పశ్చిమబెంగాల్ లోని నాదియా జిల్లాలో 68 ఏళ్ల వృద్ధుడొకడు తన ఇంటి పక్కనే ఉండే పదమూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనలో కూడా మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. గతంలో పలుమార్లు రాజధాని కోల్కతా సహా పలు ప్రాంతాల్లో బాలికలు, మహిళలపై అత్యాచార సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మరో దారుణ సంఘటన నాదియా జిల్లాలో చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని సేన్పూర్ - శ్యాంనగర్ ప్రాంతంలో 68 ఏళ్ల వృద్ధుడొకడు తన ఇంటి పక్కనే ఉండే పదమూడేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఈనెల నాలుగో తేదీనే ఈ సంఘటన జరిగినా, బాలిక తల్లి కొత్వాలీ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసిన తర్వాతే వెలుగులోకి వచ్చింది. తారక్ దాస్ హైస్కూల్లో చదివే ఆ బాలికపై పొరుగింట్లో ఉండే కాలా చంద్ మోండల్ అత్యాచారం చేశాడు. ఇంటి దగ్గర్లో ఉన్న పొలానికి వెళ్తుండగా అతడీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏడో తరగతి చదువుతున్న ఆ బాలిక భయంతో తొలుత ఎవరికీ చెప్పకపోయినా, తర్వాత తన నాయనమ్మకు శుక్రవారం నాడు విషయం చెప్పింది. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులోనే తానలా చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.