మార్కెట్‌కు ‘ఆర్‌బీఐ పాలసీ’ బూస్ట్..! | Sensex ends day 244 points up; all eyes on RBI policy | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు ‘ఆర్‌బీఐ పాలసీ’ బూస్ట్..!

Apr 7 2015 1:17 AM | Updated on Sep 2 2017 11:56 PM

మార్కెట్‌కు ‘ఆర్‌బీఐ పాలసీ’ బూస్ట్..!

మార్కెట్‌కు ‘ఆర్‌బీఐ పాలసీ’ బూస్ట్..!

రోజులో సగభాగం దశ, దిశా లేకుండా చలించిన స్టాక్ మార్కెట్ చివరి రెండు గంటల ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టింది.

  దూసుకుపోయిన ఫార్మా షేర్లు
  244 పాయింట్ల లాభంతో 28,504కు సెన్సెక్స్
  74 పాయింట్ల లాభంతో 8,660కు నిఫ్టీ


 
 రోజులో సగభాగం దశ, దిశా లేకుండా చలించిన స్టాక్ మార్కెట్ చివరి రెండు గంటల ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టింది. ఆర్‌బీఐ విధాన సమీక్ష నేపథ్యంలో మార్కెట్ లాభపడడం గమనార్హం.  ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ స్టాక్‌ల ర్యాలీతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 244 పాయింట్ల లాభంతో 28,504 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 8,660  పాయింట్ల వద్ద ముగిశాయి.   సెన్సెక్స్ నేటి ముగింపు రెండు వారాల గరిష్ట స్థాయి. మార్చిలో కొత్త ఆర్డర్ల కారణంగా తయారీ రంగం జోరు పెరగడం కూడా ప్రభావం చూపింది. గత శుక్రవారం వెలువడిన అమెరికా ఉద్యోగాల గణాంకాలు బలహీనంగా ఉండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను జూన్‌లో కూడా తగ్గించకపోవచ్చన్న అంచనాలు కూడా ట్రేడింగ్‌పై సానుకూల ప్రభావం చూపాయి.
 
  కాగా అమెరికాకు చెందిన ద మెడిసిన్స్ కంపెనీతో యాంజియోమ్యాక్స్ ఔషధానికి సంబంధించిన వివాదం పరిష్కారమైన నేపధ్యంలో సన్ ఫార్మా షేర్ దూసుకుపోయింది. సన్ ఫార్మా 8.3 శాతం లాభపడి రూ.1,168.5 వద్ద ముగిసింది. ఇది ఈ షేర్‌కు జీవిత కాల గరిష్ట స్థాయి. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. రక్తపోటు ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించడంతో టొరంట్ ఫార్మా 4 శాతం, అధిక రక్తపోటు ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం  లభించడంతో అరబిందో ఫార్మా 9 శాతం చొప్పున లాభపడ్డాయి.  సిప్లా 3.5 శాతం, డాక్టర్ రెడ్డీస్ 4.3 శాతం చొప్పున పెరిగాయి.
 
 కీలక రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తుందన్న అంచనాల కారణంగా బ్యాంకింగ్ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. సన్ టీవీకి చెందిన దయానిధి మారన్, కళానిధి మారన్‌లకు చెందిన రూ.743 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అటాచ్‌తో ఈ షేర్ 9.4 శాతం క్షీణించింది.  30 షేర్ల సెన్సెక్స్‌లో 19 షేర్లు లాభాల్లో, 11 షేర్లు నష్టాల్లో ముగిశాయి.  టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,938 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.17,040 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.1,53,504 కోట్లుగా నమోదైంది.
 
 క్యాపిటల్ మార్కెట్‌లో లావాదేవీలు
 బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ట్రేడింగ్
 విభాగం    తేదీ         కొనుగోలు    అమ్మకం    నికర విలువ
 డీఐఐ :    06-04    1,667    1,837     -170    
 ఎఫ్‌ఐఐ:     06-04    4,438    3,501    937    
         (విలువలు రూ.కోట్లలో)
 
 యాడ్‌ల్యాబ్స్‌కు  లిస్టింగ్ లాభాలు 6 శాతం లాభంతో రూ.191 వద్ద ముగింపు

ముంబై: థీమ్ పార్క్ నిర్వహించే యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ షేరు లిస్టింగ్ మొదటి రోజే మెరుపులు మెరిపించింది. నష్టంతో స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటికీ, చివరకు ఇష్యూ ధర(రూ.180తో) పోల్చితే బీఎస్‌ఈలో  6.2 శాతం లాభంతో రూ.191.25 వద్ద ముగిసింది. ఇష్యూ ధరతో పోల్చితే 6.6 శాతం నష్టంతో రూ.167.95 వద్ద లిస్టయిన ఈ షేర్ రూ.156.4, రూ.199 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. బీఎస్‌ఈలో 29 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 90 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. గత నెల 10న ఐపీఓకు వచ్చిన ఈ ఇష్యూ 1.1 రెట్లు ఓవర్  సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ రూ.376 కోట్లు సమీకరించింది. మొదటగా రూ.221-230 గా నిర్ణయమైన ప్రైస్‌బ్యాండ్‌ను ఇన్వెస్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో రూ.180-215కు తగ్గించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement