వాటే మ్యాచ్‌.. శెభాష్‌ టీమిండియా! | Twitter erupts after team India victory | Sakshi
Sakshi News home page

వాటే మ్యాచ్‌.. శెభాష్‌ టీమిండియా!

Mar 7 2017 5:11 PM | Updated on Sep 5 2017 5:27 AM

వాటే మ్యాచ్‌.. శెభాష్‌ టీమిండియా!

వాటే మ్యాచ్‌.. శెభాష్‌ టీమిండియా!

నగరంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది.

బెంగళూరు: నగరంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. కేవలం 188 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థి ముందు ఉంచిన కోహ్లి సేన 75 పరుగుల తేడాతో రెండో టెస్టును సొంతం చేసుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నాలుగో రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేయడంలో అశ్విన్‌ కీలకపాత్ర పోషించి.. హీరోగా నిలిచాడు. అతను ఏకంగా ఆరుగురు కంగారు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ బాట పట్టించాడు. అతనికి సహచర బౌలర్లు అండగా నిలిచారు. జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా మారిన అశ్విన్‌కు 5 వికెట్లకుపైగా తీసుకోవడం ఇది 25వ సారి. అంతేకాదు భారత గడ్డపై 200 వికెట్‌ను కూడా అతను ఇదే మ్యాచ్‌లో సొంతం చేసుకున్నాడు.

కంగారు జట్టులో స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, పీటర్‌ హ్యాండ్స్‌కంబ్‌ తదితరులు బ్యాటింగ్‌ లైనప్‌ను నిలబెట్టేందుకు ప్రయత్రించినా.. గింగిరాలు తిరుగుతున్న బంతి ముందు నిలదొక్కుకోలేకపోయారు. విశేషమేమిటంటే చివరి ఆరు వికెట్లు 11 పరుగుల తేడాతో కుప్పకూలాయి. మొదటి టెస్టులో దారుణ పరాభవాన్ని ఎదుర్కొని.. రెండో టెస్టులో మొదట కొంత తడబడి.. ఆ తర్వాత పుంజుకొని అద్భుత విజయాన్ని నమోదుచేసిన కోహ్లిసేనపై ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. 'చెక్‌ దే ఇండియా' అంటూ సీనియర్‌ క్రికెటర్లు, ప్రముఖులు టీమిండియాకు ప్రశంసలు అందజేశారు. సచిన్‌ టెండూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, మహమ్మద్‌ కైఫ్‌ తదితరులు కోహ్లి సేనను అభినందనలతో ముంచెత్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement