రైల్వే ఎన్నికలకు రెడీ..!  | Ready For Railway Elections | Sakshi
Sakshi News home page

రైల్వే ఎన్నికలకు రెడీ..! 

Jun 12 2019 2:33 PM | Updated on Jun 12 2019 2:37 PM

Ready For Railway Elections - Sakshi

సాక్షి, రాజంపేట: భారతీయ రైల్వేలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రైల్వేకార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు  యాజమాన్యం రెడీ అవుతోంది. ఈమేరకు ఎన్నికలకు సంబంధించి మెంబర్‌షిప్‌ వెరిఫికేషన్‌కు అన్ని జోనల్‌ జనరల్‌ మేనేజర్లకు రైల్వేబోర్డు డైరెక్టరు డి.మల్లిక్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనేపథ్యంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిలకు రైల్వే యాజమాన్యం సన్నాహాలకు దిగినట్లే. రైల్వే బోర్డు ఆదేశాలతో ఆల్‌ ఇండియ రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌ఎఫ్‌)కు అనుబంధంగా ఉన్న సౌత్‌సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఐఆర్‌) సౌత్‌సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ నాయకత్వాలు జోన్, డివిజన్‌ల స్థాయిలో క్యాడర్‌ను సిద్ధం చేస్తోంది.


ఆగస్టులో ఎన్నికలు :
ఆగస్టులో భారతీయ రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి రాజుకోనున్నది. గుంతకల్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో జిల్లా వరకు నందలూరు, కడప రైల్వేకేంద్రాలలో మజ్దూర్‌ యూనియన్, ఎంప్లాయీస్‌ సంఘ్‌ బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాంచిల పరిధిలో రైల్వే ఉద్యోగులు, కార్మికులు ఈ ఎన్నికల్లో తమతమ సంఘాలను గెలిపించుకునేందుకు పోటీపడనున్నారు. రైల్వేబోర్డు ఆదేశాలతో కార్మిక సంఘాల నేతలు  ఇప్పటి నుంచి సన్నద్దులవుతున్నారు. 


2013లో ఎన్నికలు :
2013 ఏప్రిల్‌లో భారతీయ రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సౌత్‌సెంట్రల్‌ మజ్దూర్‌ యూనియన్‌ విజయఢంకా మోగించిన సంగతి విధితమే. ఆ ఎన్నికల్లో 46 శాతం ఓట్లను దక్కించుకుంది. జోన్‌ స్థాయిలో 86వేల ఓట్లలో 36వేల ఓట్లను ఎస్‌ఆర్‌ఎంయూ దక్కించుకుంది. ఎస్‌ఆర్‌ఎంయూ, సంఘ్‌కు సమానంగా వచ్చి రెండింటికి రిగ్నజైడ్‌ గుర్తింపు వచ్చింది. అయితే గుంతకల్‌ డివిజన్‌ స్థాయిలో ఎస్‌ఆర్‌ఎంయూకు 998 ఓట్ల మెజార్టీ వచ్చింది. 


సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా...
రైల్వే గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా పోలింగ్‌ నిర్వహించడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో నిర్వహించారు. కడప, నందలూరులో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో ఉన్న రైల్వే ఉద్యోగులు, కార్మికలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు ఇరు కార్మికసంఘాలు ప్రతిష్టాతక్మంగా తీసుకోనున్నాయి. గుంతకల్‌ డివిజన్‌ పరిధిలో 14వేల సభ్యులు ఉన్నారు. ఈ యేడాది ఈ సంఖ్యలో 20వేలలోపు చేరనున్నదని రైల్వే వర్గాలు అంటున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement