...సంపూర్ణం చేయాలి: ఏపీఎన్జీవోలు | Ashok babu calls Seemandhra bandh against Telangana bill | Sakshi
Sakshi News home page

...సంపూర్ణం చేయాలి: ఏపీఎన్జీవోలు

Feb 14 2014 2:38 AM | Updated on Mar 23 2019 9:03 PM

...సంపూర్ణం చేయాలి: ఏపీఎన్జీవోలు - Sakshi

...సంపూర్ణం చేయాలి: ఏపీఎన్జీవోలు

పార్లమెంట్‌లో గురువారం జరిగిన సంఘటనలు దురదృష్టకరమైనవని ఏపీఎన్‌జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యానించారు.

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో గురువారం జరిగిన సంఘటనలు దురదృష్టకరమైనవని ఏపీఎన్‌జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం సొంతపార్టీ ఎంపీలపై ఇతర రాష్ట్ర ఎంపీలతో దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలు నిరసిస్తూ శుక్రవారం సీమాంధ్ర బంద్‌కి పిలుపునిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఏకపక్షధోరణిని నిరసిస్తూ చేపట్టనున్న బంద్‌లో సీమాంధ్ర 13 జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చే స్తామని హెచ్చరించారు. ఢిల్లీలోని ఎంపీ లగడపాటి నివాసంలో గురువారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు.
 
-  ఎంపీల దాడిలో గాయపడిన సీమాంధ్ర టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు ఏదైనా జరిగితే సోనియాగాంధీ బాధ్యత వహించాలన్నారు.
-  ఓ వైపు సీమాంధ్ర ఎంపీలు, కొందరు కేంద్రమంత్రులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నా, కేంద్ర మంత్రులు కిశోర్‌చంద్రదేవ్, పనబాక లక్ష్మి, పల్లంరాజు కుర్చీలకే పరిమితం కావడం సిగ్గుచేటన్నారు.
-  రాష్ట్ర విభజన అంశం కేవలం ఏపీ సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా చూడాలని జాతీయ పార్టీలను ఆయన కోరారు. లేదంటే సీబీఐని వాడుతున్నట్టే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్-3ని వాడుకునే ప్రమాదం ఉందన్నారు.
-  పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడిని నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ శుక్రవారం చేపట్టిన బంద్‌కు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతు ప్రకటించింది.
- సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల మూకుమ్మడి సెలవు


 సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టటాన్ని నిరసిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు గురువారం మూకుమ్మడి సెలవు(మాస్ క్యాజువల్ లీవ్) పెట్టటంతో సచివాలయం బోసిపోయింది. పలు సెక్షన్లలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించనున్నట్లు సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నేతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement