acqua
-
న్యూ ట్రెండ్.. ఆక్వా వర్కౌట్స్ : ప్రయోజనాలెన్నో!
పొద్దున్నే లేచి వ్యాయామం కోసం జిమ్కి వెళదామని ట్రాక్ సూట్, షూ ధరించేలోగానే చెమట్లతో తడిపేసే సీజన్ ఇది. అందుకే నగరవాసులు నీటి అడుగునే జిమ్దగీకి జై కొడుతున్నారు. చల్లని నీటిలో ఓ వైపు శరీరాన్ని చల్లబరుస్తూ.. మరోవైపు వ్యాయామాలు చేస్తూ సేదతీరుతున్నారు. ముంబై, బెంగళూర్ తదితర నగరాలతో పాటు భాగ్యనగరిలో కూడా ఆక్వా వర్కవుట్స్కి ఫిదా అవుతోంది నగర యువత. – సాక్షి, సిటీబ్యూరోపింగ్ జాక్లు, ఆర్మ్ లిఫ్ట్లు, లెగ్ కిక్స్, లెగ్ షూట్స్ ఇవన్నీ.. రోజూ జిమ్లో చేసేవే కదా అనుకోవచ్చు. అయితే అవన్నీ ఇప్పుడు నీటిలోనూ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు అనుసరిస్తున్న ఆక్వా వర్కౌట్లు/హైడ్రో ఎక్సర్సైజ్లు నగరంలోనూ ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. సిటీలో ఏప్రిల్, మే నెలల్లో ఆక్వా సంబంధిత వ్యాయామాలకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక కొత్తఎత్తయిన భవనాల్లోనూ, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ అందుబాటులో ఉన్న పూల్స్లో ఈ వ్యాయామాల సందడి కనిపిస్తోంది. ‘ఇది సాధారణ వ్యాయామాల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే నీటిలో ఉన్నప్పుడు కాళ్లూ, చేతుల కదలికలకు పరికరాల కదలికను జోడించడం సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో క్యాలరీలను బాగా ఖర్చు చేయడంలో ఇది సహాయపడుతుంది. నీటిలో సౌకర్యవంతంగా ఉన్నంత వరకూ (ఇది పూల్స్లో ఎక్కువ లోతులేని వైపు ఉంటుంది) ఈ ఫార్మాట్ అన్ని వయసుల వారికీ పని చేస్తుంది అని చెబుతున్నారు ఆక్వా ఫిట్ ఇన్స్ట్రక్టర్ కవితారెడ్డి. చదవండి : 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీవ్యాయామాలెన్నో.. ఆక్వా ఎరోబిక్స్ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు సిటీలో క్యాలరీలను బర్న్ చేసి రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడే అనేక నీటి ఆధారిత వ్యాయామాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఆక్వాటిక్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఆక్వా జుంబా, హెచ్ఐఐటీ, తబాటా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఆక్వా యోగా, కిక్–బాక్సింగ్ వంటి అనేక రకాలైన వర్కవుట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘డంబెల్స్, నూడుల్స్, ఆక్వా బాక్సింగ్ గ్లోవ్స్, రెసిస్టెన్స్ ట్యూబింగ్, వాటర్ వాకింగ్, ఆక్వా థ్రెడ్మిల్స్, వాటర్ బైక్లు ఇంకా ఎన్నో.. పరికరాలతో చేసేందుకు ఆక్వా వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయోజనాలెన్నో.. నీటి అడుగున వ్యాయామాలు బరువు తగ్గడానికి, కండరాలను టోన్ చేయడానికి, శక్తిని పెంచడానికీ సహాయపడతాయని అధ్యయనాలు నిరూపించాయి. తక్కువ అలసటతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. ఆర్థరైటిస్ రోగులకు ఇవి ఉత్తమమైనవి. అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఆక్వా వర్కౌట్లు గర్భిణులకు కూడా మంచిదని చెబుతున్నారు కవిత. ఈ వ్యాయామం వల్ల కీళ్లకు కూడా మేలైన రక్షణ ఉంటుంది. అందుకే సాధారణంగా గాయం నుంచి కోలుకునే క్రమంలో తరచూ హైడ్రో థెరపీని ఉపయోగిస్తారు. కార్డియో–ఇన్టెన్సివ్గా ఉంటాయి, గాలి కంటే నీరు 13 రెట్లు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి నీటి వ్యాయామాలు మరింత పటిష్టంగా ఉంటాయి. నేలమీది వ్యాయామం కంటే ఎక్కువ నిరోధకతను అందిస్తాయి. ఇది ఒక గంటలో 500–1,200 క్యాలరీలు బర్న్ చేయగలదు. నీటిలో ఉన్నప్పుడు శరీర బరువులో 10 శాతం మాత్రమే బరువు కలిగి ఉంటారు. కాబట్టి కీళ్ళు అన్లోడ్ చేయబడినట్లు అనిపిస్తుంది. నేల మీద మనం చేసే వ్యాయామాల్లో తప్పుడు కదలికల వల్ల లిగ్మెంట్స్ చిరిగిపోవడానికి /ఒత్తిడికి / బెణుకు లేదా పగుళ్లకు కారణమవుతుంది. నీటిలో వ్యాయామాల వల్ల గాయం అయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చికిత్స కోసం నీటి వ్యాయామాలు సిఫార్సు చేస్తారు. ఇది చురుకుదనం, వెయిట్లాస్ కోసం ప్రభావవంతంగా ఉంటాయి. కాలుతో త్రిభుజం ఆకారంలో ఉండే డెగేజ్ పాస్ వంటివి ఇందులో ఉన్నాయి. పూల్లో నీటి సాంద్రత కాలుని ఎక్కువ దూరం కదపడానికి సహాయపడుతుంది. చదవండి : వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!కొన్ని సూచనలు మాయిశ్చరైజర్ని అప్లై చేయడం స్విమ్మింగ్ క్యాప్ ధరించడం ద్వారా చర్మం, జుట్టుకు క్లోరిన్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కళ్లను రక్షించడానికి నీళ్లు కంట్లో కలిగించే చికాకును నివారించడానికి గాగుల్స్ ధరించాలి.నిదానంగా వ్యాయామం ప్రారంభించి కొంచెం కొంచెంగా తీవ్రతను పెంచాలి. శ్వాసను ఎక్కువసేపు బిగబట్టుకోవద్దు. నీటి అడుగున కఠినమైన విన్యాసాలు చేయవద్దు. నైపుణ్యం, స్థాయి, సామర్థ్యానికి తగిన వ్యాయామాలు మాత్రమే చేయాలి.సరైన శిక్షణ పర్యవేక్షణలో ఉంటే తప్ప అధునాతన వర్కవుట్స్ ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అనుభవం లేకుంటే డైవింగ్ లేదా ఫ్లిప్ చేయడం మంచిదికాదు. అన్ని సీజన్స్లోనూ ఆరోగ్యకరమే.. ఈ వర్కవుట్ కేవలం వేసవిలో మాత్రమే కాదు అన్ని కాలాల్లోనూ ప్రయోజనకరం. బెంగళూరులో ఉన్నప్పుడు వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారంగా ఎంచుకున్న ఈ వ్యాయామం నగరానికి వచి్చన తర్వాత నాకు పూర్తి స్థాయి ప్రొఫెషన్గా మారింది. దీని కోసం సింగపూర్లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఏరోబిక్ అండ్ ఫిట్నెస్ (ఫిసా) కోర్సును చేశాను. ప్రస్తుతం నగరంలోని జూబ్లీహిల్స్లో ఉన్న స్ట్రోక్స్తో పార్ట్నర్గా ఆక్వా వర్కవుట్స్లో సిటిజనులకు శిక్షణ అందిస్తున్నాను. ఈ వ్యాయామాల లాభాలపై అవగాహన మరింత పెరిగితే అది మరింతమందికి మేలు కలిగిస్తుంది. – కవితారెడ్డి, ఆక్వా ఫిట్ శిక్షకురాలు -
’నీలి’ నాగు
సాగు, తాగునీరు కలుషితం కాలువలు, చెరువుల్లోకి వ్యర్థ నీరు డెల్టాలో దుస్థితి దెబ్బతింటున్న నారుమళ్లు రైతులు, ప్రజలు బెంబేలు పట్టించుకోని అధికారులు డెల్టాపై నీలినాగు పడగ విప్పింది. ఆక్వా సాగు(నీలివిప్లవం) చాపకింద నీరులా పాకుతోంది. అనుమతి లేకుండా రొయ్యల సాగు యథేచ్ఛగా జరుగుతోంది. అక్రమార్కులు చెరువుల్లోని కాలుష్య నీటిని పంటకాలువల్లోకి తోడేస్తుండడంతో సాగు, తాగునీరు కలుషితమవుతోంది. ఫలితంగా వరి నారుమళ్ల దశలోనే దెబ్బతింటోంది. తాగునీటి చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ఆకివీడు : పశ్చిమడెల్టా ఒకప్పుడు పైరు పచ్చని సీమ. ధాన్యాగారం. సుమారు ఆరు లక్షల 20వేల ఎకరాల్లో విస్తరించిన ఈ ఆయకట్టులో ఎంత కష్టించినా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయి పెట్టుబడి దక్కకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు నిరాశజనకంగా ఉండడంతో రైతులు వరి సాగు నుంచి నీలి విప్లవం(ఆక్వా సాగు) వైపు అడుగులు వేశారు. ఫలితంగా పొలాలు చేలుగా మారాయి. ప్రస్తుతం ఆయకట్టులో సుమారు 54వేల ఎకరాలు చేపలు చెరువులు ఉన్నాయి. మరో లక్ష ఎకరాల్లో చేపల చెరువుల పేరిట అనధికారికంగా రొయ్యల సాగు జరుగుతోంది. ఇవికాక అనుమతి పొందిన రొయ్యల చెరువులు 15వేల ఎకరాలు ఉన్నాయి. పడగ విప్పిన కాలుష్యం ఆక్వా చెరువుల వల్ల కాలుష్యం పడగ విప్పింది. ముఖ్యంగా రొయ్యల చెరువుల నుంచి వెలువడే వ్యర్థ ఉప్పునీరు వల్ల అనర్థం జరుగుతోంది. చెరువుల సాగుదారులు వ్యర్థనీటిని మురుగు కాలువల్లోకి వదలాల్సి ఉండగా, అలా చేయకుండా యథేచ్ఛగా పంట కాలువల్లోకి తోడేస్తున్నారు. ఫలితంగా 11 పంట కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ ప్రభావం సాగు, తాగునీటిపై పడుతోంది. పంట కాలువల్లోని ఉప్పునీరు వరి పొలాల్లోకి చొచ్చుకెళ్లి నారుమళ్లు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం డెల్టా వ్యాప్తంగా సుమారు 50వేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నట్టు అంచనా. అలాగే డెల్టాలోని తాగునీటి చెరువులకు పంట కాలువల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. దీనివల్ల 300 తాగునీటి చెరువులూ కాలుష్య కాసారాలుగా మారుతున్నట్టు సమాచారం. ఈ నీటిని శుద్ధిచేసినా.. స్వచ్ఛ తాగునీరు సరఫరా సాధ్యం కావడం లేదని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పంచాయతీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే డెల్టాలో ప్రజల మనుగడే ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కాలువల వ్యవస్థ మారాలి కాలుష్యం నుంచి తప్పించుకోవాలంటే ముఖ్యంగా డెల్టాలోని కాలువల వ్యవస్థను మార్చాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. చేపలు, రొయ్యల చెరువులకు ప్రత్యేకంగా మురుగు బోదెలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. దీనికోసం అధికారులు తక్షణం చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేయాలి గోదావరితోపాటు, ప్రధాన పంట కాలువలు పూర్తిగా కాలుష్యానికి గురయ్యాయి. డెల్టాకు వచ్చే 11 కాలువల్లోకి మురుగునీరు, ఫ్యాక్టరీల వ్యర్థ నీరు చొచ్చుకువస్తోంది. రాజమండ్రి నుంచి ప్రధాన మురుగు కాలువ నీరు గోదావరిలోకి రావడం వల్ల ఆ నీరు దిగువ ప్రాంతమైన పశ్చిమ డెల్టాకు సరఫరా అవుతోంది. కాలుష్యం బారి నుంచి కొంతైనా బయటపడేందుకు తాగునీటి కోసం ప్రత్యేక పైప్లైన్లు డెల్టా అంతా ఏర్పాటు చేసి, చెరువుల్లోకి అమర్చాలి. దీనికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. దీనిని సర్కారు దృష్టికి తీసుకెళ్తాం. ఎం.వి.సూర్యనారాయణరాజు, పర్యావరణ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు. మురుగు కాలువల్లోకే వదలాలి ఆక్వా చెరువుల్లోని వ్యర్థ నీటిని మురుగు కాలువల్లోకే వదలాలి. డెల్టాలో 1.54 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది.15 వేల ఎకరాల్లో మాత్రమే అనుమతి పొందిన రొయ్యల చెరువులు ఉన్నాయి. అనుమతి లేని చెరువులపై సర్వే జరుగుతోంది. ఫణి కిషోర్, డిప్యూటీ డైరెక్టర్, నీటిపారుదల శాఖ, భీమవరం. -
’ఆక్వా’రిష్టం
బరితెగిస్తున్న మాఫియా అన్నదాతకు తీరని నష్టం మామూళ్ల మత్తులో అధికారులు జిల్లాలోని అన్నదాతలకు ’ఆక్వా’రిష్టం దాపురించింది. పచ్చని చేలు అక్రమార్కుల ధన దాహానికి చెరువులుగా మారిపోతున్నాయి. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులూ వంతపాడుతున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆక్వా మాఫియా బరితెగిస్తోంది. అనుమతులు లేకుండానే వేలాది ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకం సాగిస్తోంది. తర్వాత వాటిని రొయ్యల చెరువులుగా మార్చేస్తోంది. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వేలాది ఎకరాల్లో అక్రమంగా రొయ్యలసాగు జరుగుతోంది. వీటి నుంచి పంట కాలువల్లోకి విడుదలవుతున్న కాలుష్య నీరు పొలాలను ముంచెత్తుతోంది. తాజాగా నిడమర్రు మండలంలోని అడవికొలనుతోపాటు పలుగ్రామాల్లో వేలాది ఎకరాల్లో రబీ నారుమళ్లు, నాట్లు వేసిన పొలాలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన వారంతా కౌలురైతులే. నారుమళ్ల కోసం ఆ రైతులు రూ.ఐదువేల నుంచి రూ.పదివేల వరకూ ఖర్చుచేశారు. ఈ ఖర్చంతా నీటిపాలైంది. పంట కాలువలూ పచ్చగా మారాయి. దీనిపై రైతులు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మత్య్సశాఖ ఉన్నతాధికారులు వచ్చి చూసి వెళ్లారు. అయినా అక్రమార్కులపై చర్యలు లేవు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అండదండలు ఉండటం వల్లే అక్రమార్కులను అధికారులు ఏం చేయలేకపోతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. నిడమర్రు మండలంలో ఉన్నన్ని అనధికారిక చెరువులు జిల్లాలో ఎక్కడా లేవు. ప్రభుత్వ అన్ సర్వే భూములనూ చెరువుల్లో అక్రమార్కులు కలిపేసుకున్నట్టు సమాచారం. అడవికొలనులో 85 సెంట్ల ప్రభుత్వ భూమినీ కలిపేసుకుని కొందరు చెరువులు తవ్వేసుకున్నారు. పెదనండ్రకొలను, అడవికొలను గ్రామాల్లో ఎక్కువగా ప్రభుత్వ భూములను చెరువులుగా మార్చేశారు. సాధారణంగా చేపల చెరువులకు రెండు అనుమతులు ఉంటాయి. తాత్కాలిక అనుమతితో చెరువు తవ్వుకోవచ్చుగానీ, నీరు నింపే అవకాశం లేదు. శాశ్వత అనుమతి వస్తేనే చేపల పెంపకానికి అనుమతి ఉంటుంది. అయితే తాత్కాలిక అనుమతులతోనే అక్రమార్కులు చేపల చెరువులు తవ్వేసి వాటిని తర్వాత రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. అసలు రొయ్యల చెరువుల తవ్వకానికి ప్రభుత్వ అనుమతులు లేవు. కానీ నిడమర్రు మండలంలో చేపల, రొయ్యల సాగు యథేచ్ఛగా సాగుతోంది. వీటిల్లో పట్టుబడి కోసం నీటిని వదిలివేయడంతో చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. నీళ్లు ఒక్కసారిగా వదలడంతో చాలాచోట్ల నారుమళ్లు నీట మునిగి కుళ్లిపోయాయి. అడవికొలను గ్రామం కలందకోడు పాయ, దొంగపర్రు, దాళ్వాపర్రిపాయల్లో నారుమళ్లు మొత్తం నాశనమైపోయాయి. దాదాపు రెండువేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నాయి. నాట్ల దశకు చేరుకున్న నారు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలు ఉండడంతోపాటు రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడం వల్లే ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిడమర్రుతోపాటు అడవికొలను, పెదనిండ్రకొలనుల్లో చేపల చెరువులుగా మారిన అత్యధిక పొలాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ప్రధాన రహదారికి పక్కనే రొయ్యల సాగు జరుగుతున్నా.. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా.. ఇదేమిటని అడిగే నాథుడే లేకుండా పోయాడు. ప్రశ్నించిన రైతులకు ఆక్వా మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు పడతారంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నారుమళ్లు నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. నారుమళ్లు నష్టపోవడంతో ఇప్పుడు వేరే చోట నారు కొని తెచ్చి నాట్లు వేసినా ఆ తర్వాత చెరువుల నుంచి కలుషిత నీరు వదిలితే ఏం చేయాలోనని మధనపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. . -
యాంటీ బయోటిక్స్ వాడితే కొనుగోలు చేయం
భీమవరం : రొయ్యల పెంపకంలో యాంటీ బయోటిక్స్ వాడినట్టు గుర్తిస్తే ఈనెల 5వ తేదీ నుంచి కొనుగోలు నిలిపివేయనున్నట్టు ఆక్వా ఎక్స్పోర్టర్స్ ప్రకటించారు. భీమవరంలో ఆదివారం యాంటీ బయోటిక్స్ వాడకంపై ఆక్వా రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు ఆక్వా ఎక్స్పోర్టర్స్ మాట్లాడారు. ప్రస్తుతం మన దేశం నుంచి యూఎస్ఏకు రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయన్నారు. మనం ఉత్పత్తి చేసే రొయ్యలు గతంలో 25 శాతం యుఎస్ఏకు ఎగుమతి అయితే ప్రస్తుతం ఆశాతం 45కు పెరిగిందన్నారు. మిగిలిన సరుకు థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. రొయ్యల్లో యాంటిబయోటెక్స్ కనిపిస్తున్నందున మన రొయ్యలను దిగుమతి చేసుకునే దేశాలు అభ్యంతరం చెబుతున్నాయని అక్కడికి వెళ్లిన రొయ్యల కంటైనర్స్ తిరిగి రావడం వల్ల తీవ్రంగా నష్టపోతామని అందువల్ల ఇక్కడే యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించి రొయ్యల కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సమష్టిగా నిలిపేయాలి రొయ్యల కొనుగోలుదారుల నేషనల్ కమిటీ సభ్యుడు తోట జగదీష్ మాట్లాడుతూ రొయ్యలసాగులో యాంటీ బయోటిక్స్ వాడకం వల్ల ఎక్కువగా నష్టపోయేది రైతులేనని, అయితే రైతులు నష్టపోతే మొత్తం ఆక్వారంగానికే చేటు కలుగుతుందన్నారు. ఏపీ రీజియన్ ప్రెసిడెంట్ ఎ.ఇంద్రకుమార్ మాట్లాడుతూ రొయ్యలు సాగుచేసే రైతులంతా సమష్టిగా యాంటి బయోటిక్స్ వాడకాన్ని నిలిపివేస్తేనే ఆక్వారంగానికి మనుగడ ఉంటుందన్నారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ యిర్రింకి సూర్యారావు మాట్లాడుతూ ఇటీవల రొయ్యల ధర ఆశాజనకంగా ఉండడంతో పెద్దగా ఇబ్బందులు లేవని తక్కువ కౌంట్æరొయ్యలను కూడా అధికధరకు కొనుగోలు చేయడం వల్ల రైతులు నష్టాలు లేకుండా బయటపడుతున్నారన్నారు. దిగుమతులు నిలిచిపోతే ఆక్వా రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులనే బాధ్యులను చేయడం సరికాదు కొణితివాడ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణరాజు మాట్లాడుతూ యాంటిబయోటిక్స్ వాడకంపై కేవలం రైతులను నష్టపర్చే విధంగాకాకుండా హేచరీలు, మేతలు, మందుల తయారీ కంపెనీలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్నారు. టెక్నీషియన్స్ కూడా రైతులను చైతన్యవంతం చేయాలని కోరారు. పాలకొల్లు మండలం తిల్లపూడి గ్రామానికి చెందిన రైతు ఇంటి శ్రీరాముడు మాట్లాడుతూ యాంటీబయోటెక్స్ వాడకంపై కేవలం రైతులను బాధ్యులను చేయడం భావ్యం కాదని హేచరీలు, మేతలు, మందుల తయారీ కంపెనీలపై ప్రభుత్వపరంగా దాడులు చేసి యాంటీబయోటిక్స్ను అరికట్టాలన్నారు. దీనికిగాను ఆక్వా ఎక్స్పోర్టర్స్ శ్రద్ధ తీసుకుని హేచరీ యజమానులు, రైతులు, మందులు, మేతల తయారీ కంపెనీలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలన్నారు. ఈ సదస్సులో ఆక్వాకల్చర్ కమిటీ నాయకులు సి.రాజగోపాలచౌదరి, వి.సత్యనారాయణరాజు, రమేష్వర్మ, జి.పవన్కుమార్, తదితరులు పాల్గొన్నారు.