బిల్లు పెడితే మరో కురుక్షేత్రమే | Seemandhra MPs warn about Telangana Bill | Sakshi
Sakshi News home page

బిల్లు పెడితే మరో కురుక్షేత్రమే

Feb 13 2014 3:25 AM | Updated on Aug 18 2018 4:13 PM

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో పెడితే మరో కురుక్షేత్రమవుతుందని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నారు.

 సీమాంధ్ర టీడీపీ ఎంపీలు
 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో పెడితే మరో కురుక్షేత్రమవుతుందని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నారు. పార్లమెంటులో బిల్లును అడ్డుకోవడానికి పాండవుల్లా యుద్ధం చేస్తామన్నారు. ఎంపీలు సుజనాచౌదరి, మోదుగుల వేణుగోపాలరెడ్డి, సీఎం రమేష్, కె.నారాయణరావు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటును కాంగ్రెస్ కార్యాలయంగా మార్చారని వ్యాఖ్యానించారు. విభజన అనివార్యమైతే తాము కాదనబోమని, అయితే విభజన తీరే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్ పార్లమెంటులో అద్వానీ సహా పలు జాతీయ పార్టీల నేతలను కలసి ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనేత అద్వానీ సహా ఆ పార్టీ నేతలు ప్రధాని ఇంటికి విందుకు వెళ్లడం తప్పని చెప్పారు. ఏపీఎన్జీవోల బంద్‌కు మద్దతిస్తున్నట్లు వారు ప్రకటించారు.
 
 టీడీపీ ఎంపీల ధర్నాలు: తెలంగాణ, సీమాంధ్ర టీడీపీ ఎంపీలు బుధవారం పోటాపోటీగా ధర్నాలు చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ రమేష్ రాథోడ్, గుండు సుధారాణి, తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పార్లమెంటు ఎదుట ధర్నా చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, నారాయణ, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ శమంతకమణి తదితరులు పార్లమెంటు గేటు వద్ద ధర్నా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement