నయీం కేసులో సస్పెన్షన్ల ఎత్తివేత! | Suspension dropped on Police officers in Nayeem case | Sakshi
Sakshi News home page

నయీం కేసులో సస్పెన్షన్ల ఎత్తివేత!

Jun 27 2018 1:44 AM | Updated on Oct 16 2018 9:08 PM

Suspension dropped on Police officers in Nayeem case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో పోలీస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేతకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. నయీంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీలు మలినేని శ్రీనివాస్‌రావు, చింతమనేని శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు రాజగోపాల్, మస్తాన్‌లపై సస్పెన్షన్‌ వేటు పడటం తెలిసిందే. గతేడాది మే నుంచి ఈ ఐదుగురు అధికారులు సస్పెన్షన్‌లోనే ఉన్నారు.

వారితోపాటు మరో 11 మంది అధికారులకు అప్పటి డీజీపీ అనురాగ్‌ శర్మ చార్జి మెమోలు జారీ చేశారు. మరో ఆరుగురి నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తంగా 22 మంది అధికారులు నయీంతో సంబంధాలు కొనసాగించారని సిట్‌ తేల్చింది.  సస్పెన్షన్‌కు గురైన అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పోలీస్‌శాఖ నుంచి ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన అందినట్లు హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఏడాదిగా సస్పెన్షన్‌లోనే ఉన్న అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. 2 రోజుల్లో సస్పెన్షన్‌ ఎత్తివేతతోపాటు పోస్టింగ్‌లు కల్పిస్తూ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది.

అదనపు ఎస్పీ సునీతపైనా: వివాహేతర సంబంధం కేసులో సస్పెన్షన్‌కు గురైన అవినీతి నిరోధకశాఖ అదనపు ఎస్పీ సునీతనూ తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఆమెతోపాటు ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డిపైనా సస్పెన్షన్‌ ఎత్తేసే అవకాశం ఉందని పోలీస్‌శాఖ ముఖ్య కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement