస్తున్న ఆధారాలు బూడిదలో పోసిన పన్నీరు అయిందని ఆయన వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పును మహిళా సాధికారత కోణంలోనే చూస్తున్నారని, కుటుంబ సాధికారత అనే మరో అంశం కూడా ఉందని సేవ్ ది ఫ్యామిలీ అనే ఎన్జీవో అధ్యక్షుడు రాజేశ్ వాకారియా అన్నారు. -
వ్యభిచార వ్యతిరేక చట్టం ఉండాల్సిందే
న్యూఢిల్లీ: అక్రమ సంబంధాలను నేరంగా పరిగణిస్తున్న చట్టాన్ని రద్దుచేస్తే వివాహ పవిత్రత దెబ్బతింటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అఫిడవిట్ సమర్పించింది. ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడు శిక్షార్హుడవుతాడు. ఈ సెక్షన్ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం కోరింది. సెక్షన్ 497 వివాహ వ్యవస్థను కాపాడుతోందని అఫిడవిట్లో పేర్కొంది. ‘ఐపీసీ సెక్షన్ 497, సీఆర్పీసీ సెక్షన్ 198(2)ల రద్దు.. వైవాహిక వ్యవస్థ, పవిత్రతకు ప్రాధాన్యమిస్తున్న భారతీయ సంప్రదాయ విలువలకు కీడు చేస్తుంది. భారతీయ సమాజం, విశిష్టతలను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని రూపొందించారు’ అని తెలిపింది. -
హత్యకేసును ఛేదించిన పోలీసులు
ప్రియురాలి మోజులో పడి భార్యను హత్య చేసిన భర్త హత్నూర : వేరొక మిహ ళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఈ సంఘటన మండలంలోని గోవిందరాజ్పల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్ల, సీఐ రాంరెడ్డిలు విలేకరులకు వివరించారు. పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన చాకలి మల్లేశం చిన్న కుమార్తె మహేశ్వరి (21)ని హత్నూర మండలం గోవిందరాజ్పల్లి గ్రామానికి చెందిన చాకలి పోచయ్య కుమారుడైన చాకలి గోపాల్ తో 2014 మార్చి 29న కట్న కానుకలు ఇచ్చి వివాహం చేశారు. అయితే అప్పటికే గోపాల్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. దీంతో పెళ్లి అయిన కొన్ని రోజుల నుంచే మహేశ్వరిని వేధిస్తూ కొట్టేవాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు గ్రామంలో పంచాయితీ పెట్టి మహేశ్వరిని సంసారానికి పంపారు. అయినా గోపాల్ ప్రవర్తనలో మార్పు రాకపోగా.. ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. ఈనెల 16న రాత్రి ఇంట్లో తల్లి, తమ్ముడు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన గోపాల్ భార్య మహేశ్వరిని కొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోవడంతో గొంతునులిమి గుడ్డతో ఉరేసి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మరుసటి రోజు రాత్రి (17వ తేదీ) గ్రామ శివారులోని నీటి గుంటలో పూడ్చివేశాడు. 18న తన భార్య కనిపించడం లేదంటూ గ్రామంలో ప్రచారం చేశాడు. భార్య మహేశ్వరి లెటర్ రాసిన విధంగా తనకు సంసారం చేయడం ఇష్టం లేదని ఒక లేఖను కూడా గోపాల్ సృష్టించాడు. 19న గ్రామస్తులు పలువురు మృతురాలి తండ్రి మల్లేశంకు ఫోన్ చేసి మీ కుమార్తె మహేశ్వరి రెండు, మూడు రోజులుగా కనిపించడం లేదని సమాచారం ఇచ్చారు. కుమార్తె ఆచూకీ కోసం తండ్రి మల్లేశం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం సాయంత్రం హత్నూర పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో స్థానిక పోలీసులు మంగళవారం ఉదయం మహేశ్వరి భర్త గోపాల్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. తానే భార్యను చంపానని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. దీంతో నీటి గుంతలో పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. గోపాల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ ప్రమోద్కుమార్ కూడా ఉన్నారు. కాగా అదనపు కట్నం కోసం తన కుమార్తె మహేశ్వరిని అల్లుడు గోపాల్ వేధించేవాడని, అందులో భాగంగానే తన కుమార్తెను హత్యచేశాడని మల్లేశం ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.