1,200 ఏళ్ల క్రితమే భారత్‌కు పార్శీల వలస | The Parsis migrated to India 1,200 years ago | Sakshi
Sakshi News home page

1,200 ఏళ్ల క్రితమే భారత్‌కు పార్శీల వలస

Jun 17 2017 2:11 AM | Updated on Sep 5 2017 1:47 PM

పర్షియా (నేటి ఇరాన్‌) నుంచి వలస వచ్చిన వారు పార్శీలని, వారు జొరాష్ట్రియన్‌ మతాన్ని అనుసరిస్తారని మనకు చరిత్ర చెబుతుంది.

నిర్ధారించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం  
సాక్షి, హైదరాబాద్‌: పర్షియా (నేటి ఇరాన్‌) నుంచి వలస వచ్చిన వారు పార్శీలని, వారు జొరాష్ట్రియన్‌ మతాన్ని అనుసరిస్తారని మనకు చరిత్ర చెబుతుంది. క్రీస్తు శకం 8–10 శతకంలో తొలి పార్శీ గుజరాత్‌కు వచ్చి, ఆ తరువాత దేశమంతా విస్తరించారని మనకు తెలుసు. జన్యువుల పరంగానూ ఇది నిజమేనని నిరూపించింది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వంలో ఈస్టోనియా, యూకే, పాకిస్తాన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు నిర్వహించారు.

భారత్, పాకిస్తాన్‌లలో స్థిరపడ్డ పార్శీలు, గుజరాత్‌లోని సంజన్‌ ప్రాంతంలో బయటపడ్డ పార్శీల అవశేషాల నుంచి సేకరించిన జన్యువులను పరిశీలించడం ద్వారా వారు సుమారు 1,200 ఏళ్ల క్రితం భారత్‌కు వలస వచ్చినట్లు నిర్ధారించామని శుక్రవారం ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జన్యుపరంగా పార్శీలు నియోలిథిక్‌ ఇరానియన్లకు దగ్గరి వారని ఆయన చెప్పారు. మైటోకాండ్రియల్, వై–క్రోమోసోమల్, ఆటోసోమల్‌ డీఎన్‌ఏ మార్కర్లను ఈ పరిశోధనలో పరిశీలించామని, ఈ ఫలితాలు చరిత్ర పుస్తకాలతో సరిపోలుతున్నాయని సాంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త ఖాసీం అయూబ్‌ పేర్కొన్నారు.

భారత్‌పై ముస్లిం రాజుల దండయాత్రల ప్రభావం పార్శీలపై ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని ఈస్టోనియా బయోసెంటర్‌ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్‌ చౌబే తెలిపారు. పార్శీల గురించి ఇప్పటికే జరిగిన అధ్యయనాలు ఈ విషయాలనే చెబుతున్నప్పటికీ తాము తొలిసారి అత్యాధునిక పద్ధతుల ద్వారా నిర్ధారించడం గమనార్హమని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ కె.మిశ్రా తెలిపారు. పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక జీనోమ్‌ బయాలజీ మేగజైన్‌లో ప్రచురితమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement