తుదిఘడియల్లోనూ చేతిలో చెయ్యేసి..!

తుదిఘడియల్లోనూ చేతిలో చెయ్యేసి..! - Sakshi


58 ఏళ్ల వైవాహిక బంధం వారిది. చివరిక్షణంలో మృత్యువు కూడా వారిని వేరు చేయలేకపోయింది. ముగ్గురు పిల్లలతో నిండు సంసార జీవితాన్ని ఆస్వాదించిన ఆ జంట చివరిఘడియల్లోనూ పక్కపక్కనే పడుకొని.. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తుదిశ్వాస విడిచింది. టెక్సాస్‌లోని సాన్ అంటోనియోలో ఈ ఘటన జరిగింది.



సాన్ అంటోనియోకు చెందిన జార్జ్, ఒరా లీ రోడ్రిగ్యుజ్ తొలిసారి ఓ మీట్ మార్కెట్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత పాఠశాలలో కలిసి చదువుకున్నారు. అప్పడే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. జార్జ్ మిలిటరీలో పనిచేసి వచ్చిన తర్వాత ఒరా లీని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కలిగారు. గడిచినవారమే 58వ పెళ్లిరోజున ఘనంగా జరుపుకున్న ఈ దంపతులు వయస్సు మీద పడటంతో అనారోగ్యానికి గురయ్యారు. జార్జ్ కు స్వల్పంగా గుండెపోటు వచ్చింది.



ఈ నేపథ్యంలో దంపతులిద్దరు పక్కపక్కనే చేతులు పట్టుకొని పడుకొన్నారని, నిద్రలో తన తండ్రి జార్జ్ ప్రాణాలు విడవగా, ఆ తర్వాత మూడు గంటలకు తన తల్లి ఒరా కూడా కన్నుమూసిందని వారి కూతురు కొరినా మార్టినెజ్ స్థానిక ఫాక్స్‌ 29  చానెల్‌కు తెలిపింది. అచ్చం ‘నోట్‌బుక్‌’ హాలీవుడ్‌ సినిమాలో జరిగినట్టే తమ తల్లిదండ్రులు ఒకేసారి ప్రాణాలు విడిచారని, తుదిఘడియల్లోనూ వారు ఒకరి చేతులను ఒకరు పట్టుకొని ఉన్నారని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారి అనుబంధం ఇందుకు కారణమని ఆమె వివరించింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top