వైద్య శాఖలో 13,496 పోస్టుల భర్తీ
శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 13,496 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వైద్యా రోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వీటిలో 5,766 నర్సుల పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీపై బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. నర్సుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ‘దక్షత’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తండ్రికి ఆపరేషన్ జరుగుతున్నా సభకొచ్చా: శ్రీనివాస్గౌడ్
తన తండ్రికి ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరుగుతోందని, అయినా గీత కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు సభకు వచ్చానని, తనకు అదనపు సమయం కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ స్పీకర్ మధుసూదనాచారికి విన్నవించారు. రాష్ట్రంలో గీత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందని.. తాటి, ఈత చెట్లపై దళారీల పెత్తనం పెరుగుతోందన్నారు. బార్లు, రెస్టారెంట్ల లైసెన్సుల్లో గీత కార్మిక యువతకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి పద్మారావు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.69 కోట్లకు పైగా ఈత చెట్లు నాటామని, వాటిని సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కల్లును ఔషధంగానే చూస్తున్నామని, దాని వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనే భావన ఉందన్నారు. ప్రమాదవశాత్తూ మరణించే గీత కార్మికులకు రూ. 6 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు.