తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ నేతలు

Telangana police stop Congress leaders from going to Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సచివాలయంలో పర్యటిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్‌, జీవన్‌ రెడ్డి, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు సోమవారం ఉదయం సచివాలయంలోని అన్ని బ్లాకులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా  సచివాలయం నిర్మాణాలు , నూతన నిర్మాణ భూమి పూజ ప్రాంగణాన్ని నేతలు పరిశీలించారు. కాగా అంతకు ముందు పోలీసులు... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వాహనాన్ని అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను ఎందుకు అడ్డగిస్తున్నారంటూ భట్టి విక్రమార్క సీరియస్‌ అయ్యారు. అలాగే ఆ పార్టీ సీనియర్‌ నేత వీ హనుమంతరావు వాహనాన్ని కూడా పోలీసులు మధ్యలోనే ఆపేశారు. అనంతరం వారిని లోనికి అనుమతించారు.


కాగా నాగార్జునసాగర్‌లో శనివారం జరిగిన టీపీసీసీ సమావేశంలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సచివాలయ సందర్శన ప్రతిపాదన చేశారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్న రేవంత్‌ ప్రతిపాదనకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు ఇతర నేతలు కూడా ఏకీభవించడంతో సోమవారమే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top